తెలంగాణచౌక్, మే 30: రాజదండంతో రాజకీయం చేస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగ ప్రకారం దేశం లౌకిక రాజ్యాంగంగా కొనసాగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవన ప్రారంభం సందర్భంగా దేశ ప్రధాని మోదీ రాజదండం ప్రతిష్ఠించి రాచరిక వ్యవస్థను తీసుకురావాలనే కుట్ర రాజకీయాలకు తెర తీస్తున్నారని విమర్శించారు. కరీంనగర్లోని సీపీఐ పార్టీ కార్యాలయం(బద్దం ఎల్లారెడ్డి భవన్)లో మంగళవారం జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజ్యాంగం ప్రకారం దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రారంభించాల్సి ఉండగా, ప్రధాని మోదీ మాత్రం నియంతలా పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కొత్తగా నిర్మించిన పార్లమెంట్కు అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి వారి సూచనల మేరకు ప్రారంభ కార్యక్రమం చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కేంద్రంలో బీజేపీ కొనసాగిస్తున్న అరాచక పాలనను వ్యతిరేకిస్తూ బీజేపీ హఠావో, దేశ్కీ బచావో నినాదంతో సీపీఐ దేశ వ్యాప్తంగా సభలు, సమావేశాలను నిర్వహించడంతోపాటు గడప గడపకూ వెళ్లి ప్రజలకు వివరించామని తెలిపారు. కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కుమార్ కేంద్రం నుంచి ప్రజలకు అవసరమైన ప్రాజెక్ట్లను ఎందుకు తీసుకురావడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మత విద్వేషాలు తప్ప ప్రజలకు చేసిందేం లేదన్నారు. ప్రజలు బీజేపీ పాలనతో విసుగు చెందారని, అందుకు నిదర్శనమే కర్ణాటక ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి అని చెప్పారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ దేశంలో ఎక్కడా గెలిచే అవకాశం లేదని తెలిపారు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించడం కోసం జూన్ 4న కొత్తగూడెంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సభకు రాష్ట్రం నుంచి భారీగా కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కార్యవర్గ సభ్యులు లక్ష్మి, బాబు, స్వామి తిరుపతి, పైడిపల్లి రాజు, రాజయ్య పాల్గొన్నారు.