ఇటీవలి అతి భారీ వర్షాలతో అపార నష్టం వాటిల్లింది. పోటెత్తిన వరద విధ్వంసం సృష్టించింది. లోతట్టు ప్రాంతాలను ముంచెత్తి, అతలాకుతలం చేసింది. వాగులు, వంకలు పొంగి పొర్లి పెద్దసంఖ్యలో రోడ్లు, కల్వర్టులు, వంతెనలు కొట్టుకుపోయాయి. వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. అయితే విపత్తు సమయంలో రాష్ట్ర సర్కారు ముందే అప్రమత్తమైంది. ఈ మేరకు జిల్లాల వారీగా జిల్లా యంత్రాంగాన్ని రంగంలోకి దించి, ఎప్పటికప్పుడు పర్యవేక్షించింది. వానలు తగ్గినా సహాయక చర్యలు ముమ్మరం చేసింది. మరోవైపు పునరుద్ధరణ పనులతోపాటు నష్టం అంచనా చేయిస్తున్నది. మొత్తంగా ప్రభుత్వం ముందుచూపుతో ప్రాణనష్టం తప్పగా, జనజీవనం సాధారణ స్థితికి చేరుకున్నది.
– కరీంనగర్, జూలై 29 (నమస్తే తెలంగాణ)
మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు అపార నష్టం వాటిల్లింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావడంతో వరద పోటెత్తింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. దీంతో రోడ్లు భారీగా దెబ్బతిన్నాయి. వేలాది విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నేలకూలాయి. ఇక నాట్ల దశలోనే ఉన్నప్పటికీ వేలాది ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగింది. పలు చోట్ల చెరువులు, కుంటలకు గండ్లు పడగా, చాలా గృహాలు నేలమట్టమయ్యాయి. వాగులు మహోగ్రంగా ప్రవహించడంతో లోలెవల్ వంతెనలైన కాజ్వేలపై తారు రోడ్లు కొట్టుకుపోయాయి. అయితే, ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తల చర్యల వల్ల ఆస్తినష్టం తప్ప, ఎలాంటి ప్రాణహాని జరుగలేదు. కాగా, జరిగిన నష్టాన్ని శాఖల వారీగా అధికారులు అంచనాలు వేస్తుండటంతోపాటు నష్టాన్ని పూరించే చర్యలను శరవేగంగా చేపడుతున్నారు.
కరీంనగర్, జూలై 29 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసిన రామడుగు మండలంలోని మోతె గ్రామంలో భారీగా నష్టం వాటిల్లింది. మోతె కల్వర్టు వద్ద పంట భూములు కోతకు గురయ్యాయి. ఈ గ్రామానికి చెందిన మామిడిపెల్లి దేవయ్య, నర్సయ్య, నిఖిల్, శివసాయి, లత అనే రైతుల పట్టా భూములు కోతకు గురై నష్టం వాటిల్లింది. ఇదే మండలంలోని వన్నారం, సుద్దాలపల్లి మధ్య రోడ్డు కొట్టుకుపోయింది ఇక్కడి చెక్ డ్యాం నుంచి వచ్చిన వరద కారణంగా వరాల రాములు, మనోహర్, ఎలగందుల సత్యనారాయణ, గజ్జెల దుర్గయ్య, జాడి లింగమూర్తి అనే రైతుల భూములు కోతకు గురయ్యాయి. ఇసుక మేటలు పెట్టాయి.
640 ఎకరాల్లో ఇసుక మేటలు
జిల్లాలో కురిసిన అతిభారీ వర్షాల కారణంగా పంట లు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వరి, పత్తి చేళ్లలో ఇసుక మేటలు పెట్టాయి. 640ఎకరాల్లో ఇసుక మే టలు పెట్టినట్లు జిల్లా వ్యవసాయ అధికారులు తెలిపారు. ఇటు కూరగాయ పంటలూ దెబ్బతిన్నాయి.