Godavarikhani | కోల్ సిటీ, మే 16 : కేంద్ర ప్రభుత్వం మళ్లీ మోసపూరితంగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లో కమ్యూనిస్టులు కదం తొక్కారు. ప్రధాన చౌరస్తా వద్ద సీపీఐ రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో శనివారం ఆటో ట్రాలీ ని తాళ్ళతో లాగి కేంద్ర ప్రభుత్వం విధానాలపై నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ నగర కార్యదర్శి కే.కనకరాజ్, 41వ డివిజన్ కార్పొరేటర్ మార్కపూరి సూర్య మాట్లాడుతూ ఇటీవల హైదరాబాద్లో జరిగిన బీజేపీ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పొదుపు మంత్రం జపించిన కొన్ని రోజులకే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్య ప్రజల నడ్డి విరిచారని విమర్శించారు.
ధరల పెరుగుదల తో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజల మీద ఆర్థిక భారం పడుతుందని పేర్కొన్నారు. ఈ మధ్యనే జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు చమురు, గ్యాస్ నిల్వలు దేశంలో అధికంగా ఉన్నాయని, అమెరికా ఇరాన్ యుద్ధం వల్ల మన దేశానికి ఎలాంటి నష్టం లేదని చెప్పి ఇపుడు కేంద్ర ప్రభుత్వం ధరలు ఎందుకు పెంచడం దేశ ప్రజలను మోసం చేసినట్లేనని ప్రశ్నించారు. వెంటనే పెంచిన ధరలు తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మాటేటి శంకర్, తొడుపునూరి రమేశ్ కుమార్, అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై.లెనిన్, నాయకులు గొడిశల నరేశ్, కరీం, చంద్ర శేఖర్, సుధీర్, జగన్, ఆసాల నవీన్, కొమ్ము రాజయ్య తదితరులు పాల్గొన్నారు.