పెద్దపల్లి, జూన్ 6(నమస్తే తెలంగాణ): సింగరేణిలో కుంభకోణాలు, కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి అక్రమాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్రావు గళం విప్పనున్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన పర్యటన ఖరారైంది. ముందుగా పెద్దపల్లిలోని రంగంపల్లి వద్ద గల తిరుమలగార్డెన్లో మధ్యాహ్నం 2 గంటలకు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొని బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతం, తదితర అంశాలపై చర్చించనున్నారు. సాయంత్రం 4 గంటలకు గోదావరిఖని సీఎస్పీలో సింగరేణి కార్మికులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు.
అనంతరం 5 గంటలకు ఎన్టీపీసీ ఖాజీపల్లిలో గల శ్రీమయి ఫంక్షన్హాల్లో నిర్వహించే సింగరేణి కార్మికుల భారీ సదస్సులో ఆయన ప్రసంగించనున్నారు. రెండున్నరేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, కుంభకోణాలను వివరించనున్నారు. సింగరేణి పరిరక్షణ, బీఆర్ఎస్, టీజీబీకేఎస్ బలోపేతం, సింగరేణి కార్మికల సమస్యలపై దిశానిర్ధేశం చేయనున్నారు. కాగా, ఈ సదస్సుపై సింగరేణి కార్మికులు ఆసక్తిని చూపుతున్నారు. పర్యటనలో సింగరేణి ప్రాంత మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధూకర్, బాల సుమన్, కోవ లక్ష్మి, కోరుకంటి చందర్, దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య పాల్గొననున్నారు.