దశాబ్దాల సమస్యలకు ధరణితో పరిష్కారం
భూ సమస్యల శాశ్వత పరిష్కారం, సత్వర రిజిస్ట్రేషన్ సేవల కోసం రాష్ట్ర సర్కారు తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రైతాంగానికి కొండంత ధైర్యాన్నిస్తున్నది. దశాబ్దాల పాటు చెప్పులరిగేలా తిరిగినా కానీ సమస్యలను క్షణాల్లో పరిష్కరించి క్రయ, విక్రయ దారులకు అండగా నిలుస్తున్నది. 35 నెలలుగా విజయవంతంగా అమలవుతూ రెవెన్యూ వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిని ప్రక్షాళన చేసి స్వచ్ఛత, పారదర్శకతను అందిస్తున్నది. గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన భూ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ అందరికీ బంగారు భరణి అయింది. కాలయాపన, అధికారుల చేతివాటంతో నిరాశ, నిస్పృహలో కూరుకుపోయిన రైతాంగానికి నిమిషాల్లో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేస్తూ భరోసానిస్తున్నది.
– జగిత్యాల, మే 28(నమస్తే తెలంగాణ)
పాస్బుక్ వెంటనే వచ్చింది
మా నాన్న నా పేరున ఎకరం 20 గుంటల భూమి కొన్నరు. దీనికి సంబంధించి అమ్మకందారు స్థలం వివరాలు, కొనుగోలుదారు వివరాలు మీ సేవలో ఒకరోజు ముందే అప్పగించి స్లాట్ బుక్ చేసుకున్నం. ఆ సమయానికి గొల్లపల్లి తహసీల్దార్ కార్యాలయానికి అమ్మకందారు, కొనుగోలుదారు, ఇద్దరు సాక్షులతో వెళ్లినం. వేలిముద్రలు, ఫొటోలు తీసుకున్నరు. అమ్మే వ్యక్తి పేరు మీద ఉన్న ఎకరం 20 గుంటలను నా పేరున బదిలీ చేయడంతోపాటు రికార్డుల్లో తక్షణమే మార్చారు. ఆ వెంటనే పాస్బుక్కు ఇచ్చారు. గతంలో భూముల కొనుగోలు, అమ్మకాలు మార్పిడికి మల్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దాకా వెళ్లి ఇబ్బంది పడాల్సి వచ్చేది. పాసుబుకులకు సైతం వీఆర్వోలు ఇబ్బంది పెట్టేవారు. కొందరైతే తప్పుడు పాసుబుకులు రాసి ఫోర్జరీ సంతకాలతో ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు అలాంటి వాటికి అవకాశం లేకుండాపోయింది. ధరణి ద్వారా నమ్మకంగా వెంటనే రికార్డుల్లో పేరు నమోదవుతున్నది. నిమిషాల్లోనే పని పూర్తవుతున్నది.
– అల్లాడ రచన, రాపల్లి
జగిత్యాల, మే 28 (నమస్తే తెలంగాణ) : భూసమస్యల శాశ్వత పరిష్కారం, సత్వర సేవలందించేందుకు సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రైతులు, ప్రజలకు బంగారు భరిణెగా మారింది. ధరణి పోర్టల్ ద్వారా భూమి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ, చరిత్రలో మైలు రాయిగా నిలిచిపోనుంది. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం, అని ఎలా చరిత్రను చదువుకుంటున్నామో?, అలాగే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ వ్యవహారాల్లో ధరణి పోర్టల్కు ముందు, తర్వాత అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అనే ప్రక్రియ గ్రామీణ ప్రాంత రైతులకు పెద్ద సమస్యగా ఉండేది. ఈ సమస్యతో చాలామంది రైతులు తమ భూములను సైతం రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా, సాదా బైనామాలతోనే కాలం గడిపారనడంలో ఎలాంటి అనుమానాలు లేవు. రిజిస్ట్రేషన్ వ్యవహారంలో కాలయాపన, మ్యుటేషన్ వ్యవహారంలో అధికారుల లంచగొండితనం గ్రామీణ రైతాంగాన్ని పూర్తిగా నిరాశ నిస్పృహలోకి నెట్టివేసింది.
మ్యుటేషన్ ప్రక్రియలో చోటు చేసుకున్న అవకతవకల నేపథ్యంలో సుదీర్ఘ కాలం పాటు ప్రజలకు సేవలందించిన రెవెన్యూ వ్యవస్థపైనే రైతులు, ప్రజలు, ప్రభుత్వాలకు నమ్మకం పోయే దుస్థితి దాపురించింది. వీటిన్నంటికీ స్వస్తి పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ ద్వారా, తహసీల్దార్ కార్యాలయాలను సబ్ రిజిస్ట్రేషన్ కేంద్రాలుగా మార్చుతూ, అత్యంత సులభమైన పద్ధతిలో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ను అమలు చేసే పద్ధతిని తీసుకొచ్చింది. ఆ విధానం విజయవంతమైంది. 2020 నవంబర్ 2 నుంచి ప్రారంభమైన ధరణి వ్యవస్థ దాదాపు 35 నెలలుగా విజయవంతంగా అమలవుతున్నది. ప్రజలందరికి ఎంతో మేలు చేస్తున్న ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని కాంగ్రెస్ నాయకుల ప్రకటనలపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. ఈ సందర్భంగా ధరణి రాకముందు పరిస్థితి, ఇప్పటి పరిస్థితిపై ఒకసారి మాట్లాడుకుందాం.
ధరణితో తీరిన కష్టాలు…
నా పేరు బొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్. నేను బెంగళూరులోని ఓ సాప్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నా. మాది కోరుట్ల మండలంలోని అయిలాపూర్ గ్రామం. ఇటీవల నేను మాగ్రామానికి చెందిన మొండి శశి వద్ద నుంచి 36 గుంటల స్థలాన్ని కొన్న. రిజిస్ట్రేషన్ కోసం ఒక రోజు ముందు మీ సేవలో దరఖాస్తు చేసుకున్నా. తహసీల్దార్ కార్యాలయంలో డాక్యుమెంట్ పత్రాలు పరిశీలించిన అధికారులు కేవలం ఆరగంటలో రిజిస్ట్రేషన్ పత్రాలు చేతిలో పెట్టారు. నిజంగా ధరణితో ఎంతో మందికి వెసులుబాటు కలుగుతోంది. ధరణి రాకముందు భూమి రిజిస్ట్రేషన్ కోసం దళారులను ఆశ్రయించాల్సి వచ్చేది. భూమిపై యాజమాన్య హక్కుల కోసం వీఆర్వో నుంచి డిప్యూటీ తహసీల్దార్ చుట్టూ తిప్పుకునేవారు. మ్యుటేషన్, పాస్ పుస్తకాల జారీలో తీవ్ర జాప్యానికి ధరణితో చెల్లు చీటి పడింది. అరగంటలో రికార్డుల అప్డేషన్, పీపీబీ జారీ, మ్యుటేషన్ ప్రక్రియ పూర్తి కావడం ఆశ్చర్యం కలిగించింది. ధరణితో రైతులు, సామాన్యులకు సెల్డీడీ, వారసత్వం, భాగ పంపిణీ, గిప్ట్డీడీ రిజిస్ట్రేషన్ సాఫీగా జరుగుతున్నాయి.
– బొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ఐటీ ఉద్యోగి, అయిలాపూర్, కోరుట్ల
ధరణి రాక ముందు..
ధరణి పోర్టల్ కంటే ముందు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ ప్రహసనంగా ఉండేది. భూమి క్రయ, విక్రయదారుల మధ్య ఒప్పందం కుదిరిన తర్వాత ఇరు పక్షాలు తమ గ్రామం ఏ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలో ఉందో ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వెళ్లేవారు. ముందుగా డబ్బులు చెల్లించి, క్రయ, విక్రయాలకు సంబంధించిన భూమి సర్వే నంబర్ వివరాలను తెలుసుకుంటూ, ఈసీని తీసుకునేవారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ కోసం డాక్యుమెంట్ రైటర్ను కలిసి, వివరాలు, పాస్పుస్తకం నకలు కాపీని అందించి, డబ్బులు చెల్లించేవారు. ఆ తర్వాత సబ్ రిజిస్ర్టార్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేసేవారు. రిజిస్ట్రేషన్ ముగిసిన తర్వాత ఒకటి, రెండు రోజులకు పత్రాలు భూమిని కొనుగోలు చేసిన వారికి అందజేసేవారు. రిజిస్ట్రేషన్ పత్రాలను రైతు తీసుకొని, వాటిని గ్రామ పట్వారీలకు అందజేసేవారు.
పట్వారీలు, రిజిస్ట్రేషన్ పత్రాల ఆధారంగా క్షేత్రస్థాయిలో పంచనామా నిర్వహించి, తహసీల్దార్, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో మ్యుటేషన్ చేస్తున్నామని, అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయవచ్చని నోటీస్లు అంటించేవారు. 45 రోజుల గడువు ముగిసిన తర్వాత ఎలాంటి ఫిర్యాదులు లేకపోతే మ్యుటేషన్ పని మొదలు పెట్టేవారు. తహసీల్దార్, భూమిని కొనుగోలు చేసిన వ్యక్తిని, అతడికి భూమిని విక్రయించిన వ్యక్తిని కార్యాలయానికి పిలిచి, వారి మ్యుటేషన్ను పూర్తి చేసేవారు. మ్యుటేషన్ తర్వాత వివరాలను మార్పుల రిజిష్టర్ 1బీలో నమోదు చేసేవారు. మ్యాన్వల్ పహణీలో మాత్రం కొనుగోలు దారుడి పేరు చేర్చకపోయేది. మరుసటి ఏడాది వచ్చే మ్యాన్వల్ పహాణీలో పట్టాదారుడి కాలంలో కొనుగోలు దారుడి పేరు రాసేవారు. ఇంత పెద్ద తతంగాన్ని ఆసరాగా చేసుకొని రెవెన్యూ ఉద్యోగులు రైతులను తీవ్రంగా ఇబ్బందుల పాలు చేశారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రైతుల అవస్థలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ధరణి పోర్టల్ను తీసుకువచ్చింది.
రెండుగంటలపనైయింది
మాది జగిత్యాల రూరల్ మండలం సంఘంపల్లి. నేను పదో తరగతి వరకు చదివి, వ్యవసాయం చేసుకొంటున్న. మా ఊళ్లో నాభూమి పక్కనే మరింత భూమిని కొందామనుకున్న. సర్వే నంబర్ 132లో 10 గుంటల భూమిని పూదరి బుచ్చయ్య దగ్గర దాదాపు మూడేండ్ల క్రితం బయాన పెట్టిన. అయితే రిజిస్ట్రేషన్లు జరిగే సమయానికే లాక్డౌన్ రావడంతో రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయిన. లాక్డౌన్ అయిపోయినంక రిజిస్ట్రేషన్ చేసుకుందామని అనుకున్నం. అంతలోనే పాత పద్ధతిలో కాకుండా ధరణి పద్ధతిలో, తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు చెప్పిండ్రు. ధరణి ప్రారంభమైన మొదటిరోజే నా భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న. ముందుగా మీ సేవలో స్లాట్ బుక్ చేసుకున్న. నవంబర్ 2వ తేదీ 2020న జగిత్యాల రూరల్ తహసీల్దార్ కార్యాలయానికి రిజిస్ట్రేషన్ కోసం వెళ్లిన. అన్నింటిని తహసీల్దార్ సార్ చూసిన్రు. అయితే కంప్యూటర్ సర్వర్ డౌన్ అయిందని, కొంచెం ఆగమన్నరు. గంట తర్వాత సర్వర్ ఓకే కావడంతో నాతో పాటు, నాకు భూమిని అమ్మిన బుచ్చయ్యల సంతకాలు, ఫొటోలు తీసుకున్నరు. తర్వాత సాక్షుల సంతకాలు, ఫొటోలు తీసుకున్నరు.
ఆపరేటర్ తహసీల్దార్ సార్కు ఆన్లైన్లో జనరేట్ అయిన అఫిడవిట్ను ఇచ్చిండు. దీంతో తహసీల్దార్ సార్ సంతకం చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసిండ్రు. మ్యుటేషన్ను పూర్తి చేసిండ్రు. ఐదు నిమిషాల తర్వాత ఆపరేటర్ రిజిస్ట్రేషన్ పత్రాలు, మ్యుటేషన్ పత్రాలు నాకు ఇచ్చిండు. పత్రాలిస్తూ అమ్మా రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ రెండు అయిపోయినయ్ అని జెప్పిండు. నాకు సంఘంపల్లిలో వ్యవసాయ భూమి ఉండడం, పట్టదారు పాస్పుస్తకం ఉండడంతో, నా పాస్పుస్తకంలో పది గుంటలను నమోదు చేస్తూ వివరాలను ముద్రించి పాస్పుస్తకాన్ని అందించిండ్రు. అంతా గంట, రెండుగంటల్లోనే అయిపోయింది. అంతకు ముందు భూమిని కొన్నప్పుడు రిజిస్ట్రేషన్కు రెండు రోజులైంది. వాటిని తెచ్చి పట్వారికి ఇస్తే ఆర్నెళ్లకు మొటేషన్ పేపర్లు ఇచ్చిండు. వాటికి సర్వ తిప్పలు పెట్టిండ్రు. ధరణి వల్ల నా తిప్పలు తప్పినయ్. ధరణిని తీసేసుడంటే తప్పిన తిప్పలును మళ్లీ తెచ్చుకునుడె. అర్థం లేని పని అది. అట్ల అనేవారు ఆలోచించుకోవాలి.
– బత్తుల వనిత, సంఘంపల్లి, జగిత్యాల రూరల్ మండలం
ఆర్నెళ్లు పట్టేది.. అరగంటల్నే అయింది
గతంలో భూములు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ల చుట్టూ తిరిగేది. భూములు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత పాస్బుక్ రావటానికి మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు సమయం పట్టేది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ద్వారా నిమిషాల్లో భూమి పాస్బుక్ నకల్ చేతికి ఇస్తున్నారు. వారం రోజుల్లో పాస్బుక్ ఇంటికి వస్తుంది. కొడిమ్యాల మండలంలోని చెప్యాల గ్రామంలో భూమి కొనుగోలు చేసి ఈ రోజు రిజిస్ట్రేషన్ చేయించుకున్న నిమిషాల్లో పేరు మార్పిడి పూర్తయింది. పాస్బుక్ నకల్ అధికారులు ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు.
– ఎనగల శ్రీనివాస్, సిరిసిల్ల
నేడు నిమిషాల్లో రిజిస్ట్రేషన్
ధరణి పోర్టల్ నేపథ్యంలో నేడు, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ ఒక సులువైన అంశంగా మారిపోయింది. క్రయ, విక్రయదారులు, మీ సేవలో స్లాట్ బుక్ చేసుకోవడానికి గంట సమయం కేటాయిస్తే, మరుసటి రోజు లేదా వారు కోరుకున్న రోజులో రిజిస్ట్రేషన్కు సమయం కేటాయిస్తున్నారు. ఆ సమయానికి క్రయ, విక్రయదారులు, సాక్షులతో కలిసి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుంటే అరగంటలో పని ముగిసిపోతుంది. తహసీల్దార్ క్రయ, విక్రయాలకు సంబంధించిన వివరాలను పరిశీలించడం, ధరణి పోర్టల్ ఆపరేటర్, క్రయ, విక్రయ దారులు, సాక్షుల ఫొటోలు, వేలిముద్రలు సేకరించడం, తర్వాత క్రయ, విక్రయదారులు తమ ఇష్టపూర్తిగా, సరైన భూమిని విక్రయిస్తున్నామని అఫిడవిట్ దాఖలు చేయడం, వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను ముగిసిపోవడం జరుగుతుంది.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసిన వెంటనే, తహసీల్దార్ మ్యుటేషన్ను సైతం పూర్తి చేస్తున్నారు. ప్రక్రియ ముగియగానే భూమి కొనుగోలుదారుడికి, రిజిస్ట్రేషన్ పత్రాలు, అలాగే మ్యుటేషన్కు సంబంధించిన 1బీ కంప్యూటర్ ప్రింటెండ్ కాపీని అందిస్తున్నారు. ఒకవేళ భూమిని కొనుగోలు చేసిన రైతుకు, అదే గ్రామంలో గతంలో సేద్య భూమి ఉండి, పట్టాదారు పుస్తకం ఉంటే, అదే పుస్తకంలో తాజాగా కొనుగోలు చేసిన భూమి వివరాలను నమోదు చేసి అందజేస్తున్నారు. అలాగే భూమిని విక్రయించిన వ్యక్తి పాస్ పుస్తకం నుంచి విక్రయించిన భూమి మొత్తాన్ని తొలగించివేస్తున్నారు. దీంతో మ్యుటేషన్ ప్రక్రియ అక్కడితో ముగిసిపోతుంది. ఒకవేళ కొనుగోలు దారుడికి గతంలో భూమి లేకపోయినా, పాస్పుస్తకం లేకపోయినా, అతడి ఇంటికే వారం తర్వాత కంప్యూటర్ ప్రింటెడ్ పాసు పుస్తకాన్ని పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
నిరీక్షణ లేకుండా స్లాట్ అమలు విధానం
మాది మల్యాల మండలం రాజారాం గ్రామం. రాజారాం గ్రామ రెవెన్యూ శివారులో సర్వే నంబర్ 120వ నంబర్లో 24 గుంటల భూమిని కుక్కునూరి లక్ష్మి నుంచి కొన్న. ఆ భూమిని రిజిష్ర్టేషన్ చేసుకునేందుకు స్లాట్ బుక్ చేసుకున్నం. ఆ సమయానికి భూ విక్రయదారుతో పాటూ తహసీల్దార్ ఆఫీసుకు పోయినం. గంటల పాటు నిరీక్షించకుండా మేం బుక్ చేసుకున్న నిర్ధిష్ట సమయానికి తహసీల్దార్ సుజాత సమక్షంలో 15 నిమిషాలల్ల రిజిష్ర్టేషన్ ప్రక్రియ పూర్తయింది. బ్యాంకింగ్ తరహాలో నాకు ఈ- పాస్బుక్ను రూపొందించి అప్పటికప్పుడు నా పై భూమిని రిజిష్ర్టేషన్ చేయడంతో పాటూ వెంటనే జమాబందీ చేసి నాకు దస్తావేజు పత్రాలను తహసీల్దార్ అందజేశారు. నాకు తెలిసి గతంలో నేనే మా ఊరిలో రిజిష్ర్టేసన్ చేసుకునేందుకు తెలిసినవారు రాగా ఒక్క రోజు ముందే దస్తావేజు లేఖరి వద్దకు వచ్చి కాగితాలు తయారు చేసినంక మరుసటి రోజు సబ్రిజిస్ర్టార్ కార్యాలయానికి వస్తే వాళ్లు పిలిచిన సమయంలోనే రిజిష్ర్టేషన్ అయ్యేది.
ఆ రిజిస్ర్టేషన్ దస్తావేజులను తహసీల్ కార్యాలయానికి తీసుకొచ్చి గ్రామ రెవిన్యూ అధికారికి జమాబందీ కోసం అప్పగిస్తే మూడు, నాలుగు నెలల తర్వాత ఆ పని అయ్యేది. ఎవరైనా అభ్యంతరాలు చెబితే ఆ ప్రక్రియను నిలిపివేసేవారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ను తీసుకువచ్చి భూముల యజమానులకు వారి రికార్డులను ఎప్పటి కప్పుడు చూసుకునేలా వెసులుబాటును ఇవ్వడంతో పాటూ క్రయవిక్రయాలు జరిగిన భూములకు రిజిష్ర్టేషన్ చేసుకునేందుకు స్లాట్ కోరుకున్న రోజు, కోరుకున్న సమయానికి స్లాట్ కేటాయించే విధానం తీసుకురావడం వల్ల కార్యాలయాల్లో నిరీక్షణ తప్పింది. అప్పటికప్పుడు రిజిష్ర్టేషన్ ప్రక్రియతో పాటు జమాబందీని అమలు చేసి బ్యాంకింగ్ తరహాలో పాస్బుక్లో భూమిని పొందుపరచడం వల్ల భవిష్యత్ ఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తప్పింది. సత్వర సేవలు, రికార్డుల భద్రతవంటి అంశాలు ధరణి వల్ల పట్టాదారులకు ఎంతో కలిసి వచ్చే అంశం. ఇలాంటి ధరణిని రద్దు చేయాలనడం సరికాదు.
– జక్కుల విజయ్, మల్యాల
చాలా ఈజీగా రిజిస్ట్రేషన్ జరిగింది
నా పేరు కోటగిరి స్వప్న. మాది కోరుట్ల మండలంలోని యూసూఫ్నగర్ గ్రామం. నా భర్త ఆంజయ్య ఇటీవల కాలం చేసిండు. తన పేరు మీద ఉన్న 20 గుంటల భూమిని నా పేరు మీదకు విరాసత్ చేసుకునేందుకు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాను. భర్త ఉన్నప్పుడు పనుల కోసం ఎప్పుడు బయటకు వెళ్లలేదు. నా భర్త పేరు మీద ఉన్న భూమి నా పేరు మీదకు మార్చుకోవాలంటే ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందోనని భయపడ్డా. ధరణితో బ్యాంకుల్లో డబ్బులు దాచుకుని, తీసుకునేంత సులువుగా భూమి మార్పిడి జరిగింది. అరగంటలో రిజిస్ట్రేషన్ పత్రాలు చేతికి రావడం ఆనందంగా ఉంది. ధరణితో నాలాంటి ఎంతో మందికి ప్రయోజనం కలుగుతుంది. నిజంగా ఇంత సులభంగా రిజిస్ట్రేషన్ జరుగుతుందని ఊహించలేదు. మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– కోటగిరి స్వప్న, యూసుఫ్నగర్, కోరుట్ల పది నిమిషాల్లో పట్టా చేసిన్రు
మాది మల్లాపూర్ మండలం గుండంపల్లి. నాపేరు అదారి రాజేందర్. నేను మల్లాపూర్ గ్రామశివారులోని 52 సర్వే నంబర్లో 10 గుంటల భూమి కొన్న. రిజిస్ట్రేషన్ కోసం మల్లాపూర్ తహసీల్దార్ ఆఫీసుకు పోయిన. సార్లు పది నిమిషాల్లో భూమిని పట్టా చేసి పాస్బుక్లో ఎక్కించి ఇచ్చిన్రు. గతంలో భూములు పట్టా చేయించుకునేందుకు వీఆర్వో సార్ల దగ్గరికి ఎన్ని రోజులు తిరిగినా పని కాకపోయేది. ఈ సర్కారు ప్రవేశపెట్టిన ధరణితో భూముల పట్టాలు చకచకా జరుగుతున్నయ్. ప్రతి రైతుకు ధరణితో ఎంతో లాభం జరుగుతంది.
– అదారి రాజేందర్, గుండంపల్లి గ్రామం(మల్లాపూర్)