CPI | చిగురుమామిడి, నవంబర్ 15 : భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల ముగింపు ఉత్సవాలను పురస్కరించుకొని మండల కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో ప్రచార జాత కరపత్ర ఆవిష్కరణ ఆ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం కమ్యూనిస్టు నాయకులు ఆవిష్కరించారు. నవంబర్ 15న జూడేఘాట్ లో ప్రారంభమై ఆసిఫాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, చిగురుమామిడి, వరంగల్, మహబూబాబాద్, ఇల్లందు నుండి భద్రాచలంలో ఈ నెల 21న ప్రచార జాత ముగింపు అవుతుందన్నారు.
ఛలో ఖమ్మం బహిరంగ సభ డిసెంబర్ 26న వేలాది మందితో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఖమ్మంలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ 2014లో ఎన్నికల్లో ప్రతి కుటుంబానికి 15 లక్షల అందజేస్తామని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, ప్రజాకర్షణ నినాదాలతో అధికారంలోకి వచ్చిన బీజేపీ తమ హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు.
కార్పొరేట్ సంస్థలకు కేంద్రం కొమ్ముకాస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మతతత్వ బీజేపీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ ఆవిష్కరణలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే స్వామి, సీపీఐ మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, సింగల్ విండో డైరెక్టర్లు చాడ శ్రీధర్ రెడ్డి, ముద్రకోల రాజయ్య, జిల్లా నాయకులు బోయిని అశోక్, మండల నాయకులు గోలి బాపురెడ్డి, బూడిద సదాశివ, అందే చిన్నస్వామి, తమ్మిశెట్టి రవీందర్, మొగిలి ఓదేలు, విలాసాగరం అంజయ్య, తేరాల సత్యనారాయణ, మావురపు రాజు, తాళ్లపల్లి చంద్రయ్య, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.