జగిత్యాల, మార్చి 5 (నమస్తే తెలంగాణ): ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేకంగా రూ.135 కోట్ల నిధులు కేటాయించడంతో పట్టణం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. ధర్మపురి పట్టణంలో అన్ని అంతర్గత రోడ్ల విస్తరణ చేయాలని స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొప్పుల ఈశ్వర్ సంకల్పించారు. పట్టణవాసులతో చర్చించి, 60 అడుగుల మేర రోడ్లను విస్తరించడంతో పాటు, అన్నింటినీ సీసీగా, వాటి పక్కనే డ్రైన్స్ నిర్మాణం చేపట్టారు. ఇందు కోసం రూ.11.10 కోట్లు కేటాయించారు. పట్టణంలోని ప్రధాన కుంటల్లో ఒకటైన తుమ్మల్ల కుంటను రూ.66 లక్షలతో సుందరీకరించారు. పట్టణంలోని ప్రధాన వీధి ఆయిన వివేకానంద విగ్రహం నుంచి పటేల్ విగ్రహం వరకు, అక్కడి నుంచి గాంధీ విగ్రహం వరకు, అక్కడి నుంచి నంది చౌరస్తా వరకు అంతర్గత రోడ్లను విస్తరించి, సీసీ రోడ్లుగా మార్చివేశారు. దీనికి రూ. 8.57 కోట్లు వెచ్చిస్తున్నారు.
మురుగునీటి గమనం మార్చి..
పట్టణంలోని ప్రధాన మురికి కాలువ నీళ్లు చేరుతుండడంతో గోదావరినది పూర్తిగా కలుషితమైపోయింది. దీంతో భక్తులు స్నానాలు చేసేందుకు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ నేపథ్యంలో మురుగు నీరు నదిలో కలువకుండా రూ.6.5 కోట్లతో అతిపెద్ద డ్రైన్ నిర్మించి, మురుగునీటి గమనాన్ని మార్చివేశారు. దీంతో ప్రస్తుతం గోదావరినదిలోకి మురుగు నీరు చేరడం లేదు.
టెంపుల్ సిటీకి రూ.100 కోట్లు
ఆలయాల అభివృద్ధితో పాటు పట్టణాన్ని సుందరీకరించి, పర్యాటక ప్రాంతంగా రూపొందించేందుకు సమగ్ర ప్రణాళికలో వ్యూహం రూపొందించారు. ధర్మపురి నరసింహస్వామి ఆలయ అభివృద్ధి కోసం రూ.45 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.20 కోట్లు ఆలయం చుట్టూ ఉన్న నిర్మాణాలను తొలగించేందుకు, వారి ఇండ్లు, స్థలాల సేకరణ పరిహారం కోసం కేటాయించారు. ఇక ప్రధాన ఆలయ అభివృద్ధికి రూ.11 కోట్లు, రూ.2.50 కోట్లు ఉగ్ర నృసింహస్వామి ఆలయ అభివృద్ధికి, స్వామి వారి కల్యాణ మండపం నిర్మాణానికి రూ.5 కోట్లు, ఆలయంలో మహారాజ గోపురం నిర్మాణానికి రూ.కోటి వెచ్చించారు.
గోదావరినది ఒడ్డున సంతోషి మాత ఆలయం సమీపంలో మంగళిగడ్డను రూ.5 కోట్ల వ్యయంతో సుందరీకరించారు. జాతీయ రహదారి-63ను గిరి నాగభూషణం పెట్రోల్ బంక్ నుంచి ఎస్ఆర్ఆర్ గార్డెన్ వరకు దాదాపు మూడు కిలోమీటర్ల పొడవున రూ.16 కోట్లతో 6 లైన్ల రోడ్డుగా మార్చుతున్నారు. ఇక పట్టణంలో సమీకృత మార్కెట్ను రూ.4 కోట్లతో నిర్మించారు. ప్రధాన కోనేరును సాలీగ్రామ్గా మార్చాలని నిర్ణయించి, దాని కోసం రూ.2.50 కోట్ల కేటాయించారు. పట్టణంలో అంబేడ్కర్ భవనాన్ని రూ.2 కోట్లతో నిర్మిస్తున్నారు. 32 గదులతో ఉన్న ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి అద్దెగదులపై రూ.5 కోట్లతో మరో 32 గదులు నిర్మిస్తున్నారు.
అలాగే జగిత్యాల-ధర్మపురి, రాయపట్నం-ధర్మపురి మార్గాల మధ్య ధర్మపురి పట్టణ శివారుల్లో రెండు ఆర్నమెంట్ ఆర్చ్ (స్వాగత ద్వారాలు)లను ఏర్పాటు చేస్తున్నారు. శ్రీమహావిష్ణు వాహనమైన గరుడ పురుషుడి విగ్రహాన్ని రాయపట్నం కూడలి వద్ద రూ.30 లక్షలతో ప్రతిష్టించనున్నారు. చింతామణి చెరువులో వరాహస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు రూ.50 లక్షలు కేటాయించారు. రూ.1.50 కోట్లతో పట్టణం మొత్తంగా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు జరుగుతోంది.
సీఎం చల్లని చూపుతోనే ధర్మపురి సిరిపురి
అభివృద్ధి జాడలు లేని ధర్మపురిపై సీఎం కేసీఆర్ చల్లని చూపుతోనే ఈ పట్టణం సిరిపురి అయ్యింది. ఈ క్షేత్రానికి స్వర్ణయుగం వచ్చినట్లయింది. స్వరాష్ట్రంలో ధర్మపురిలో 2015 పుష్కరాలు నభూతో నభవిష్యత్తు అన్న రీతిలో బ్రహ్మాండంగా నిర్వహించారు. ధర్మపురి పట్టణం, టెంపుల్ సిటీ అభివృద్ధి కోసం బడ్జెట్లో రూ.100 కోట్లు మంజూరు చేశారు. మేజర్ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసి రూ.25 కోట్లు ఇచ్చారు. సీఎం కేసీఆర్ ధర్మపురిని సందర్శించిన సందర్భంలో ప్రత్యేక నిధి కింద రూ.10 కోట్లు ప్రకటించి మంజూరు చేశారు. వీటితో పాటు రూ.6కోట్లు డీఎమ్ఎఫ్టీ నిధులు కేటాయించినం.
మొత్తం రూ.141కోట్లతో పట్టణంలో అభివృద్ధి పనులు నడుస్తున్నాయి. త్వరలోనే పూర్తవుతాయి. ఇవే కాకుండా రూ.2 కోట్లతో బోల్ చెరువు ఫిల్టర్ బెడ్ నిర్మాణం చేపట్టి, ధర్మపురికి ప్రతి రోజూ రక్షిత మంచినీటి సరాఫరా చేస్తున్నం. రూ.కోటితో బస్టాండ్ను అభివృద్ధి చేసుకోబోతున్నాం. 30 పడకల దవాఖానను 50 పడకలకు అప్గ్రేడ్ చేయించినం. మినీ స్టేడియం కోసం రూ.2.5 కోట్లు మంజూరయ్యాయి. రెండు బస్తీ దవాఖానలు నిర్మిస్తున్నం. రూ.15 కోట్లతో మురుగు నీటిని శుద్ధిచేసే సీనరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను నిర్మించుకోబోతున్నం. ధర్మపురికి కోర్టు మంజూరై కొనసాగుతున్నది.
– రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్