ధర్మపురి దశ తిరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రగతి పరవళ్లు తొక్కింది. నాటి సమైక్య రాష్ట్రంలో పూర్తిగా నిరాధారణకు గురై వెనుకబడిన ఈ ప్రాంతం, నేడు స్వరాష్ట్రంలో సిరిపురిగా మారింది. ప్రగతి ప్రదాత కేసీఆర్ సహకారం, మంత్రి ఈశ్వర్ కృషితో గడిచిన తొమ్మిదిన్నరేండ్లలోనే రూపురేఖలన్నీ మార్చుకొని ప్రగతికి చిహ్నంగా నిలుస్తున్నది. ఏకంగా 1700కోట్ల నిధులతో ప్రతి మూలన అభివృద్ధి ముద్రలు వేసుకొని సరికొత్తగా కనిపిస్తున్నది. ప్రధానంగా చెరువుల మరమ్మతు, చెక్డ్యాంలు, 247.86 కోట్లతో ఎత్తిపోతల పథకాల నిర్మాణంతో నీటి లభ్యత పెంచుకొని వ్యవసాయకంగా ఎంతో పురోగతి సాధించింది. ఇంకా నృసింహుడు కొలువైన ధర్మపురి క్షేత్రం 141కోట్లతో టెంపుల్సిటీగా మారుతుండగా, నియోజకవర్గ ప్రజల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
– జగిత్యాల, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ)
జగిత్యాల, నవంబర్ 1(నమస్తే తెలంగాణ): సమైక్య పాలనలో అభివృద్ధిలో కుంటుపడిన ధర్మపురి నియోజకవర్గం, బీఆర్ఎస్ సర్కార్ హయాంలో సిరిపురిగా మారింది. తొమ్మిదిన్నరేండ్లలో సరికొత్తగా రూపుదిద్దుకున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం, ధర్మపురి ఎమ్మెల్యే, మంత్రి కొప్పుల ఈశ్వర్ కృషితో ధర్మపురి రూపురేఖలు పూర్తిగా మారాయి. దాదాపు 1700 కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులు చేపట్టగా, నియోజకవర్గంలోని గ్రామాలన్నీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా గ్రామాల్లో చెరువుల మరమ్మతులు, చెక్డ్యాంలు, ఎత్తిపోతల పథకాల నిర్మాణాలతో నీటిలభ్యతను పెంచి చివరి ఆయకట్టుకు సైతం నీరంది, పంటలు పుష్కలంగా పండుతున్నాయి.
గతంలో కాలువ చివరి భూములకు సాగునీరందక బీళ్లుగా ఉండేవి. నేడు ఎక్కడ చూసినా పచ్చని పొలాలతో కళకళలాడుతున్నాయి. 2009 నుంచి ధర్మపురి ఎమ్మెల్యేగా, చీఫ్విప్గా, సంక్షేమశాఖ మంత్రిగా ఉన్న ఉద్యమ నాయకుడు కొప్పుల ఈశ్వర్ ప్రగతి ప్రదాత కేసీఆర్ సహకారంతో పెద్ద ఎత్తున నిధులు తీసుకవచ్చి ప్రతి పల్లెలో సమస్యలు లేకుండా చూస్తున్నారు. లిఫ్టులు, చెక్డ్యాంల నిర్మాణంతో పాటు మిషన్ కాకతీయ ప్రాజెక్టు కింద చెరువులను పునరుద్ధరించారు. ఒకవైపు అభివృద్ధి పరుగులు పెడుతుంటే, మరోవైపు సంక్షేమాన్ని గడపగడపకూ చేర్చారు. వేలాది మందికి పెన్షన్లు, దివ్యాంగుల విషయంలో పైలెట్ ప్రాజెక్టుగా వేలాది మందికి సాంకేతిక పరికరాల పంపిణీ చేశారు. ఇప్పటికే 100మంది దళితులకు దళితబంధు అందించారు. మరో 2500 మందికి ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. ఇక ఎంబీసీ కులాల వృత్తిదారుల అభివృద్ధి కోసం కులవృత్తుల సాయం కింద ఇప్పటికే 600 మందికి లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.
ఎస్డీఎఫ్, డీఎమ్ఎఫ్టీ, ఆర్అండ్బీ, పీఆర్ తదితర నిధులతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. వెల్గటూర్ మండలంలో 12కోట్లతో అంబారిపేట-చెగ్యాం డబుల్ రోడ్లు నిర్మాణం పూర్తయింది. చిల్వకోడూర్- స్తంభంపల్లి మధ్య 13కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణం జరుగుతున్నది. 3కోట్లతో వెల్గటూర్ మండలం పెద్దవాగుపై మూడు చెక్డ్యామ్ల నిర్మాణం, 1.50కోట్లతో కేజీబీవీ హాస్టల్, 1.50కోట్లతో స్తంభంపల్లి నుంచి కోటిలింగాల దేవస్థానం దాకా రోడ్డు, 11.50కోట్లతో వెల్గటూర్ మండలంలో 5 హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. 15కోట్లతో చిల్వకోడూర్- పెగడపల్లి డబుల్రోడ్డు పూర్తి, 14కోట్లతో గొల్లపెల్లి- ఆరవెల్లి దాకా రాఘవపట్నం, లింగాపూర్, అగ్గిమల్ల, గుంజపడుగు గ్రామాలను కలుపుతూ మళ్లీ గొల్లపల్లి దాకా రింగ్రోడ్డు పనులు ప్రగతిలో ఉన్నాయి. 16కోట్లతో స్తంభంపల్లి- చిల్వకోడూర్ మధ్యలో డబుల్రోడ్డు నిర్మాణం పురోగతిలో ఉంది. 15కోట్లతో వెల్గటూర్ నుంచి కల్లెడ డబుల్ రోడ్డు నిర్మాణం జరుగుతోంది.
4కోట్ల తో దట్నూర్ వంతెన నిర్మాణం పూర్తయింది. 4కోట్లతో చిల్వకోడూర్, లోత్తునూర్ లో రెండు చెక్డ్యామ్లు నిర్మించబడ్డాయి. 10కోట్లతో తిర్మలాపూర్ -చిల్వకోడూర్ మధ్య డబుల్ రోడ్డు పూర్తి చేసుకున్నారు. రూ.4కోట్లతో గొల్లపెల్లి మండల కేంద్రంలో డబుల్ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులు, 2కోట్లతో ఇబ్రహీంనగర్-శంకర్రావ్పేట బీట్ రోడ్డు నిర్మాణం, 4కోట్లతో ఇస్రాజ్పల్లి నుంచి గుంజపడుగు దాకా డబుల్ రోడ్డు నిర్మాణం పూర్తయింది. 14కోట్లతో వెంగళపూర్ టూ అనంతారం రోడ్డు నిర్మించబడింది. 8కోట్లతో శెకల్ల వంతెన, గుంజపడుగు హైలెవల్ వంతెనల నిర్మాణం జరిగింది. 6.7కోట్లతో ధర్మపురి వద్ద గోదావరిలో మురుగనీరు కలువకుండా మహాడ్రైనేజీ నిర్మించడంతో నేడు గోదావరి స్వచ్ఛంగా కనిపిస్తోంది. 1.30 కోట్లతో ధర్మపురి పట్టణ నడిబొడ్డున మురుగు కూపంలా ఉన్న చింతామణి చెరువు సుందరీకరణ పనులు పూర్తయ్యాయి.
16కోట్లతో ధర్మపురి పట్టణ పరిధిలోని జాతీయరహదారి ఆరులైన్ల రహదారిగా విస్తరణ జరుగుతోంది. రూ.2కోట్లతో ధర్మపురికి తాగునీరందించేందుకు కమలాపూర్ బోలీ చెరువు ఆధారంగా ఫిల్టర్ బెడ్ నిర్మించారు. 11.10కోట్లతో ధర్మపురి పట్టణంలోని అంతర్గత సీసీ రహదారులు, డ్రైనేజీల నిర్మాణం పూర్తి చేశారు. తాజాగా ఇటీవలే నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, ధర్మపురి మున్సిపల్ అభివృద్ధి కోసం 25 కోట్లు మంజూరు చేశారు. ఇలా దాదాపు పదేండ్ల కాలంలో ధర్మపురి అభివృద్ధి క్షేత్రంగా మారిపోయింది.
ధర్మపురి నియోజకవర్గంలో అభివృద్ధితో పాటు, సంక్షేమం పరవళ్లు తొక్కుతూనే ఉంది. నియోజకవర్గంలో 16561 మందికి వృద్ధాప్య, 10767 మందికి వితంతు, 4479 మందికి దివ్యాంగ పింఛన్లు, 1010 మందికి గీత, 963 మంది చేనేత, 12563 మంది బీడీ కార్మికులు, 873 మంది ఒంటరి మహిళలు, 256 మంది ఫైలేరియా, 16 మంది డయాలసిస్ బాధితులతో పాటు, కొత్తగా 34 వేల మందికి దాదాపు ఏడాది క్రితం అదనంగగా పెన్షన్లు మంజూరు చేశారు. నియోజకవర్గంలో మొత్తం 81,980 మంది పెన్షన్లు పొందుతుండడం గమనార్హం. అన్ని రకాల పెన్షన్ల కింద ధర్మపురి నియోజకవర్గంలో ఏటా రూ.660 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇక రైతుబంధు, రైతుబీమా సౌకర్యం పెద్ద సంఖ్యలోనే రైతులు పొందుతున్నారు.
నియోజకవర్గంలో 69871 మంది రైతులు ఇప్పటి వరకు రైతుబంధు పథకాన్ని పొందారు. ఈ పథకం ద్వారా రైతులకు రూ.658.62కోట్లు ప్రభుత్వం అందజేసింది. అలాగే నియోజకవర్గం పరిధిలో 873 మంది రైతులు మృత్యువాత పడగా, వారికి రూ.43.65కోట్లు బీమా మొత్తం పొందారు. ఇప్పటి వరకు 500 మందికి పైగా బీసీ కులవృత్తుల వారికి లక్ష రూపాయల కులవృత్తుల సాయం అందజేశారు. అలాగే దళితుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన దళిత బంధు పథకం 100 మందికి వర్తించగా, మరో 2వేల మందికి దళితబంధు సిద్ధమైంది. సీఎం సహాయ నిధి ద్వారా పెద్ద సంఖ్యలో అనారోగ్య బాధితులకు ఆర్థిక సహాయం చేశారు. 10 ఏండ్ల వ్యవధిలో దాదాపు రూ.16కోట్ల దాకా ముఖ్యమంత్రి సహాయనిధి కింద ఆర్థిక సాయం అందించడం గమనార్హం.
ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మపురి, వెల్గటూర్ మండలాల రైతులకు సాగునీరందించడం కోసం గోదావరి నది ఆధారంగా 11 ఎత్తిపోతలను నిర్మించారు. వీటి నిర్మాణానికి 247.86కోట్లు కేటాయించారు. ధర్మపురి మండలంలో తొమ్మిది, వెల్గటూర్ మండలంలో రెండు ఎత్తిపోతల ద్వారా దాదాపు 14వేల ఎకరాలకు సాగునీరందుతున్నది. అందులో ధర్మపురి మండలం దొంతాపూర్లో 18.24కోట్లతో ఎత్తిపోతల పథకం నిర్మించి 1824 ఎకరాలకు, ఎండపల్లిలో 9.27కోట్లతో నిర్మించి 12ఎకరాలకు, జైనలో 10.89కోట్లతో నిర్మించి వెయ్యి ఎకరాలకు, రాజారంలో 10కోట్లతో నిర్మించి వెయ్యి ఎకరాలకు సాగునీరందిస్తున్నారు. ఇక 18.91కోట్లతో ధమన్నపేట ఎత్తిపోతల పథకం ద్వారా 1550 ఎకరాలకు నీరందుతున్నది.
అక్కెపెల్లి చెరువు నింపేందుకు 60.80కోట్లు మంజూరు కాగా, పనులు టెండర్ దశలో ఉన్నాయి. పూర్తయితే 4377 ఎకరాలకు సాగునీరందనున్నది. 19.20కోట్లతో నిర్మించిన ఎత్తిపోతల పథకం ద్వారా2200 ఎకరాలకు, 10కోట్లతో నిర్మించిన రాయపట్నం ఎత్తిపోతల పథకం కింద 1200 ఎకరాలకు, 37.63కోట్లతో వెల్గటూర్ మండలం స్తంబంపల్లిలో నిర్మించిన ఎత్తిపోతల పథకం ద్వారా 3585 ఎకరాలకు సాగునీరందుతున్నది. 29.64కోట్లతో వెల్గటూర్లో నిర్మించిన పథకం ద్వారా 1757 ఎకరాలకు, 14.35కోట్లతో నిర్మించిన మత్తునూర్ ఎత్తిపోతల పథకం ద్వారా 2300 ఎకరాలకు సాగునీరందుతున్నది. ఎత్తిపోతల పథకాలతో పాటు నియోజకవర్గంలోని చెరువులన్నీ మిషన్ కాకతీయ ప్రాజెక్టు కింద పునరుద్ధరించారు. దీంతో ప్రతి ఎకరాకు పుష్కలంగా సాగునీరందుతున్నది.
ధర్మపురి టెంపుల్ సిటీ అభివృద్ధికి 141 కోట్ల నిధులు మంజూరు కాగా కొన్ని పనులు పూర్తయ్యాయి. మరికొన్ని పురోగతిలో ఉన్నాయి. ఒకప్పుడు మేజర్ పంచాయతీ ఉన్న ధర్మపురిని 2018లో మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేశారు. 25కోట్లు మంజూరు చేయించారు. దేవస్థానం అభివృద్ధికి 100కోట్లు మంజూరు చేయించారు. 2019లో సీఎం కేసీఆర్ ధర్మపురిని సందర్శంచిన సందర్భంలో 10కోట్లు మంజూరు చేశారు. అలాగే డీఎంఎఫ్టీ నిధులు 6 కోట్లు కేటాయించగా, మొత్తం 141 కోట్లతో పనులు నడుస్తున్నాయి. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం, అనుబంధ ఆలయాల అభివృద్ధితోపాటు పట్టణాన్ని సుందరీకరించి, పర్యాటక ప్రాంతంగా రూపొందించేందుకు సమగ్ర ప్రణాళిక తయారు చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆది నుంచీ రైతులకు అండగా నిలుస్తున్నారు. 24గంటల ఉచిత కరెంట్, సాగునీరు, రైతుబంధు, రైతు బీమా అందిస్తున్నారు. రైతులంతా కలిసి పంటల సాగు విధానంపై చర్చించుకునేందుకు క్లస్టర్లో రైతు వేదికలు నిర్మించారు. ధర్మపురి నియోజకవర్గంలో మొత్తం 24 రైతువేదికలు నిర్మించారు. ఒక్కో రైతువేదికకు 22లక్షల చొప్పున 5.28కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. క్లస్టర్ల వారీగా ధర్మపురి మండలంలో 4, పెగడపల్లిలో 4, గొల్లపెల్లిలో 5, వెల్గటూర్లో 5, బుగ్గారంలో 1, ధర్మారంలో 5 నిర్మించారు.
అన్ని మతాలను గౌరవిస్తూ నియోజకవర్గంలోని చర్చిలు, కబ్రస్థాన్లు, మజీదుల నిర్మాణాలు, మరమ్మతులకు 14.39కోట్లు వెచ్చించారు. ఇందులో ఖబ్రస్థాన్, మసీదులకు 4.74కోట్లు, చర్చిల మరమ్మతుకు 9.65కోట్లు వెచ్చించారు.
నియోజకవర్గ ప్రజలు ఈ సారి ఆశీర్వదిస్తే, గోదావరినది పొంగినప్పుడు ముంపుసకు గురవుతున్న ధర్మపురి పట్టణానికి రక్షణగా బండ్ నిర్మిస్తా. మూడు నాలుగేండ్ల నుంచి వరదలతో గోదావరి ఉప్పొంగి, పట్టణంలో చాలా కాలనీలు నీట మునుగుతున్నాయి. ప్రజలు ఇబ్బందుల పడుతున్నరు. అయితే ముంబై సిటీలోకి సముద్రం నీరు రాకుండా ఎలాగైతే బండ్ నిర్మించారో అలాగే ఇక్కడ కూడా నిర్మిస్తా. 2009లో ఈ ప్రాంతానికి వచ్చిన టైంలో నియోజకవర్గ పరిస్థితి దయనీయ స్థితిలో ఉండేది. కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక సహకారంతో ధర్మపురిని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశా. నిజంగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు జరిగిన అభివృద్ధిని చూస్తే ఎంతో గర్వంగా ఉంటుంది.
ధర్మపురి పట్టణానికి సంబంధించి దేవస్థానం, టెంపుల్ సిటీ అభివృద్ధి కోసం రూ.141కోట్లతో పనులు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. అవి పూర్తయితే ధర్మపురి రూపురేఖలే మారిపోతాయి. ముఖ్యంగా ధర్మపురి వద్ద గోదావరిలో మురుగునీరు కలువకుండా రూ.6.7 కోట్లతో 2కిలోమీటర్ల దూరానికి అండర్గ్రౌడ్ డ్రైనేజీ నిర్మించుకున్నం. ధర్మపురిలో 30 పడకల దవాఖానను 50 పడకలకు అప్గ్రేడ్ చేయించినం. ఈ ప్రాంతానికి వెయ్యి కోట్లతో ఇథనాల్ పరిశ్రమను క్రిబ్కో ఆధ్వర్యంలో మంజూరు చేయిస్తే, ఇక్కడి స్వార్థ రాజకీయ నాయకులు కుట్ర చేసి పరిశ్రమను రాకుండా చేశారు. రైతులు, వ్యాపారులు, యువత, కూలీల ఉద్యోగ, ఉపాధి అవకాశాలను దెబ్బతీశారు. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీకి కేటాయించిన స్థలంలోనే వ్యవసాయ డిగ్రీ కాలేజీని నిర్మిస్తున్నాం.
– కొప్పుల ఈశ్వర్, ధర్మపురి బీఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్ర మంత్రి