కథలాపూర్/ వీర్నపల్లి/ ఓదెల, ఏప్రిల్ 20, అకాల వర్షం రైతును అతలాకుతలం చేసింది. ఉమ్మడి జిల్లాలో శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం కురిసిన వాన అపార నష్టాన్ని తెచ్చిపెట్టింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో వర్షం పడింది. ప్రస్తుతం వరి కోతలు పూర్తవుతుండడంతో పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు తరలించారు. ఈ సమయంలోనే పడిన అకాల వానతో ధాన్యం తడిసి రైతులు కన్నీరు పెడుతున్నారు. కథలాపూర్ మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో పలుచోట్ల ధాన్యం తడిసిపోగా.. అక్కడక్కడా టార్పాలిన్ కవర్లు కప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందని రైతులు వాపోతున్నారు.
కేంద్రాలు ప్రారంభించి 20 రోజులవుతున్నా కొనుగోళ్లు చేపట్టకపోవడం వల్లే తమకీ కష్టాలు వచ్చాయని మండిపడుతున్నారు. వీర్నపల్లి మండలం రంగంపేట, లాల్సింగ్తండా, అడవిపదిర, బాబాయిచెరువుతండాలో ఈదురుగాలులతో వర్షం పడింది. కొనుగోలు కేంద్రాల్లో సుమారు 10వేల క్వింటాళ్ల ధాన్యం తడిసిసోయింది. రంగంపేట సెంటర్లో వరదకు ధాన్యం కొట్టుకుపోయి జంపన్న చెరువులో కలిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని తహసీల్దార్ ఉమారాణి శనివారం పరిశీలించారు. ప్రభుత్వానికి నివేదిస్తామని ఆమె తెలిపారు. ఇక ఓదెల మండలంలోని మామిడితోటల్లో కాయలు నేలరాలడంతో రైతులు నష్టపోయారు. కొందరు తోటలను లీజుకు తీసుకోగా, ఈదురుగాలుల కారణంగా కోలుకోలేని దెబ్బ తగలిందని వాపోతున్నారు. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.