దళితబంధు రెండో విడుత నిధుల కోసం దళితలోకం ఎదురుచూస్తున్నది. గత కేసీఆర్ సర్కారు సాయం అందించే ప్రక్రియ చేపట్టినా.. ఎన్నికల కోడ్తో నిలిచిపోయింది. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెల గడుస్తున్నా.. ఎలాంటి స్పష్టత లేక ఆందోళన వ్యక్తమవుతున్నది. పథకం అమలులో జాప్యాన్ని నిరసిస్తూ ఇప్పటికే హైదరాబాద్ ప్రజాదర్బార్లో దరఖాస్తులు సమర్పించారు. అయినా పరిష్కారం కాకపోవడంతో పైలెట్ ప్రాజెక్టు హుజూరాబాద్ నియోజకవర్గంలోని లబ్ధిదారులు సోమవారం కరీంనగర్ ప్రజావాణికి పెద్దసంఖ్యలో తరలివచ్చారు. తమకు రెండో విడుత నిధులు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలంటూ నిలదీశారు. వెంటనే ప్రభుత్వం స్పందించాలని, లేకుంటే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
కరీంనగర్ కలెక్టరేట్, జనవరి 8 : దళితబంధు రెండో విడుత నిధులు వెంటనే జమచేయాలని హుజూరాబాద్ నియోజకవర్గ దళితబిడ్డలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల రోజులవుతున్నా ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ.. సోమవారం వంద మందికిపైగా కరీంనగర్ కలెక్టర్లోని ప్రజావాణికి తరలివచ్చారు. రెండో విడుత నిధులు వెంటనే ఇవ్వాలని కలెక్టర్ పమేలా సత్పతికి వేర్వేరుగా వినతిపత్రాలు అందజేశారు. తమ ఖాతాల్లో ఇదివరకే నిధు లు జమైనా విడిపించుకోకుండా అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ ఫిర్యాదు చేశా రు.
నెలల తరబడి తిరుగుతున్నా, పట్టించుకోవడం లేదని విమర్శించారు. తమకు తక్షణమే సమాధానం చెప్పాలని, లేదంటే ఆందోళనకు దిగుతామనడంతో ఉన్నతాధికారులు వద్దని వారించారు. ప్రభుత్వం నుంచి గైడ్లైన్స్ రాగానే నిధులు విడుదల చేస్తామని వారు స్పష్టం చేయగా, పాత లబ్ధిదారులకు కొత్త గైడ్లైన్స్ ఎందుకనే సంశయం వ్యక్తం చేస్తూ, బయటకు వచ్చారు. తర్వాత కూడా కలెక్టరేట్ ఆవరణలో నిరసన తెలిపారు. నిర్దిష్ట గడువులోగా తమకు మంజూరైన నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవం క మండలాల నుంచి దళితబంధు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో వచ్చిన విషయం తెలియడంతో కరీంనగర్ జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ వెంటనే అక్కడకు చేరుకొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ, అధికారుల నిర్లక్ష్యం వల్లే పైలెట్ ప్రాజెక్టు హుజూరాబాద్ నియోజకవర్గంలో సుమారు ఎనిమిదివేల మంది లబ్ధిదారులకు ఇప్పటికీ రెండో విడుత నిధులు విడుదల కాలేదని మండిపడ్డారు. లబ్ధిదారుల ఖాతాల్లో ఉన్న 5లక్షలు కూడా ఫ్రీజ్ చేయడంతో ఆందోళన నెలకొన్నదన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.
దళితులను ధనవంతులను చేసేందుకు అప్పటి సీఎం కేసీఆర్ సారు దళితబంధు తెచ్చిండు. మాలాంటి పేదోళ్లను ఎంపిక చేసిండు. అయితే, అధికారులు మాత్రం మాపై వివక్ష చూపుతున్రు. రెండో విడత ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్రు. ఈడీ అసలు పట్టించుకోవడం లేదు. 45 రోజులు సెలవులో వెళ్లి, ఎన్నికల్లో వచ్చిండు. అప్పుడు ఎన్నికల కోడ్ ఉందన్నడు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం నుంచి అనుమతి రావాలంటున్నడు. అప్పులు తెచ్చి వ్యాపారం అభివృద్ధి చేసిన. రెండో విడత డబ్బులు రాగానే అప్పులు తీరుద్దామనుకుంటే అధికారులు ఇట్లా చేస్తున్నరు. వెంటనే ప్రభుత్వం స్పందించాలి. మా ఖాతాల్లో నిధులు జమ చేసేలా చర్యలు తీసుకోవాలి.
– అక్కనపల్లి జయ, దళితబంధు లబ్ధిదారులు (కనగర్తి)
దళితుల ఆర్థిక ఎదుగుదల కోసం కేసీఆర్ సారు దళితబంధు తెచ్చిండు. కానీ, కొంతమంది అధికారులే నీరుగారుస్తున్నరు. దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా వాటిని పరిశీలించడం లేదు. మొదటి విడుతగా విడుదలైన నిధులతో వ్యాపారాలు ఏర్పాటు చేసుకున్నం. విస్తరించుకున్నం. అయినా రెండో విడుత ఇవ్వాల్సిన మిగతా మొత్తం మా ఖాతాల్లో జమచేస్తలేరు.
అధికారులనడిగితే రేపు, మాపు అంటూ సాగదీసిన్రు. తర్వాత ఈడీ సెలవులో ఉన్నడని, ఎన్నికల కోడ్ వచ్చిందని మభ్యపెట్టిన్రు. కొత్త ప్రభుత్వం వచ్చి దళితబంధు నిధులు హోల్డ్లో పెట్టింది. దీంతో నిధులు విడుదల అవుతాయా..? లేదా..? అని ఆందోళన చెందుతున్నం. దీనంతటికీ కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి. వెంటనే రెండో విడత నిధులు మా ఖాతాల్లో జమచేయాలి.
– చల్ల గీత, లబ్ధిదారురాలు (జమ్మికుంట)