హుజూరాబాద్, ఏప్రిల్ 5: టీఎస్పీఎస్సీ, ఎస్సెస్సీ పేపర్ లీకేజీల పాపం ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్దేనని మండలి విప్ పాడికౌశిక్రెడ్డి ఆరోపించారు. వారికి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఉసురు తగులుతుందని మండిపడ్డారు. హుజూరాబాద్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బండి, ఈటల తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. లీకేజీ సూత్రధారి అయిన మహేశ్.. ఈటల రాజేందర్తో కలిసి ఉన్న ఫొటో చూపెడుతూ..‘ఇతను ఎవరో మీకు తెలియదా..? గతంలో నీ పోలింగ్ బూత్ ఏజెంట్గా ఉన్న వ్యక్తి కాదా..? అంటూ ప్రశ్నలవర్షం కురిపించారు. పేపర్ లీకేజీలో ఈటల ముఖ్య అనుచరుడు కమలాపూర్ మండలం దేశరాజుపల్లి చెందిన మహేశ్ అని, పక్కాగా ఆధారాలున్నాయని, బీజేపీలో చేరడానికి ఈటలతో మహేశ్ వెళ్లిన ఫొటోలు చూస్తే ఇట్టే అర్థమవుతుందన్నారు.
రాజేందర్ పీఏగా పని చేస్తున్న మరో వ్యక్తికి పేపర్ లీకయిందనే విషయం ఎలా తెలిసిందని? లీక్ వ్యవహారం మీకు సంబంధం లేకుంటే చాటింగ్ ఎలా చేశారని ప్రశ్నించారు. ఓట్ల కోసం హుజూరాబాద్ ప్రజలను మోసం చేస్తున్నట్లుగానే.. పేపర్ లీకేజీలు చేయిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడని మండిపడ్డారు. పేపర్ లీకేజీల ఉదంతంలో దొంగే దొంగ అన్నట్టుగా వ్యవహరిస్తున్న బీజేపీ నాయకులను నమ్మవద్దని సూచించారు. ప్రభుత్వంపై బట్ట కాల్చి మీదెయ్యాలనే చూసే బట్టేబాజుగాళ్లను కఠినంగా శిక్షించాలని, ఈటల రాజేందర్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మోదీ, అమిత్షా కనుసన్నల్లోనే బండి, ఈటల రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లేందుకు కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్కు దేశంలో వస్తున్న ఆదరణ చూసి కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తో ఆటలాడుకుంటున్న బీజేపీకి ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సమావేశంలో ఎంపీపీ ఇరుమళ్ల రాణీ, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్ ఉన్నారు.