పెద్దపల్లి, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): వ్యక్తిగత పనుల కోసం తరగతి గదుల్లో సెల్ఫోన్ వినియోగించడం పూర్తిగా నిషేధం. అందుకు సంబంధించి స్పష్టమైన ఉత్తర్వులున్నా మెజార్టీ ఉపాధ్యాయులు పట్టించుకోవడం లేదు. బోధనను ఆపేసి మధ్యమధ్యలో ఫోన్లు మాట్లాడడం వల్ల విద్యార్థుల చదువులపై ప్రభావం పడుతున్నది. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులు, పిల్లల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. దీనిపై జగిత్యాల జిల్లాలో విద్యాధికారి జగన్మోహన్రెడ్డి స్పందించి ఇటీవల ఉత్తర్వులు జారీ చేయగా, మిగిలిన జిల్లాల్లో చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి.
దీనిపై ఈ నెల 15న నమస్తే తెలంగాణ దినపత్రికలో ‘తరగతి గదుల్లో సెల్ఫోన్లు.. విచ్చలవిడిగా వినియోగిస్తున్న ఉపాధ్యాయులు’ శీర్షికన కథనం ప్రచురితం కాగా, పెద్దపల్లి జిల్లా విద్యాశాఖాధికారి మాధవి స్పందించారు. శుక్రవారం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల సమయంలో ఉపాధ్యాయులు తరగతి గదుల్లో సెల్ఫోన్లు వినియోగిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, దీని వల్ల టీచర్ల ఏకాగ్రత దెబ్బతిని బోధన కష్టమవుతుందని చెప్పారు.
దాంతోపాటు విద్యార్థుల దృష్టి చదువు నుంచి మళ్లుతుందన్నారు. పాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత అలాగే కేజీబీవీ, మోడల్ స్కూళ్ల హెచ్ఎంలు, ప్రినిపాల్స్కు తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఇప్పటికే ఇచ్చిన సూచనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. పాఠశాల ప్రాంగణంలో టీచర్లు స్మార్ట్ఫోన్ వినియోగించుకోవడానికి అనుమతి లేదని, క్లాస్ రూముల్లో విద్యార్థుల ఫేస్ రికగ్నైజేషన్ తీసుకునేటప్పుడు, ఇంటర్నెట్ వినియోగించి ఏదైనా పాఠం చెప్పాల్సి వచ్చినప్పుడు, అలాగే అధికారిక సమాచారం ఏదైనా ఇవ్వాల్సి ఉన్నప్పుడు మాత్రమే హెచ్ఎంలు, ప్రిన్సిపాళ్లు అనుమతి తీసుకొని వినియోగించాలని సూచించారు. కానీ, ఇతర కార్యకలాపాలకు ఉపయోగించకూడదని స్పష్టం చేశారు. పని పూర్తయిన తర్వాత సెల్ఫోన్లను మళ్లీ ఇనిస్టిట్యూషన్ హెడ్ కస్టడీలో జమ చేయాలని ఆదేశించారు. సూచనలను కచ్చితంగా పాటించాలని, నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని డీఈవో హెచ్చరించారు.