రాంనగర్, ఫిబ్రవరి 27: మంత్రి పొన్నం ప్రభాకర్పై ప్రజాహిత యాత్రలో ఎంపీ బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. నగరంలోని ఇందిరాచౌక్లో మంగళవారం బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అదే సమయంలో బీజేపీ నాయకులు కూడా నిరసన తెలిపేందుకు అక్కడికి వస్తున్నారన్నా సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏసీపీ నరేందర్ ఆధ్వర్యంలో పోలీసులు కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకొని నచ్చజెప్పారు. కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, పద్మాకర్రెడ్డి మాట్లాడుతూ, పొన్నం ప్రభాకర్కు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు ఆధ్వర్యంలో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్రెడ్డి, నాయకులు ఏసీపీ నరేందర్కు ఫిర్యాదు చేశారు. అలాగే, బండి సంజయ్పై కాంగ్రెస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నరెడ్డి సీపీకి ఫిర్యాదు చేశారు. రాజీవ్చౌక్లో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్, బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద పార్టీ కరీంనగర్ రూరల్ మండలాధ్యక్షుడు షహనాజ్ ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
రాముడి పేరు ఎత్తకుండా పోటీ చేసే దమ్ముందా?
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి రాముడి పేరు ఎత్తకుండా పోటీ చేసే దమ్ముందా అని కాంగ్రెస్ సీనియర్ నేత, కుల సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం సవాల్ చేశారు. నగరంలోని డీసీసీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్ డిపాజిట్ గల్లంతు అవుతుందని జోస్యం చెప్పారు.
మంత్రి పొన్నం ప్రభాకర్పై ఎంపీ బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని కాంగ్రెస్ మైనార్టీ నాయకుడు కిమ్ ఫహాద్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బండి సంజయ్కుమార్కు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్పై ఎంపీ బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు వివిధ మండలాల్లో నిరసన తెలిపారు. శంకరపట్నం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై అంబేద్కర్ విగ్రహం వద్ద, తిమ్మాపూర్ మండలం అలుగునూర్ చౌరస్తాలో, గన్నేరువరంలో బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అలాగే ఆయనపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని హుజూరాబాద్, చొప్పదండి, గన్నేరువరం పోలీస్ స్టేషన్లలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు.
ఉద్రిక్తతల నడుమ ‘బండి’ ప్రజాహిత యాత్ర
మండలంలోని బొమ్మనపల్లిలో మంగళవారం ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్ర ఉద్రిక్తతల మధ్య సాగింది. ప్రజాహిత యాత్రలో భాగంగా సోమవారం రాత్రి బండి సంజయ్ చిగురుమామిడిలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్పై చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. రాత్రి బొమ్మనపల్లిలో సంజయ్ బస చేసిన క్యాంపును ముట్టడించేందుకు ఉదయాన్నే కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. క్యాంపులోకి వెళ్లేందుకు యత్నించగా, అకడే ఉన్న బీజేపీ నాయకులు ప్రతిఘటించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ, సిద్దిపేట పోలీసుల ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. విషయం తెలుసుకొని క్యాంపునకు వెళ్తున్న బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తిని పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి సద్దుమణిగిన తర్వాత పోలీసులు యాత్రకు అనుమతించడంతో యథావిధిగా సాగింది. అలాగే, చిగురుమామిడి బస్టాండ్ వద్ద కాంగ్రెస్ మండల శాఖ ఆధ్వర్యంలో ఎంపీ బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అంతకుముందు ఉల్లంపల్లి, హుస్నాబాద్ రహదారిపై సంజయ్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. కాగా, సంజయ్పై చర్యలు తీసుకోవాలని చిగురుమామిడి, హుస్నాబాద్ ఠాణాల్లో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. మరోవైపు కాంగ్రెస్ శ్రేణుల తీరుపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.