కోనరావుపేట, మార్చి 10 : కాంగ్రెస్ పభుత్వంలో రైతులకు నీళ్లు, కరెంటు కష్టాలు మళ్లీ మొదలయ్యాయని, వారికి కన్నీళ్లే మిగులుతున్నాయని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని బావుసాయిపేటకు చెందిన కూలీలు విద్యుత్ షాక్ గురై వేములవాడ ఏరియా దవాఖానలో చికిత్స పొందుతుండగా వారిని పరామర్శించడంతో పాటు, సిరిసిల్లలో భూమయ్య మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయంలో పదేండ్లు రైతులు ఎలాంటి కష్టా లూ లేకుండా సంతోషంగా పంటలను పం డించుకున్నారని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూణ్ణెళ్లలోనే ఎంతో మంది రైతులు కరెంటు, నీళ్లు లేక అరిగోస పడుతున్నారన్నారు. దీంతో మళ్లీ కరెంటు బావుల వద్ద విద్యుత్ షాక్లతో రైతు లు మృతిచెందుతున్నారని గుర్తు చేశారు.
అధికారంలోకి వచ్చి బీఆర్ఎస్పై నిందలు వేస్తూ కాలాయాపన చేయడం తప్ప మరొకటి లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ రైతులకు నీళ్లందిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. మేడిగడ్డ బరాజ్ పిల్లర్ల మరమ్మతులపై ఊసెత్తడం లేదని మండిపడ్డారు. దీంతో రైతులకు సాగునీరందక కన్నీళ్లు పెట్టుకుంటున్నారని గుర్తుచేశారు. పంట కాపు దశకు వచ్చి పూర్తిగా ఎండిపోవడంతో పశువులను మేపుతున్నారని చెప్పారు. చెరువులు, కుంటల్లో నీళ్లు లేక బోర్లు, బావులు అడుగం టి పోతున్నాయన్నారు. దీంతో రైతులు నీళ్ల కోసం వెళ్లి కరెంటు షాక్లకు బలవుతున్నారని చెప్పారు.
మృతుడు భూమయ్య కుటుంబ సభ్యులకు తక్షణ సాయం కింద రూ.5లక్షలు ఇవ్వాలని, సెస్ సంస్థ ద్వారా ఆదుకోవాలని కోరారు. వారి కుటుంబ సభ్యులకు తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఆయన వెంట మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ఎంపీపీ చంద్రయ్యగౌడ్, సింగిల్ విండో చైర్మన్ నర్సయ్య, సెస్ వైస్ చైర్మన్ దేరవకొండ తిరుపతి, నాయకులు న్యాలకొండ రాఘవరెడ్డి, రామతీర్థపు రాజు ఉన్నారు.