స్వరాష్ట్రంలో ఆలయాలకు పూర్వవైభవం తెస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ధార్మికచింతనతో ఓ మారుమూల గ్రామంలో అద్భుతమైన ఆలయం రూపుదిద్దుకుంటున్నది. భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న రాగినేడు నాగలింగేశ్వరస్వామికి కోవెల నిర్మాణమవుతున్నది. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ విషయం చెప్పిన వెంటనే సీఎం 50 లక్షలు మంజూరు చేయగా, ఏడాది క్రితమే శంకుస్థాపన జరిగింది. కేసీఆర్ సంకల్పబలం, స్థానిక దాతలు, భక్తుల విరాళాలతో చెట్టు కింది శివయ్యకు గుడి కట్టాలన్న మూడు దశాబ్దాల కల నెరవేరుతున్నది. దాదాపు 2.50 కోట్లతో చేపట్టిన ఈ నిర్మాణ పనులు పూర్తి కావస్తుండగా, 20 గ్రామాల ప్రజల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
– పెద్దపల్లి, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ)
పెద్దపల్లి, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : పెద్దపల్లి మండలంలోని రాగినేడు గ్రామం పచ్చని పంటపొలాల మధ్య ప్రకృతి అందాలతో అలరారుతూ ఉంటుంది. 30 ఏండ్ల క్రితం ఒక రైతుకు తన పొలంలోని పుట్టలో శివలింగం కనిపించింది. ఈ విషయాన్ని ఆ రైతు సంభ్రమాశ్చర్యాలతో ఊరి పెద్దలకు చెప్పాడు. ఊరు ఊరంతా తరలివచ్చి స్వయంభువుగా వెలసిన శివలింగాన్ని చూసి భక్తితో పులకించిపోయారు. ఆ శివలింగాన్ని సమీపంలోని రావిచెట్టు, వేపచెట్టు నీడలో ప్రతిష్ఠించారు. శివలింగాన్ని దర్శించిన పురావస్తు శాస్త్రవేత్తలు అది కాకతీయుల కాలం నాటిదని నిర్ధారించారు. పుట్టలో వెలసిన ఆ శివలింగాన్ని 20 గ్రామాల ప్రజలు నాగలింగేశ్వరుడిగా ఆరాధిస్తున్నారు.
చుట్టుపకల గ్రామాల్లో ఎకడా ఒక దేవాలయం కూడా లేకపోవడంతో వారందరికీ ఈ శివలింగం ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్నది. మహాశివరాత్రి పర్వదినాన స్వామివారిని ఆరేడు వేల మంది భక్తులు దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఊరి దళిత సోదరులు పోతురాజుల భూమయ్య, లక్ష్మయ్య దేవాలయ నిర్మాణానికి 20 గుంటల భూమిని విరాళంగా ఇచ్చారు. అది సరిపోక పోవడంతో మరో 2 గుంటలు సైతం ఇచ్చారు. అప్పటి నుంచి అక్కడ ఆలయ నిర్మాణానికి సహకరించాలని కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులకు స్థానికులు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదు. ఎన్నికల సమయంలో వాగ్దానం చేసిన నేతలు ఆ తర్వాత ముఖం చాటేసేవారు.
గుడిలో దేవుడు.. ప్రజల గుండెల్లో కేసీఆర్
దేవుడు గుడిలో ఉంటాడు. మహానాయకుడు ప్రజల గుండెల్లో ఉంటాడు. సీఎం కేసీఆర్ ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల గుండెల్లో తన స్థానాన్ని చిరస్థాయిగా పదిలపరచుకున్నారు. ఈ పవిత్ర కార్యక్రమంలో నాది కేవలం సంకల్పమే. రాగినేడు మా పూర్వీకుల గ్రామం కావడంతో ఆలయ నిర్మాణం చేపట్టాలని సంకల్పించాను. దీనికి కార్యరూపం ఇచ్చిన ఖ్యాతి సీఎం కేసీఆర్దే. పరిస్థితిని వివరించిన వెంటనే ఆలయ నిర్మాణానికి ఉత్తర్వులు జారీ చేయించి, ఈ ప్రాంత ప్రజల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని పొందారు. మన పూర్వజన్మసుకృతం వల్ల ఈ మహానేత ముఖ్యమంత్రిగా లభించారని ప్రజలు ముక్తకంఠంతో కేసీఆర్ను కీర్తిస్తున్నారు. ఆలయ ప్రారంభోత్సవం సీఎం కేసీఆర్ చేతులమీదుగా జరగాలని స్థానికులు కోరుకుంటున్నారు.
– కోలేటి దామోదర్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్
సీఎం కేసీఆర్ సహకారం
రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కోలేటి దామోదర్.. తన పూర్వీకుల గ్రామంలో వెలసిన నాగలింగేశ్వరుడికి ఆలయం నిర్మించాలని తలపెట్టారు. శివాలయంతోపాటు అదే ప్రాంగణంలో నవగ్రహాల ప్రతిష్ఠ, ఆంజనేయస్వామి దేవాలయం, షిరిడీ సాయిబాబా దేవాలయం నిర్మించాలని సంకల్పించి, కార్యాచరణ ప్రారంభించారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం అందించారు. దేవాదాయశాఖ ద్వారా 50 లక్షల నిధులు మంజూరు చేయించారు. తగిన ప్రణాళికలు సిద్ధం చేసి, దేవాలయ నిర్మాణంలో సిద్ధహస్తులైన స్థపతులను సంప్రదించి, ఆగమ శాస్త్ర విధానాలను అనుసరించి డిజైన్లు రూపొందించారు. వేములవాడ, ధర్మపురి, కాళేశ్వరం ఆలయాల ప్రధాన అర్చకుల సూచనల మేరకు 2021 ఆగస్టు 13న దేవాలయ నిర్మాణానికి కోలేటి దామోదర్ శంకుస్థాపన చేశారు.
పనులు వేగవంతం
నిర్మాణ పనులు ప్రారంభం కాగానే ఎందరో దాతలు, భక్తులు ఉత్సాహంగా ముందుకొచ్చి తమ శక్తి కొద్దీ విరాళాలు అందజేశారు. దీంతో దేవాలయ నిర్మాణ పనులు చురుకుగా కొనసాగుతుండగా, దేవాలయాన్ని సందర్శించే మహిళలు, పురుషులకు వేరువేరుగా స్నాన వాటికలు, టాయిలెట్లు నిర్మిస్తున్నారు. భక్తులు సేదదీరడానికి విశ్రాంతి మందిరం, తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు. ఆలయం చుట్టూ ప్రహరీ నిర్మించారు. గ్రామ ప్రవేశం వద్ద శివపార్వతులు, గణేశుడు, సుబ్రహ్మణ్యస్వామి, సాయిబాబా, తదితర దేవతా విగ్రహాలతో స్వాగత తోరణ ద్వారాన్ని నిర్మించారు. దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ నిర్మాణాల ఖర్చు ఇప్పటివరకు 2.50 కోట్లు దాటింది. త్వరలోనే ఈ దేవాలయం ఒక సుప్రసిద్ధ శైవక్షేత్రంగా రూపొందనున్నది.
నాగలింగేశ్వరస్వామి మా ఊరి కొంగుబంగారం
మా ఊరిలో నాగలింగేశ్వరస్వామి స్వయంభువుగా వెలశాడు. వేదపండితుల సూచనల మేరకు తొలుత రావి, వేప చెట్టు కింద ప్రతిష్ఠించి, మొక్కులు చెల్లించుకుంటున్నాం. ఇప్పుడు నూతన ఆలయాన్ని సీఎం కేసీఆర్, పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ సహకారంతో నిర్మించుకోవడం సంతోషంగా ఉన్నది.
-పోతురాజుల భూమయ్య, ఆలయ కమిటీ చైర్మన్
దేవాలయంతో ఊరికి మేలు
శివలింగం ప్రతిష్ఠాపన తరువాత గ్రామానికి ఎంతో మంచి జరిగింది. ఊరి ప్రజలందరి ఆరోగ్యం బాగైంది. అందరి కష్టాలు తీరినై. ఆలయ నిర్మాణానికి నేను, మా అన్న కలిసి భూమిని ఇచ్చినం. అందులో నిర్మాణం పూర్తవుతున్నది. ఈ ఆలయం పూర్తయితే మా ఊళ్లో ఎప్పటికీ పండుగే. చుట్టూ 20 గ్రామాల ప్రజలంతా ఇక్కడికే వస్తారు. సీఎం కేసీఆర్ సార్, దామోదర్ సార్ రుణం తీర్చుకోలేం.
-పోతురాజుల లక్ష్మయ్య, ఆలయ స్థల దాత