Keshanapalli | ముత్తారం, సెప్టెంబర్ 4 : ముత్తారం మండలంలోని కేశనపల్లి గ్రామ సమీపంలో కెనాల్ కాల్వలో ఓ యువకుడి మృతదేహం లభ్యమైన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన బండ సాయిరాం (21) మృతదేహంగా పోలీసులు గుర్తించారు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సాయిరాం మూడు రోజుల క్రితం ముత్తారం మండలంలోని హరిపురం గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి వచ్చాడు. అక్కడి నుంచి ద్విచక్ర వాహనంపై ఖమ్మంపల్లి గ్రామంలోని మరో బంధువుల ఇంటికి వెళ్లేందుకు బయలుదేరాడు.
ఈ క్రమంలో కేశనపల్లి గ్రామ సమీపంలోని కెనాల్ కాల్వలో ప్రమాదవశాత్తు పడిపోయి గల్లంతైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేశనపల్లి గ్రామ సమీపంలోని కెనాల్ కాల్వలో శుక్రవారం పొలం పనులకు వచ్చిన కూలీలకు దుర్వాసన రావడంతో వెళ్లి చూడగా మృతదేహం తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఎస్సె రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.