పనిచేయించుకోని పారితోషికం అందించకుండా కాంగ్రెస్ సర్కారు మొండిచేయి చూపుతున్నది. 2024 నవంబర్లో చేపట్టిన ఇంటింటా సమగ్ర కుటుంబ సర్వే కోసం ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లను నియమించింది. ప్రభుత్వ ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, మున్సిపల్ వార్డు అధికారులను అందులో భాగస్వాముల్ని చేసింది. ఒక్కొక్కరికి 120 నుంచి 170వరకు కుటుంబాల చొప్పున 56 అంశాలతో కూడిన సమాచారాన్ని సిబ్బంది సేకరించగా, ఈ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. అయితే ఈ సర్వే పూర్తయి పధ్నాలుగు నెలలు అవుతున్నా పారితోషకం ఇవ్వకపోవడంపై సర్వే చేసిన సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేసింది.
కోనరావుపేట, జనవరి 23 : రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2024 నవంబర్లో చేపట్టిన ఇంటింటా సమగ్ర కుటుంబ సర్వేలో 1,531మంది ఎన్యూమరేటర్లు, 150మంది సూపర్వైజర్లుగా విధులు నిర్వర్తించారు. ఒక్కో ఎన్యూమరేటర్ 120 నుంచి 170 కుటుంబాల వరకు సర్వే చేసి వివరాలను సేకరించారు. జిల్లాలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మొత్తంగా 1,93,310 కుటుంబాల వివరాలను ఎంట్రీ చేశారు. ఒక్కో కుటుంబానికి ఎనిమిది పేజీలతో కూడిన సర్వే ఫారంలో 75 రకాల ప్రశ్నలతో ఎన్యూమరేటర్లు ఎంతో ఓపికతో వివరాలు నమోదు చేశారు. ప్రభుత్వ ఒత్తిడితో 10నుంచి 18రోజుల్లోనే సర్వే పూర్తి చేసి చేశారు. అంతేకాకుండా రెండో విడుతలో సైతం సర్వే చేయించారు. అయితే ఇప్పటికీ చేసిన సర్వేకు గౌరవ వేతనం ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
సర్వేలో పాల్గొన్న ఎన్యూమరేటర్లకు 10వేలు, సూపర్వైజర్లకు 12వేలు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కుటుంబ వివరాలను ఆన్లైన్లో పొందుపర్చిన డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఒక్కో దరఖాస్తు చొప్పున 25ఇస్తామని చెప్పింది. జిల్లాలో 1,93,310 కుటుంబాల డాటా ఎంట్రీ కోసం 1,300కు పైగా ఆపరేట్లతో డాటా ఎంట్రీ చేయించారు. దీంతో కులగణన సర్వేచేసిన వారికి సుమారు 2కోట్లు వరకు గౌరవ వేతనం చెల్లించాల్సి ఉన్నది. సర్వే పూర్తయిన వెంటనే చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వకపోవడంతో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే గౌరవ వేతనం చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రభుత్వం కులగణన సర్వే చేయించి మాతో డాటా ఎంట్రీ చేయించింది. ఇంటి వద్ద ఖాళీగా ఉండలేక ఉపాధి కోసం అధికారులు చెప్పగానే డాటా ఎంట్రీ చేసేందుకు వెళ్లాను. కానీ, పద్నాలుగు నెలలు గడిచినా డబ్బులు చెల్లించక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు డాటా ఎంట్రీ సమయంలో ఒక్కో దరఖాస్తుకు ఎంత పారితోషికం ఇస్తారో కూడా చెప్పలేదు. కార్యాలయాలకు వెళ్లి అధికారులను అడిగితే ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని చెబుతున్నారు. కలెక్టర్ స్పందించి గౌరవవేతనం అందించాలని కోరుతున్నాం.
కులగణన సర్వేలోని కుటుంబ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడానికి అధికారులు రమ్మని చెప్పారు. ఒక్కో దరఖాస్తుకు తగిన పారితోషికం ఇస్తామని చెప్పారు. అప్పుడు కలెక్టర్ కార్యాలయంలో డాటా ఎంట్రీ చేసేందుకు వెళ్లాను. 250 వరకు ఇండ్ల వివరాలను ఆన్లైన్ నమోదు చేశాను. పద్నాలుగు నెలలు గడుస్తున్నా అధికారులు మాత్రం ప్రభుత్వం ఇంకా నిధులు విడుదల చేయలేదని చెబుతున్నారు. ఉపాధి లేకపోవడంతోనే డాటా ఎంట్రీ చేసేందుకు వెళ్లాను. కానీ, ఇలా డబ్బులు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా. అధికారులు ప్రత్యేక చొరవ చూపి డబ్బులు చెల్లించాలి.