జంట పట్టణాలతో విలసిల్లుతూ, సేద్యఖిల్లాగా పేరుగాంచిన కోరుట్ల నియోజకవర్గం ప్రగతి పథంలో పయనిస్తున్నది. సమైక్య పాలనలో అభివృద్ధికి ఆమడదూరంలో మగ్గిన ఈ ప్రాంతం, స్వరాష్ట్రంలో, జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత అన్నింటా దూసుకెళ్తున్నది. విద్య, వైద్యంలో రెట్టించిన పురోగతి సాధించడంతోపాటు కోరుట్ల, మెట్పల్లి రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో పాలన చేరువైంది. పేదలకు అద్దాల్లాంటి రహదారులు, పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు, గడపగడపకూ స్వచ్ఛమైన జలం ఇలా.. ఎమ్మెల్యే విద్యాసాగర్రావు కృషితో ఇంటింటికీ సంక్షేమ ఫలం.. వందలాది కోట్లతో కండ్ల ముందే అభివృద్ధి జరుగుతున్నది. రాష్ట్రంలోనే అత్యధిక ఆసరా పింఛన్లు, సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద లబ్ధిపొందుతున్న ప్రాంతాల్లో ముందంజలో నిలిచి, సబ్బండవర్గాల్లో సంతోషాన్ని నింపుతున్న నియోజకవర్గంపై ‘నమస్తే’ ప్రత్యేక కథనమిది. – మెట్పల్లి, అక్టోబర్ 5
63 జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న కోరుట్ల, మెట్పల్లి పట్టణాలు ప్రగతిలో దూసుకెళ్తున్నాయి. స్వరాష్ట్రంలో వందలాది కోట్ల నిధులతో పనులు జరిగాయి. ట్రాఫిక్ను నివారించేందుకు జంక్షన్ల నిర్మాణం, యువత కోసం ఓపెన్, ఇండోర్ జిమ్, చిన్నపిల్లల కోసం పార్క్లు, చివరి మజిలీ కోసం వైకుంఠధామాలు ఏర్పాటు చేశారు. ఇంకా నాలుగు అడుగుల వెడల్పుతో డివైడర్లను ఏర్పాటు చేయడమేకాదు మధ్యలో ఏర్పాటు చేసిన మొక్కలతో ప్రజలకకు ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. కోరుట్ల పట్టణంలో పెద్దచెరువు మినీ ట్యాంకు బండ్గా రూపుదిద్దుకుంది. అలాగే మెట్పల్లి పట్టణ శివారులోని పెద్దచెరువు మినీ ట్యాంకు బండ్గా తీర్చిదిద్దేందుకు పనులు శరవేగంగా సాగుతున్నాయి.
సుందరీకరణ పనులతో పాటు ప్రజలకు ఒకే చోట కూరగాయాలు, మాంసం, చేపలు దొరికే విధంగా రూ.6 కోట్ల వ్యయంతో అటు కోరుట్లలో, ఇటు మెట్పల్లిలో సమీకృత మార్కెట్ల నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఇంకా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో రూ.2.93 కోట్ల వ్యయంతో షాపింగ్ కాంప్లెక్స్, కార్యాలయం భవనం నిర్మాణ పనులు కొనసాగుతుండగా, కోరుట్ల వ్యవసాయ మార్కెట్లోనూ రూ.2కోట్ల వ్యయంతో షాపింగ్ కాంప్లెక్స్, కార్యాలయ భవనం నిర్మించారు. ఇటీవలే ఈ రెండు పట్టణాల్లో సుందరీకరణ కోసం రూ.50 కోట్ల చొప్పున నిధులు మంజూరు కాగా, ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇలా అభివృద్ధి, సంక్షేమంలో గడిచిన తొమ్మిదిన్నరేండ్లలోనే కోరుట్ల నియోజకవర్గం ఒక నవశకాన్ని సంతరించుకున్నది.
ఒకప్పుడు కనీసం సింగిల్ రోడ్డుకే నోచుకోని అనేక పల్లెలు నేడు డబుల్ (రెండు వరుసల) రోడ్లతో సంతరించుకున్నాయి. గడిచిన తొమ్మిదేండ్లలో కోరుట్ల నియోజకవర్గంలో రోడ్లు, భవనాల శాఖ నుంచి రహదారులు, హైలెవల్ బ్రిడ్జిల నిర్మాణం కోసం రూ. 232 కోట్లు నిధులు మంజూరుకాగా, ఇప్పటి వరకు రూ.162.80 కోట్లతో చేపట్టిన 41 రహదారులు అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. రూ.52.30 కోట్లతో మరో 28 రోడ్ల నిర్మాణ పనులు పూర్తి దశలో ఉన్నాయి. అలాగే పంచాయతీ రాజ్ శాఖ నుంచి సుమారు రూ.100 కోట్ల వ్యయంతో రహదారుల అభివృద్ధి, గ్రామాల మధ్య లింకు రోడ్లు నిర్మించారు. నిజానికి రాష్ట్రం రాక ముందు అనేక గ్రామాలకు కనీసం సరైన రోడ్లు ఉండేవి కావు. గతుకుల మయమైన మెటల్, మట్టి రోడ్లతో ప్రయాణికులు అవస్థలు పడుతుండేవారు. గడిచిన తొమ్మిదేండ్లలో గ్రామీణ రోడ్ల తీరే మారిపోయింది. సింగిల్, డబుల్ రోడ్లు, హైలెవల్ వంతెనల నిర్మాణంతో ఆయా గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడింది.
ఇంటింటికీ స్వచ్ఛమైన జలాన్ని అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టారు. నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాల్లో మిషన్ భగీరథ పైపులైన్లు, ట్యాంకుల నిర్మాణం పనులు పూర్తయి ఇంటింటికీ తాగునీటి సరఫరా కొనసాగుతున్నది. ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామ శివారులో మిషన్ భగీరథ వాటర్ గ్రిడ్ను నిర్మించారు. ఇక్కడి నుంచి కోరుట్ల, ధర్మపురి, జగిత్యాల నియోజకవర్గాలకు ప్రధాన పైపులైన్ ద్వారా నీటి పంపింగ్ జరుగుతుంది. రూ.1300 కోట్ల వ్యయంతో దీని నిర్మాణం చేపట్టారు. ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కోరుట్ల, మెట్పల్లి మండలాల్లోని 78 గ్రామ పంచాయతీల్లో కలిపి 71 ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించి, కొత్తగా 63,287 నల్లా కలెక్షన్లు అమర్చారు. నల్లాలకు నీరు ఇచ్చేందుకు 635.45 కిలోమీటర్ల పొడవునా పైపులైన్ ఏర్పాటు చేశారు. కోరుట్ల పట్టణంలో రూ. 80 కోట్లు, మెట్పల్లి పట్టణంలో రూ.70 కోట్ల వ్యయంతో ఓవర్హెడ్ ట్యాంకులు నిర్మిస్తున్నారు.
రైతుకు పెట్టుబడి భారం తీర్చాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న రైతు బంధు కింద నియోజకవర్గంలో 50344 మంది లబ్ధిపొందుతున్నారు. ఇందుకుగాను ప్రభుత్వం ఏటా రూ.52,38,45,757 వారి ఖాతాల్లో జమచేస్తున్నది. ఇక రైతు బీమా 29,695 మందికి చేయించగా, ఎంతో మంది కుటుంబాలకు ధీమానిచ్చింది. ఇబ్రహీంపట్నం మండలంలో 16 మంది, కోరుట్ల మండలంలో 13, మల్లాపూర్ మండలంలో 24, మెట్పల్లి మండలంలో 14 మంది మృతి చెందగా కుటుంబాలకు.. మొత్తంగా 67 కుటుంబాలకు రూ.3.35 కోట్ల బీమా సొమ్ము అందింది.
కోరుట్ల నియోజకవర్గంలో వైద్య రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం కోరుట్లలో వందపడకల ఏరియా దవాఖాన, డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశాం. కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లో ప్రత్యేక నిధులు రూ.100 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించాం. జాతీయ రహదారి మధ్యలో డివైడర్లు నిర్మించి అధునాతమైన విద్యుత్ దీపాలు, పచ్చదనం కోసం మొక్కలు ఏర్పాటు చేశాం. రెండు మున్సిపాలిటీల్లో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ఇచ్చిన హమీలకు మించి పనులు చేశాం. మిషన్ భగీరథ పనులతో దెబ్బతిన్న కాలనీల్లో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టాం. వంద పడకల దవాఖాన నిర్మాణంతో పేద, మధ్య తరగతి కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి. ప్రజా సంక్షేమం లక్ష్యంగా పనులు చేశా.
– కల్వకుంట్ల విద్యాసాగర్రావు, కోరుట్ల ఎమ్మెల్యే
పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వ వైద్యం మరింతగా చేరువైంది. ఒకప్పుడు ‘నేను రానుబిడ్డో సర్కారు దవాఖాన’కు అనే దుస్థితి నుంచి ఇప్పుడు ఏ రోగమొచ్చినా క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లోని ప్రభుత్వ దవాఖానలు ప్రసవాల్లో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపును పొందాయి. కోరుట్ల కేంద్రంగా వందల పడకల దవాఖానను ప్రభుత్వం మంజూరు చేసి, నిధులు విడుదల చేయగా, భవన నిర్మాణం పూర్తయింది. శుక్రవారం మంత్రి హరీశ్రావు చేతులమీదుగా ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమైంది. ఇంకా కోరుట్ల పట్టణంలో ఏర్పాటు చేసిన బస్తీదవాఖాన పేదలకు సంజీవనిగా మారింది. కిడ్నీ బాధితులు డయాలసిస్ కోసం హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్ వంటి పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కోరుట్లలో ఈ యేడాది జనవరి 5న సెంటర్ను ఏర్పాటు చేయడం బాధితుకుల స్వాంతన కలిగిస్తున్నది. మెట్పల్లి పట్టణంలోని రూ.7.5 కోట్ల నిధులతో 30 పడకల దవాఖాన సామర్థ్యం పెంచుతూ ఆధునాతనమైన వసతులతో కూడిన కొత్త భవన నిర్మాణ పనులు చకచకా కొనసాగుతున్నాయి. కోరుట్ల, మెట్పల్లి పట్టణాతో పాటు ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మెట్పల్లి, కోరుట్ల మండలాల్లో రూ.7.20 కోట్ల నిధులతో 36 ఆరోగ్య ఉపకేంద్రాలకు పక్కా భవనాల నిర్మాణ కోసం టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్నది. ప్రసవాలలో మెట్పల్లి సామాజిక వైద్యశాల ప్రశంసలు అందుకుంటుంది. కాగా, నియోజకవర్గంలోని ప్రభుత్వ దవాఖానల్లో 2017-18 నుంచి 2022-23 ఫిబ్రవరి28 దాకా 13,834 ప్రసవాలు జరుగగా, అందులో ఇప్పటిదాకా 12,886 మందికి పైగా కేసీఆర్ కిట్లను అందజేశారు.
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన కోరుట్ల నియోజకవర్గం స్వరాష్ట్రంలో సరికొత్తగా మారింది. బీఆర్ఎస్ సర్కారు తొమ్మిదిన్నరేండ్ల పాలనలో గణనీయమైన ప్రగతి సాధించింది. ప్రభుత్వ సహకారానికితోడు ఎమ్మెల్యే విద్యాసాగర్రావు చూపుతున్న ప్రత్యేక చొరవతో ప్రజాసంక్షేమం, అభివృద్ధిలో నియోజకవర్గం అన్నింటా దూసుకెళ్తున్నది. రాష్ట్రంలోనే అత్యధిక ఆసరా పింఛన్లు, సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద లబ్ధిపొందుతున్న నియోజకవర్గాల్లో కోరుట్ల అగ్రగామిగా ఉండడం విశేషం. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్శాఖ పరిధిలోని గ్రామీణ రోడ్లను సుమారు రూ.350 కోట్ల నిధులతో అభివృద్ధి జరిగింది. గడిచిన తొమ్మిదేండ్లలో గ్రామీణ రోడ్ల రూపురేఖలు మారాయి. కార్పొరేట్కు దీటుగా పేదలకు మెరుగైన వైద్యసేవలను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలతో నియోజకవర్గంలో వైద్యం ప్రజలకు మరింతగా చేరువైంది.
– మెట్పల్లి, అక్టోబర్5
జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్తగా మెట్పల్లి, కోరుట్ల కేంద్రాలుగా రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటయ్యాయి. గతంలో జగిత్యాల రెవెన్యూ డివిజన్ ఉండగా, డివిజన్ కార్యాలయాల్లో పనుల కోసం 50 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉండేది. దీని వల్ల వ్యయ, ప్రయాసాలకు లోనుకావాల్సి వచ్చేది. ఇప్పుడా పరిస్థితి లేదు. మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్పల్లి మండలాలను కలిపి మెట్పల్లి సబ్కలెక్టర్ కార్యాలయం, అలాగే కోరుట్ల మండలం, పట్టణ ప్రజలకు అందుబాటులో కోరుట్ల రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. వీటితో పాటు మెట్పల్లిలో పోలీస్ సబ్డివిజనల్ అధికారి, అటవీశాఖ రేంజ్ అధికారి, విద్యుత్ విభాగం డివిజనల్ ఇంజినీర్ అధికారి కార్యాలయాలను ఏర్పాటు చేశారు. నిరంతరం ప్రజలతో సంబంధం కలిగిన ప్రభుత్వ కార్యాలయాలు అందుబాటులోకి రావడం వల్ల ప్రభుత్వ పాలన వ్యవస్థ ప్రజలకు మరింతగా చేరువైనట్లయింది.
పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించాలనే గొప్ప ఆలోచనతో నియోజకవర్గంలో ఏడు గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేసింది. మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల (బాలికల) మెట్లచిట్టాపూర్, బాలుర గురుకుల విద్యాలయం (అయిలాపూర్), బాలుర గురుకుల విద్యాలయ (మెట్పల్లి), మైనార్టీ గురుకుల విద్యాలయం (బాలుర)మెట్పల్లి, కోరుట్లలో, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం (బాలికల) మెట్పల్లి, కోరుట్ల(బాలుర) ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆయా గురుకులాల్లో కలిపి 1600 మంది విద్యార్థులకు పైగా విద్యను అభ్యసిస్తున్నారు. మెనూ ప్రకారం పోషక విలువలతో కూడిన పౌష్టికాహార భోజనం, అల్పాహారం, కార్పొరేట్ను తలదన్నేలా తరగతి గదులు, తదితర వసతుల మధ్య పిల్లలకు నాణ్యమైన విద్య అందుతున్నది. ఇక ‘మన ఊరు మన బడి’ కింద పాఠశాలల భవనాలు కొత్త శోభను సంతరించుకుంటున్నాయి.
ఎన్నో ఏళ్లుగా సొంత ఇల్లు లేక అద్దె ఇండ్లు, గుడిసెల్లో నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబాల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల ఆనందం వెల్లివిరుస్తోంది. పైసా ఖర్చులేకుండా గూడు లేని నిరుపేదలకు సొంతింటి కలను ప్రభుత్వం సాకారం చేసింది. మెట్పల్లి, కోరుట్ల పట్టణాలతో పాటు ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలతో లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేసి నివాసం ఉంటున్నారు. మెట్పల్లి, కోరుట్ల పట్టణాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాలను 2022, జూన్ 10న మంత్రి కేటీఆర్ ప్రారంభించి, లబ్ధిదారులకు అందజేశారు.
గొల్ల,కుర్మలకు ప్రభుత్వం అండగా నిలిచింది. కులవృత్తికి ప్రోత్సాహం ఇచ్చేందుకు రాయితీపై గొర్రెల యూనిట్లు పంపిణీ చేసింది. ఒక్కో యూనిట్కు 20 గొర్రెలు, ఒక పొట్టేలును అందించి గొల్లకుర్మలకు అండగా నిలిచింది. ఇబ్రహీంపట్నం, కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్ మండలాలకు కలిపి ఇప్పటి దాకా 1694 యూనిట్లు కేటాయించగా రూ.22.30 కోట్లు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. గొర్రెల పెంపకం ద్వారా వచ్చే ఆదాయంతో లబ్ధిదారులు సంతోషంగా జీవిస్తున్నారు.
సమైక్య పాలనలో గ్రామ పంచాయతీ భవనాల పరిస్థితి అధ్వానంగా ఉండేది. ఇబ్రహీంపట్నం మండలంలో 17, మెట్పల్లి మండలంలో 23, కోరుట్ల మండలంలో 15, మల్లాపూర్ మండలంలో 23 గ్రామ పంచాయతీలు నాడు సొంత భవనాలు లేక పోవడం, ఉన్నా అవి శిథిలావస్థలో ఉండడంతో ఇబ్బందులు తలెత్తాయి. స్వరాష్ట్రంలో ప్రభుత్వం ఒక్కో పంచాయతీకి భవనానికి రూ. 20 లక్షలు, ఆపై నిధులు ఇచ్చి జీపీ భవనాల కలను నెరవేర్చింది.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆసరా పింఛన్ అసహాయులకు భరోసా కల్పిస్తున్నది. ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కోరుట్ల, మెట్పల్లి,మల్లాపూర్ మండలాల్లో కలిపి వృద్ధాప్య పింఛన్లు 17,358, వితంతు 13,527, దివ్యాంగులు 4,979, గీతకార్మికులు 1108, నేత కార్మికులు 378, ఒంటరి మహిళలు 1461, బీడీ కార్మికులు (జీవన భృతి) 31,756, బోధకాలు(ఫైలేరియా) 305, డయాలసిస్ రోగులు 22 మందికి నెలకు రూ.14,79,41,624 ప్రభుత్వం వెచ్చిస్తున్నది.