ముత్తారం, మార్చి 26: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మార్పు వస్తుందని గొప్పలు చెప్పారని.. మార్పు అంటే 138 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడమా..? అని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహించారు. ఆత్మహత్యలు లేని తెలంగాణగా తీర్చిదిద్దుకున్న రాష్ట్రంలో మళ్లీ ఆత్మహత్యలు మొదలయ్యాయని, రైతుల ఆత్మహత్యల కోసమేనా తెలంగాణ తెచ్చుకున్నామా..? అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ప్రతి ఎకరాకూ సాగునీరందిస్తామంటూ రైతులను నమ్మించి గొంతు కోశారని మండిపడ్డారు.
నీళ్లు లేక ఎండిన పొలాలకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ముత్తారం మండలం సీతంపల్లి, రామకృష్టాపూర్ గ్రామాల్లో ఎండిన పంటలను మంగళవారం జడ్పీ చైర్మన్ ఫుట్ట మధూకర్తో కలిసి ఆయన పరిశీలించారు. ఎండుతున్న పంటలను చూసి చలించిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై ధ్వజమెత్తారు. యాసంగి పంటలకు సాగునీరు ఇవ్వలేమని ముందుగానే ప్రకటిస్తే రైతులు ఇలా నష్టపోయే పరిస్థితి ఉండేది కాదని చెప్పారు.
ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు తప్పిదం వల్లే పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన చెందారు. కేసీఆర్ ప్రభుత్వంలో కరెంట్, సాగునీటి కష్టాలు లేవని, గతేడాది యాసంగి సమయంలో పుషలమైన నీరందించామని గుర్తు చేశారు. ఇకడ బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పోతిపెద్ది కిషన్ రెడ్డి, ఎంపీపీ జకుల ముత్తయ్య, వైస్ ఎంపీపీ సుధాడి రవీందర్ రావు, సింగిల్ విండో మాజీ చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి, ఎంపీటీసీ అల్లం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
మార్పు అంటే ఇంత గొప్పగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. పదేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో పాలనలో ఎలా ఉండేదో ఇప్పుడు అలాంటి పరిస్థితే కనిపిస్తున్నది. రైతులను మళ్లీ రోడ్లపైకి తెచ్చి అరిగోస పెడుతున్నారు. సాగునీరు లేక పంటలు ఎండిపోయి అన్నదాత కన్నీరు పెడుతుంటే.. ముఖ్యమంత్రి మాత్రం హోలీ సంబరాల్లో మునిగిపోయారు. రైతులు ఎన్ని కష్టాలు పడ్డా ఈ ప్రభుత్వానికి అవసరం లేదు. మేము మాత్రం అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఎండిన పంటలను పరిశీలించి రైతులకు ధైర్యం చెబుతున్నాం. బీఆర్ఎస్ పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచి నష్టపరిహారం అందేలా పోరాటం చేస్తాం. న్యాయం జరిగే వరకు పోరాడుతాం.
– పుట్ట మధూకర్, పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్
నేను ఇరువై ఏండ్ల సంది ఎవుసం చేస్తన్న. నా కరెంట్ మోటారు పారకం బొక్కలవాగుకు ఉంటది. సీఎం వైఎస్సార్ ఉన్నప్పుడు కరెంట్ సక్కగ లేక పొలాలు ఎండిపోయినయంటే మళ్ల ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అచ్చినంక ఎండి పోతున్నయి. అప్పటి లెక్కనే కరెంట్, సాగునీటి గోసలు మొదలయినయి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ బాధాలేకుంట సాగు చేసుకున్నం. సరిపడా కరెంట్, నీళ్లు ఇచ్చిన్రు. కాంగ్రెస్ ప్రభుత్వం మేము నీళ్లు ఇస్తం, కరెంట్ ఇస్తం అని చెప్పి ఇట్ల మమ్ములను ఆగం చేసింది.
రోజుకు వెయ్యి రూపాయల డిజిల్ కోసం ఖర్చు చేసిన కూడా ఒక్క దొయ్య కూడా పారుతలేదు. కరెంట్ ఉన్నప్పుడు నీళ్లు అస్తలేవు. నీళ్లు ఉన్నప్పుడు కరెంట్ అత్తలేదు. నేను రూ. 3లక్షల అప్పు తెచ్చి మల్లెపల్లిలో పదెకరాలు సాగు చేసిన. నీళ్లు లేక పంటలు ఎండి పోతనయి. ఇప్పుడు నీళ్లు ఇయ్యక పోతే నేను రూ.3లక్షలు మునుగుడె. మాకు ఇంకో ఇరువై రోజులు నీళ్లిస్తే ఈ ప్రాంత రైతుల పంట పొలాలన్నీ పండుతయి. లేకుంటే మేమంతా మందు తాగి సచ్చుడే అయితది.
– గోసికె శంకర్, రైతు, మల్లేపల్లి (మంథని)
మంథని, మార్చి 26 : ఆరుగాలం కష్టించి పండించిన పంట చివరి దశలో ఎండిపోయే పరిస్థితి ఉందని, ప్రభుత్వం వెంటనే సాగునీరు అందించాలని రైతులు డిమాండ్ చేశారు. మంథని పట్టణంలోని పోచమ్మవాడ, మల్లెపల్లికి చెందిన రైతులు మంథని-గోదావరిఖని ప్రధాన రహదారిపై ట్రాక్టర్, ఆటోలు, బైక్లను అడ్డుగా పెట్టి పురుగుల మందు డబ్బాలు, ఎండిన వరి పైర్లను పట్టుకొని బైఠాయించారు. ‘జై జవాన్.. జై కిసాన్’ అంటూ నినదించడంతోపాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కొన్నేండ్లుగా కన్నాల ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా మంథని, అంగుళూరు, మల్లేపల్లి, నాగారం, విలోచవరం గ్రామ శివారుల్లో పంట పొలాలకు నీరందేదని, అలాగే ఎస్సారెస్పీ, గుండారం ప్రాజెక్టుల ద్వారా సైతం సరిపడా సాగునీరు వచ్చేదన్నారు.
కానీ, ఇప్పుడు చుక్క నీరు రావడంలేదని, పంటలన్నీ ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కన్నాల ప్రాజెక్టు కాలువల వెంట రైతులు మోటర్లు పెట్టడంతో తమ పంటలు సాగు నీరందక పూర్తిగా ఎండిపోతున్నాయని, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోయారు. వెంటనే కన్నాల ప్రాజెక్టు కాలువ వెంట ఉన్న మోటర్లు తీయించడంతో పాటు ఎస్సారెస్పీ కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ వెంకటకృష్ణ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ధర్నాను విరమింపజేసే ప్రయత్నం చేయగా, రైతులు భీష్మించారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ రైతు సీఐ కాళ్లు పట్టుకొని ప్రయత్నం చేయగా వారు అడ్డుకున్నారు. అధికారులు వచ్చి హామీ ఇస్తేగానీ ఇక్కడి నుంచి కదలమని చెప్పగా, ఇరిగేషన్ శాఖ ఈఈ బలరామయ్య వచ్చి రైతులతో ప్రత్యేకంగా మాట్లాడారు. కన్నాల ప్రాజెక్టు నుంచి వచ్చే కాలువకు రైతులు మోటార్లు పెడుతున్న విషయం తమ దృష్టికి రాలేదని, వెంటనే తొలగించేలా చర్యలు తీసుకుంటామని, సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.
గతంలో ఎన్నడు మాకు సాగునీటి సమస్యలు రాలేదు. ఏ కాలమైనా సరే పంటలకు పుష్కలంగా నీరందింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే సాగునీటి కరువు వచ్చింది. ఎస్సారెస్పీ కింద వారబందీ పద్ధతిలో గుండారం ప్రాజెక్టు ద్వారా నీరందిస్తామని అధికారులు చెబితేనే మేం పంటలు వేశాం. తీరా పంటలు చేతికందివచ్చిన తర్వాత నీళ్లు ఇవ్వడం లేదు. నీళ్లు రావని ముందే చెప్తే అప్పు తెచ్చి పంటలు వేసేటోళ్లం కాదు కదా..? కన్నాల ప్రాజెక్టు కాలువకు మోటర్లు పెట్టుడుతోటే మా పొలాలకు నీళ్లొస్తలేవు. దాదాపు 1800 ఎకరాలు ఎండి పోయే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి నీటిని విడుదల చేయాలి.
– సత్యనారాయణ, రైతు (మంథని)
అధికార పార్టీ అండదండలతో ఆ పార్టీకి చెందిన కొంత మంది రైతులు నీళ్లను అక్రమంగా తరలించుకుపోతున్నరు. ఎన్నోఏండ్లుగా కన్నాల ప్రాజెక్టు కెనాల్, ఎస్పారెస్పీ కాలువ, గుండారం రిజర్వాయర్ ఆధారంగానే మేం పంటలు సాగు చేస్తున్నం. గత పదేండ్లలో ఎప్పుడూ సాగునీళ్లకు ఇబ్బంది రాలె. కానీ కొత్త ప్రభుత్వం వచ్చుడేందోగానీ.. కరువు మొదలైంది. కన్నాల ప్రాజెక్టు నుంచి మాకు వచ్చే నీటిని రానివ్వట్లేదు. అధికార పార్టీ అండదండలతో కొందరు కెనాల్ మీద మోటర్లు పెట్టుకొని నీటిని తరలించుకుపోతున్నరు. అధికారులు వెంటనే స్పందించి మోటర్లు తొలంచాలి.
– ఎరుకల రవి, రైతు (మల్లేపల్లి)
గంగాధర, మార్చి 26 : వరద కాలువకు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని గంగాధర మండలంలోని కొండన్నపల్లి, రంగరావుపల్లి, తాడిజెర్రి గ్రామాల రైతులు రోడ్డెక్కారు. కరీంనగర్ జగిత్యాల రహదారిలో కొండన్నపల్లి కురిక్యాల మధ్య వరదకాలువ బ్రిడ్జిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తాము వరద కాలువపై ఆధారపడి యాసంగి పంటలు సాగు చేశామని, ప్రస్తుతం పొలాలు పొట్టదశలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వరదకాలువకు ప్రభుత్వం నీటిని విడుదల చేయకపోవడంతో నీరు అడుగంటి సాగునీటి కష్టం వచ్చిందని ఆవేదన చెందారు.
మూడు రోజుల క్రితం సాగునీటి కోసం తాము ధర్నా చేయడానికి ప్రయత్నిస్తే నీటిని విడుదల చేస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హామీ ఇచ్చారని, దీంతో తాము ధర్నా విరమించినట్లు గుర్తు చేశారు. కాగా, మూడు రోజులైనా నీళ్లు రాకపోవడంతోనే ఆందోళనకు దిగినట్లు చెప్పారు. వరదకాలువకు నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. నీరు ఇవ్వకుంటే పంటలు ఎండిపోయి తీవ్రనష్టం వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముందే చెప్తే పంటలు సాగు చేసేవారిమి కాదని, నీటిని విడుదల చేస్తామని చెప్పి సమయానికి విడుదల చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, చొప్పదండి సీఐ ప్రకాశ్గౌడ్, ఎస్ఐ కిరణ్రెడ్డి రైతులతో మాట్లాడి ధర్నాను విరమింపజేశారు.
సాగు నీరు అందక వేసిన పంటలు కండ్ల ముందే ఎండిపోతుంటే ఏం చేసుడో అర్థమైతలేదు. కొండన్నపల్లి శివారుల మాకు ఆరున్నర ఎకరాల వ్యవసామ భూమి ఉంది. ఐదేళ్లుగా వరదకాలువను నమ్ముకుని పంటలు సాగు చేస్తున్న. ఈ ఐదేళ్లు కరువన్నదే లేదు. వరదకాలువల యేడాదంతా నీళ్లు ఉండేటియి. మొగులు ముఖం చూడకుంట పొలాలు సాగు చేసినం. ఈ యేడాది కాంగ్రెస్ సర్కారు నీళ్లు విడుదల చేయకపోవడంతో ఉన్న నీళ్లు అడుగంటినయి. ఒకటి రెండు రోజుల్లో నీళ్లు వస్తే పంట దక్కినట్టు.. లేకుంటే నోట్లో మట్టిపడ్డట్టే.
– తొర్రికొండ కిషన్, రైతు (కొండన్నపల్లి)
ఐదేండ్ల సంది వరదకాలువను నమ్ముకుని పంటలు సాగు చేస్తున్నం. ప్రతి సారి రంది లేకుంట ఉండె. అప్పటి సర్కారు టైముకు నీళ్లిచ్చిది. అదే నమ్మకంతోని ఈసారి కూడా నాలుగు ఎకురాలల్ల వరేసిన. సర్కారు నీళ్లు ఇడువకపోవడంతో వరదకాలువల నీళ్లు లేక మోటర్లు తేలినయి. మొన్న కాలువకు నీళ్లు ఇడిసినట్టె ఇడిసి బందువెట్టిన్రు. ఈ రెండరోజులల్ల నీళ్లత్తెనే పంట సేతికత్తది. లేకుంటే గింజలు చేతుకు రాక పెట్టుబడి కూడా నష్టపోతం.
-,మామాడిపెల్లి రాజశేఖర్, రైతు (కొండన్నపల్లి)