Governor Jishnu Dev Verma | కమాన్ చౌరస్తా, నవంబర్ 7 : నిరంతర అభ్యాసంతోనే విజయం సాధ్యమవుతుందని, శ్రద్ధ, క్రమశిక్షణతో లక్ష్యాన్ని చేరుకోవాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మ విద్యార్థులకు పిలుపునిచ్చారు. శాతవాహన యూనివర్సిటీ రెండవ స్నాతకోత్సవానికి తెలంగాణ గవర్నర్, ఛాన్సలర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. 25 మందికి పీహెచ్డీ పట్టాలతో పాటు 2018 నుంచి 2023 వరకు ప్రతిభ కనబరిచిన 161 మంది విద్యార్థులకు బంగారు పతకాలు గవర్నర్ అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ విష్ణుదేవ్ వర్మ విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడుతూ.. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం విద్యార్థులను విజయం దిశగా తీసుకెళుతుందని అన్నారు. విద్యార్థుల మేధాశక్తియే వారి ప్రయోగశాలగా అభివర్ణించారు. విద్యార్థుల ఆలోచనలు, శ్రమ, సృజనాత్మకత వారిని సమాజంలో ముందుకు తీసుకెళ్తాయని తెలిపారు.
అవకాశం, సమానత్వం సృజనాత్మకతతో ఎదగాలని ఆకాంక్షించారు. విశ్వవిద్యాలయానికి విద్యా రంగాల్లో , విద్యా ప్రమాణాలు నెలకొల్పాలని తెలిపారు.శాతవాహన విశ్వవిద్యాలయానికి న్యాక్, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ దిశగా అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి అని అన్నారు. విద్యారంగం బోర్డు, చాక్ పీస్ లకే మాత్రమే పరిమితం కావద్దని పేర్కొన్నారు. ప్రస్తుతం విద్యా రంగం సాంకేతికతతో ముందుకు సాగుతుంది అని అన్నారు. డిజిటల్ లెర్నింగ్ భౌగోళిక అవరోధాలను అవకాశాల మధ్య వ్యత్యాసాలను చెరిపివేసిందని తెలిపారు. ప్రతీ విద్యార్థి నైపుణ్యం, నిరంతర అభ్యాసాలె విజయానికి దోహదం చేస్తాయని అన్నారు. ప్రపంచ విజ్ఞానాన్ని ఆహ్వానించాలని, ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను అందిపుచుకోవాలి అని వివరించారు. తెలంగాణ మట్టి పరిమళాన్ని మరువవద్దని పిలుపునిచ్చారు.
అందరూ సమానంగా జీవించే సమాజమే నిజమైన అభివృద్ధి అని తెలిపారు. ప్రతిభ ఎక్కడైనా వికసిస్తుందని,భయాన్ని, అలసటను అధికమించి ముందుకు సాగాలని అన్నారు. కృషి తో ప్రతీ విద్యార్థి అభివృద్ధి సాధ్యమే అని అన్నారు. విద్యార్థి దశ నుండే సేవా మార్గాన్నిఅనుసరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సిలర్ జె.బి. రావు, శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ యు.ఉమేష్ కుమార్, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమం అనంతరం కలెక్టరేట్ చేరుకున్న గవర్నర్ మొదటగా పోలీస్ గౌరవ వందనం స్వీకరించి, డిపార్ట్మెంట్ వారీగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. అనంతరం వందేమాతర గేయంతో కార్యక్రమాన్ని ప్రారంభించగా తదనంతరం బాలభవన్ విద్యార్థుల శాస్త్రీయ నృత్యం, అంద విద్యార్థుల పాటలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సెక్రట రి దానకిషోర్, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలం,అదనపు కలెక్టర్ లు అశ్విని తానాజీ వాకాడే లక్ష్మి కిరణ్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ జిల్లా ఉన్నత అధికారులు పాల్గొన్నారు.