గంగాధర, మే 20: చొప్పదండి నియోజకవర్గంలో అక్రమారులది ‘ఆడిందే ఆట.. పాడిందే పాట’గా సాగుతున్నదని, మట్టి మాఫియా చేతిలో చెరువులు విధ్వంసానికి గురవుతున్నాయని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు. బుధవారం ఆయన గంగాధర మండలం కురిక్యాల ఊర చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, రామడుగు, గంగాధర, చొప్పదండి, బోయినిపల్లి మండలాల్లో నీటి వనరుల సంరక్షణ కరువైందన్నారు.
చెరువులను సంరక్షించాల్సిన ఇరిగేషన్, మైనింగ్ శాఖల అధికారులే అక్రమ మట్టి తవ్వకాలకు అనుమతులు ఇస్తూ మట్టి మాఫియాకు సహకరిస్తున్నారని ఆరోపించారు. ధనార్జనే ధ్యేయంగా చెరువులను విధ్వంసం చేస్తుంటే చోద్యం చూస్తున్నారని ఎద్దేవా చేశారు. స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, అధికారుల అండదండలతో మట్టి తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని ఆరోపించారు. అనుమతులకు మించి తవ్వుతుండడం చూసి స్థానిక కాంగ్రెస్ నాయకుడే లారీలను అడ్డుకున్నాడని గుర్తు చేశారు. సంబంధిత శాఖ అధికారులు తక్షణమే స్పందించాలని, అక్రమ మట్టి తవ్వకాలను నిలిపివేయించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట మారెట్ కమిటీ మాజీ చైర్మన్ సాగి మహిపాల్రావు, నాయకులు కంకణాల విజేందర్రెడ్డి, రామిడి సురేందర్, ఉప్పుల గంగాధర్, గడ్డం స్వామి, మామిడిపల్లి అఖిల్, బొల్లాడి అనంతరెడ్డి తదితరులు ఉన్నారు.