రాజన్న సిరిసిల్ల, మార్చి 17 (నమస్తే తెలంగాణ): అకాల వర్షం రైతన్నకు తీరని నష్టాన్ని తెచ్చింది. శనివారం రాత్రి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. దాదాపు రెండు గంటలపా టు ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన అతలాకుతలం చేసింది. ముఖ్యంగా మూడు నాలుగు మండలాల్లో వరి, మక్క, కూరగాయల తోటలు దెబ్బతినగా, మామిడి పిందెలు నేలరాలాయి. రైతన్న ఆశలను ముంచాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వడగడ్ల వర్షం అన్నదాతలను నిండా ముంచింది. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు 500 ఎకరాల నష్టం జరిగినట్లు తెలుస్తున్నది. జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లో 1.83లక్షల ఎకరాల్లో యాసంగి పంటలు సాగు చేశారు. అందులో వరి 1,73,100, మక్క 1014, నువ్వులు 240 ఎకరాలు, పొద్దుతిరుగుడు 303, శనగ 392, ఆయిల్ఫాం 687, కూరగాయలు 550, పండ్లతోటలు 5,467, ఉద్యాన పంటలు 6,317ఎకరాలలో సాగు చేశారు. మరో పదిహేను రోజుల్లో పంట చేతికొస్తుందనుకుంటే వడగళ్ల వర్షం రైతులపై పగబట్టింది. శనివారం రాత్రి పెద్ద పెద్ద రాళ్లతో కూడిన వర్షం పంటలను ధ్వంసం చేసింది. గంభీరావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లి, సిరిసిల్ల పట్టణంలో భారీ వర్షం కురిసింది. రెండు గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి భారీగా పంట నష్టం జరిగింది.
వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం జిల్లాలో 500 ఎకరాల్లో వరి పంట నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా అందులో గంభీరావుపేట మండలంలోనే ఎక్కువ జరిగింది. ఇప్పటి వరకు తెలిసిన సమాచారం ప్రకారం 350 ఎకరాల వరి నష్టం జరిగినట్లు చెబుతుండగా, వందలాది ఎకరాల వరి, మామిడి తోటలు నష్టం జరిగే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఇక వీర్నపల్లి మండలంలో 58, ముస్తాబాద్ మండలంలో 28 ఎకరాల్లో వరి నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేసింది. ఇంకా వ్యవసాయశాఖ ఇంకా సర్వే జరుపుతున్నది. గంభీరావుపేట మండలంలో దాదాపు 400 మంది రైతులకు సంబంధించి వెయ్యి ఎకరాల వరకు నష్టం జరిగినట్లు రైతులు తెలిపారు. వీర్నపల్లి మండల కేంద్రంతో పాటు వనపల్లి, శాంతినగర్, లాల్సింగ్ తండా, రంగంపేట, గ్రామాల్లో వరి దెబ్బతిన్నది. మామిడి తోటలు నేలమట్టమయ్యాయి. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
అకాలవాన, వడగండ్లతో కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఎలుబాక, కిష్టంపేట గ్రామాల్లో వరి దెబ్బతిన్నది. ఎలుబాకలో పిల్లి రవియాదవ్, రొండ్ల రాజకొమురయ్య, ముదం రవీందర్, నూగిల్ల శంకర్, మాడ తిరుపతిరెడ్డి, తెడ్ల శంకర్, మడికొండ ఎల్లయ్యకు చెందిన 15 ఎకరాల వరిపంట, 5 ఎకరాల మక్క నేలకొరిగింది. మా నకొండూర్ మండలం కొండపల్కల, గంగిపల్లి, మద్దికుంట, చెంజర్ల, ముంజంపల్లి పలు గ్రామాల్లో వరి పం ట, మామిడి తోటలు దెబ్బతిన్నాయి. కొండపల్కలలో దాదాపు 20 ఎకరాల మేర వరి పైరు నేలకొరిగింది.