చొప్పదండి, ఫిబ్రవరి 22: ‘మన ఊరు మనబడి’లో భాగంగా గత కేసీఆర్ సర్కారు.. ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా చొప్పదండితోపాటు మండలంలోని పలు పాఠశాలల్లో డైనింగ్హాల్ నిర్మాణ పనులను చేపట్టింది. కానీ, రెండేళ్ల కింద ప్రభుత్వం మారడంతో నిర్లక్ష్యమే ఎదురైంది. కాంగ్రెస్ సర్కారు పట్టించుకోకపోవడంతో పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి.
కాంట్రాక్టర్లకు నిధులు విడుదల కాకపోవడంతో మధ్యలోనే ఆగిపోయాయి. పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో డైనింగ్ హాల్ పనులు 80 శాతం, బాలికల ఉన్నత పాఠశాలలో 90 శాతమే పూర్తయ్యాయి. గుమ్లాపూర్ పాఠశాలలోనూ అసంపూర్తిగానే ఉన్నాయి. రాగంపేటలో పిల్లర్ స్థాయిలోనే నిలిచిపోయాయి. దీంతో ఆయా స్కూళ్లలో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.
చొప్పదండిలో ఇలా చెట్ల కిందనే మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. కోతల బెడదతో భోజన సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడికి తెచ్చిన డైనింగ్ టేబుళ్లు వినియోగం లేక తుప్పు పట్టి పట్టిపోతున్నాయి. డైనింగ్ హాల్ను కాంట్రాక్టర్ స్టోర్ రూంగా వాడడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ విషయమై హెచ్ఎం వైద్యుల రాజిరెడ్డి మాట్లాడుతూ, పనులు ఆగి పోయిన మాట వాస్తవమేనన్నారు. ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని, వచ్చే అకాడమిక్ ఇయర్ వరకు డైనింగ్ హాల్ను వినియోగంలోకి తెస్తామని చెప్పారు.