సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా యంత్రాగం అప్రమత్తమైంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇప్పటికే రంగంలోకి దిగింది. ఎలక్షన్లు ఎప్పుడొచ్చినా సజావుగా నిర్వహించేందుకు అన్ని హంగులనూ సమకూర్చుకుంటున్నది. అందులో భాగంగా 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు 7,189 బ్యాలెట్ యూనిట్లు రాగా, వాటిని తనిఖీ చేసి స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచింది. మరోవైపు 3,494 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించి, రూట్మ్యాప్ను సిద్ధం చేసింది. మరోవైపు ఓటరు ముసాయిదా జాబితా రూపొందిస్తూనే.. ఈసీ ఆదేశాలతో ఓటర్ నమోదుకు కొత్తగా అవకాశమిచ్చి వచ్చే అక్టోబర్ 4న తుది జాబితా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నది. ఇంకోవైపు ఎన్నికల నిబంధనల ప్రకారం భారీగా బదిలీల ప్రక్రియ మొదలైంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి జిల్లా మొత్తం మీద సుమారు 600 మంది అధికారులకు ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశమున్నది.
– కరీంనగర్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) కలెక్టరేట్
కరీంనగర్, ఆగస్టు 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కలెక్టరేట్: రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల సంఘం సమాయత్తమవుతున్నది. ఆ మేరకు జిల్లాలకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ అప్రమత్తం చేస్తున్నది. ఉమ్మడి జిల్లా పరిధిలోని 12 నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులు, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లను నియమిస్తూ ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది. అలాగే ఈవీఎంలతోపాటు పోలింగ్ సామగ్రి జిల్లాలకు పంపించింది. దీంతో ఉమ్మడి జిల్లా అధికారులు రంగంలోకి దిగారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సజావుగా నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. ఎక్కడా లోటుపాట్లు తలెత్తకుండా పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. షెడ్యూల్ జారీ అయ్యే నాటికే.. క్షేత్రస్థాయిలో ఎలక్షన్ల నిర్వహణకు అవరమైన కసరత్తు చేస్తున్నారు. ఓవైపు కీలకమైన ఓటర్ల జాబితా సవరణ సాగుతుండగా.. మరోవైపు జిల్లాల వారీగా కలెక్టర్లు తుది జాబితా తయారీపై స్పష్టమైన ఆదేశాలివ్వడంతో ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలకు అవసరమయ్యే 7,189 బ్యాలెట్ యూనిట్లు, 5,577 కంట్రోల్ యూనిట్లు, 5,619 వీవీ ప్యాట్లు రాగా, మొదటిస్థాయి పరిశీలన పూర్తి చేశారు. ఆయా జిల్లాల్లోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలన ప్రక్రియను పూర్తిచేసిన యంత్రాంగం అత్యంత కీలకమైన ఈవీఎంలు, వీవీప్యాట్లు, సీపీయూలను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. వాటికి సీల్ వేసి సెక్యురిటీ సిబ్బందిని ఉంచారు.
అక్టోబర్ 4న తుది జాబితా
ఒకవైపు ఓటర్ల జాబితా సవరణ చేస్తున్న అధికారులు, మరోవైపు ఈ నెల మూడో వారంలో లేదా అంతకుముందుగానే జాబితాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జాబితా వెల్లడి అనంతరం ఓటర్ల మార్పులు, చేర్పులు, తొలగింపులు, సవరణకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించి.. వచ్చిన అభ్యంతరాలను సెప్టెంబర్లో పరిశీలించనున్నారు. ప్రధానంగా ఇదే నెలలో మరోసారి కొత్త ఓటర్ల నమోదు చేస్తామని అధికారులు చెబుతున్నారు. పూర్తిస్థాయిలో పరిశీలించి.. ఓటరు తుది జాబితాను వచ్చే అక్టోబర్ 4న ప్రకటించనున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులకు కలెక్టర్లు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ జాబితాలో పేరు నమోదైనవారు మాత్రమే ఓటేసే అవకాశముంటుంది. ఇంకోవైపు సాంకేతిక సహాయంతో బోగస్ ఓటర్ల ఏరివేత కార్యక్రమం దాదాపుగా పూర్తి కావచ్చింది.
ఫొటో సిమిలర్ ఎంట్రీస్ సాఫ్ట్వేర్ ద్వారా రెండు ఓట్లు కలిగి ఉన్నవారిని గుర్తించి తొలగించడంతోపాటు మరణించిన వారి ఓట్లు కూడా తొలగిస్తున్నారు. ఓట్ల తొలగింపుపై గతంలో వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకున్న అధికారులు ఈసారి పకడ్బందీగా ఈ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. విచారణ చేసిన బీఎల్వోల నుంచి లిఖిత పూర్వక పత్రాలు తీసుకున్న తదుపరి మాత్రమే బోగస్ ఓట్లను తొలగిస్తున్నారు. ఓటరు జాబితా సవవరణపై అధికారులు బూత్స్థాయి అధికారులు, సూపర్వైజర్లు, సహాయ ఎన్నికల అధికారులతో కలెక్టరేట్లలో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో కూడా సమావేశాలు కొనసాగిస్తున్నారు.
3,494 పోలింగ్ కేంద్రాలు
ఓ వైపు ఓటర్ జాబితా ప్రక్రియ సాగుతుండగానే మరోవైపు 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఉమ్మడి జిల్లాలో 3,494సెంటర్లను గుర్తించారు. వీటిలో ఏర్పాట్ల కోసం ప్రణాళిక సిద్ధం చేశారు. వృద్ధులు, దివ్యాంగులు కూడా పోలింగ్ బూత్లకు వచ్చి ఓటు హకు వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపులు రూపొందించనున్నారు.
కొనసాగుతున్న బదిలీలు
ఉమ్మడి జిల్లాలో ఎన్నికల విధులతో ప్రత్యక్ష సంబంధమున్న అధికారులు, ఉద్యోగుల బదిలీల పర్వం కొనసాగుతున్నది. తహసీల్దార్ల నుంచి కలెక్టర్ల వరకు ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయి. జోనల్, మల్టీజోనల్, స్టేట్ కేడర్ పోస్టుల వారీగా బదిలీలు జరుగుతుండగా, ఒక అంచనా ప్రకారం ఉమ్మడి జిల్లాలో అన్ని విభాగాల్లో కలిపి 600 మందికిపైగా స్థాన చలనం కలిగే అ వకాశముందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పలువురు ఐఏఎస్లతోపాటు ఆర్డీవోలు, కొందరు తహసీల్దార్ల బదిలీలు పూర్తయ్యాయి. పోలీస్ శాఖలోనూ ఎస్ఐల నుంచి ఏసీపీ స్థాయి అధికారుల వ రకు బదిలీలు జరిగాయి. ఈ నెల మొదటి, రెండో వారాల్లో చాలా మందికి ట్రాన్స్ఫర్లు కానున్నాయి.
ఓటింగ్ శాతం పెంపుపై అవగాహన
గతానుభవాల నేపథ్యంలో అధికారులు ఓటింగ్ శాతం పెంపుపై ఇప్పటినుంచే దృష్టి సారించారు. గతంలో తకువ ఓటింగ్ నమోదైన ప్రాంతాల్లో ఓటు ప్రాధాన్యతను తెలుపడంతోపాటు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే ఓటర్లలో నెలకొన్న అపోహలు తొలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రెండు ఆటోలు ఏర్పాటు చేసి, ఈవీఎం, వీవీప్యాట్లు, కంట్రోల్ యూ నిట్లతో అవగాహన కల్పిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు కావాల్సిన వ్యూహం సిద్ధం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో గతంలో జరిగిన సంఘటనల వంటివి తిరిగి పునరావృతం కాకుండా చూడడంతోపాటు ఎన్నికల సమయంలోనూ ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మాట్లాడుతున్నారు.