ధర్మారం, ఆగస్టు1: స్వరాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, సబ్బండవర్గాల సంతోషమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. మంగళవారం ధర్మారం మండలంలో విస్తృతంగా పర్యటించారు. ధర్మారం పంచాయతీ పరిధిలోని జకన్నపల్లి, మండల కేంద్రంలో సంఘ భవనాలకు శంకుస్థాపన చేశారు. నర్సింగాపూర్లో వంతెన నిర్మాణానికి, మల్లాపూర్ బాలికల గురుకుల విద్యాలయంలో లెబోరేటరీ నిర్మాణానికి శంకుస్థాపన, మల్లాపూర్, లంబాడి తండా (బి), (కె)లో పర్యటించి అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. మొత్తంగా ఆయా గ్రామాల్లో రూ.4 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన 400 మంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరగా, కండువాలు కప్పి మంత్రి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడారు. అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని, నిరుపేదల కోసం ఆసరా పింఛన్ ఇస్తున్నారని, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద ఆడబిడ్డల వివాహానికి రూ.లక్షానూటపదహార్లు సాయం చేస్తున్నారని కొనియాడారు. ప్రాజెక్టులు కట్టి రైతులకు సమృద్ధిగా సాగునీరందించడంతో పంటలు పుష్కలంగా పండుతున్నాయని, వరి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే రికార్డును సాధించిందని గుర్తుచేశారు. గత ప్రభుత్వాలు ప్రజల కోసం ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేదని, ఒక్క సీఎం కేసీఆర్ మాత్రమే అన్నివర్గాలను కడుపులో పెట్టిచూసుకుంటున్నారని పునరుద్ఘాటించారు.
మన పథకాలను ఇతర రాష్ట్రాలు స్ఫూర్తిగా తీసుకొని అమలు చేస్తున్నాయంటే ఇది మన సీఎం కేసీఆర్, రాష్ట్రం గొప్పతనమేనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు మరోసారి బీఆర్ఎస్ను ఆశీర్వదించి, కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎం చేయాలని కోరారు. నియోజకవర్గ ప్రజలు తనను మరొకసారి ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. అప్రమత్తంగా లేకపోతే ఆగమైపోతామని, కాంగ్రెస్, బీజేపీలకు అవకాశం ఇస్తే సీఎం కేసీఆర్ కట్టిన బొమ్మరిల్లు ఇచ్చుకపోయే ప్రమాదం ఉందన్నారు. ఆ పార్టీ నేతలతో ఒరిగేదేం లేదని, అసత్య ప్రచారాలకు తప్ప వారు ఎందుకూ పనికిరారని మండిపడ్డారు. మల్లాపూర్ బాలికల గురుకులంలో శిథిలమైన పాత గదులను కూల్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శితో మంత్రి ఫోన్లో మాట్లాడి ఆదేశించారు.
విద్యార్థులు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. ఇక్కడ ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జడ్పీ సభ్యురాలు పూస్కూరు పద్మజ, సింగిల్ విండో చైర్మన్లు ముత్యాల బలరాం రెడ్డి, నోముల వెంకట్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, వైస్ చైర్మన్ చొప్పరి చంద్రయ్య, వైస్ ఎంపీపీ మేడవేణి తిరుపతి, జిల్లా రైతుబంధు సభ్యులు పూస్కూరు రామారావు, ఎగ్గెల స్వామి, మండల కోఆర్డినేటర్ పాకాల రాజయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్, సర్పంచులు పూస్కూరు జితేందర్ రావు, సురకంటి శ్రీనివాసరెడ్డి, బద్దం సుజాత, గంధం వరలక్ష్మి, భూక్య చంద్రనాయక్, బకమ్మ, ఎంపీటీసీలు బద్దం అజయ్ పాల్ రెడ్డి, భూక్య సరిత, మల్లాపూర్ బాలికల గురుకుల ప్రిన్సిపాల్ గిరిజ, తహసీల్దార్ కేవై ప్రసాద్, ఎంపీఓ రమేశ్ ఉన్నారు.