కాంగ్రెస్ రెండేళ్లలో చేసిందేమీ లేదు. ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. రేవంత్రెడ్డి దొంగ మాటలను నమ్మి ప్రజలు ఇప్పుడు గోసపడుతున్నరు. రెండేళ్లలోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నరు. ప్రజా సమస్యలపై పోరాటం చేసే దమ్మున్న బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రజలు గెలిపించాలి. మరో రెండున్నరేళ్ల కాలంలో మళ్లీ బీఆర్ఎస్ సర్కారే వస్తుంది. అప్పుడు కరీంనగర్లో సిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయిస్తం.
కరీంనగర్ కార్పొరేషన్, ఫిబ్రవరి 8 : కాంగ్రెస్, బీజేపీకి ప్రజల్లో అలజడి రేకెత్తించడమే తప్ప అభివృద్ధి చేతకాదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. ఆ రెండు పార్టీలు ప్రజలను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నాయని, మాయమాటలు చెప్పి సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయని లేదని మండిపడ్డారు. మళ్లీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని, వాటిని నమ్మితే ప్రజలు మరోసారి మోసపోతారని హెచ్చరించారు. మళ్లీ అభివృద్ధి కావాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించాలని కోరారు.
ఆదివారం నగరంలోని 14, 15, 18, 22, 24, 53 డివిజన్లలో విస్తృత ప్రచారం చేశారు. ఆయాచోట్ల ఆయన కాంగ్రెస్, బీజేపీ రాష్ర్టానికి చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టారు. బీఆర్ఎస్ పదేళ్లలో చేసిన అభివృద్ధి గురించి వివరించారు. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను ఆదర్శంగా నిలిపారని, పదేళ్లు ప్రజలకు నీళ్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంతోపాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. నిరుపేద బిడ్డలు కూడా డాక్టర్లు కావాలనే సంకల్పంతో కొత్తపల్లిలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారని చెప్పారు. తాను 2014లో ఎంపీగా ఉన్న సమయంలోనే మనోహరాబాద్, కొత్తపల్లి రైల్వేలైన్ మంజూ రు చేయించానని, ఇప్పటికే సిద్దిపేట వరకు పూర్తి పూర్తయ్యాయని, సిరిసిల్ల వరకు నడస్తున్నాయని చెప్పారు.
తాను ఎంపీగా ఉన్నప్పుడే కరీంనగర్ను స్మార్ట్సిటీ జాబితాలో చేర్పించి కేంద్రం నుంచి 500 కోట్లు, రాష్ట్రం నుంచి మరో 500 కోట్ల నిధులు తెచ్చి నగరాన్ని అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడున్న ఎంపీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లాకు ఏ ఒక్క పనైనా చేశారా..? అని ప్రశ్నించారు. గతంలో కొత్తపల్లి చెరువు ఎండకాలంలో ఎండిపోయేదని, కాకతీయ కాలువకు తూము ఏర్పాటు చేసి నిరంతరం నీళ్లు ఉండేలా చేశామన్నారు.
కరీంనగర్ నుంచి వెలిచాల క్రాస్ రోడ్ వరకు డివైడర్, సెంట్రల్ లైటింగ్ కోసం ప్రతిపాదనలు పంపించామని, కాంగ్రెస్ వచ్చిన తర్వాత పనులు సాగడం లేదని మండిపడ్డారు. వరంగల్ నుంచి జగిత్యాల వరకు వెళ్లే జాతీయ రహదారి కొత్తపల్లి మీదుగా వెళ్తే ప్రజలు నష్టపోతారని జమీలుద్దీన్ నాదృష్టికి తీసుకొస్తే, కేంద్ర మంత్రి నితిన్ గడరీ దగ్గరికి వెళ్లి అలైన్మెంట్ మార్చామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణరావు, ఆయా డివిజన్ల అభ్యర్థులు గడ్డి ప్రదీప్, శివప్రియ జయప్రకాశ్రెడ్డి, జమీలుద్దీన్, పటేల్ సుధీర్ రెడ్డి, గండ్ర రఘునాథరావు, రాజేశ్వరీ పద్మయ్య పాల్గొన్నారు.