Chigurumadi | చిగురుమామిడి, మార్చి 16 : ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్, యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ భారత్ లో నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఫల్యాల కారణంగా పెరిగిన గ్యాస్ ధరలను నిరసిస్తూ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద సీపీఐ మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం రాస్తారోకో నిర్వహించారు. దేశవ్యాప్తంగా పెరిగిన ఎల్పిజి సిలిండర్ ధరలు, తగ్గిన గ్యాస్ సరఫరాతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా గ్రామాల్లో బుక్ చేసుకున్నప్పటికీ 15 రోజులైనా గ్యాస్ సరఫరా కావడం లేదని వాపోయారు.
మోడీ ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందని నాయకులు ఆరోపించారు. గ్యాస్ కోసం ఎనిమిది గంటలు లైన్లో నిలుచున్న దొరకని పరిస్థితి నెలకొందన్నారు. దీంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో హోటల్లు, హాస్టల్ లు మూతపడ్డాయని అన్నారు. ఈ రాస్తారోకోలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అందే స్వామి, జిల్లా నాయకులు గూడెం లక్ష్మి, చాడ శ్రీధర్ రెడ్డి, అందే చిన్నస్వామి, కాంతాల శ్రీనివాస్ రెడ్డి, ముద్రకోల రాజయ్య, రైతు సంఘం మండల ప్రధాన కార్యదర్శి గోలి బాపురెడ్డి, రాజు, కొమురయ్య, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.