మకరజ్యోతికి సమయం దగ్గరపడుతున్న వేళ అయ్యప్ప దీక్షాపరులకు కొత్త సమస్య వచ్చి పడింది. వివిధ కారణాలతో జనవరి ఒకటో తేదీ నుంచి 15 దాకా కేరళకు వెళ్లే దాదాపు 20 ట్రైన్లను రద్దు చేయడంతో ఆందోళన వ్యక్తమవుతున్నది. అయ్యప్ప దర్శనానికి అంతా సిద్ధం చేసుకున్న తరుణంలో శబరిమలకు ఎలా వెళ్లాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ఉన్నట్టుండి ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసుకోలేక అపసోపాలు పడుతున్నారు. నాలుగు నెలల ముందే బుక్ చేసుకున్నా ఫలితం లేదని వాపోతున్నారు.
కరీంనగర్ కార్పొరేషన్, డిసెంబర్ 31 : దీక్షను విరమించేందుకు అయ్యప్పస్వాములు కేరళలోని శబరిమలకు వెళ్తారు. జనవరి 15న జ్యోతి దర్శనం ఉండగా, ఒకటో తేదీ నుంచే అక్కడికి వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. ముందుగా వెళ్లినా అక్కడే ఉండి జ్యోతి దర్శనం ఉండేలా చూసుకుంటారు. ఆయా రోజుల్లో చేరుకునేందుకు నాలుగునెలల (120 రోజులు) ముందు నుంచే ప్లాన్ చేసుకుంటారు.
రానూ పోను ప్రయాణం, శబరిమల దర్శనం, వసతి ఇలా అన్నింటినీ పరిగణలోకి తీసుకుని రైల్ టికెట్లు కూడా బుక్ చేసుకుంటారు. ఎప్పట్లాగే ఈసారి కూడా బుక్ చేసుకున్న అయ్యప్ప స్వాములకు కొత్త సమస్య వచ్చి పడింది. ముందు నుంచే అంతా సిద్ధం చేసుకొని శబరిమల ప్రయాణానికి సిద్ధమైన తరుణంలో దక్షిణ మధ్య రైల్వే రైళ్లు రద్దు చేయడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎలా వెళ్లాలి అని సందిగ్ధంలో పడిపోయారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా మీదుగా కేరళలోని శబరిమలకు ట్రైన్లు తక్కువగానే ఉన్నాయి. ప్రతిరోజూ కేరళ ఎక్స్ప్రెస్ మాత్రమే నడుస్తుండగా, మిగిలినవి వారానికి ఒకటి, రెండుసార్లు వెళ్తున్నాయి. ఆదిలాబాద్, రామగుండం, వరంగల్ మీదుగా రెండు నుంచి నాలుగు ట్రైన్లు మాత్రం వెళ్తుంటాయి. అలాగే, హైదరాబాద్ మీదుగా ఒకటి, రెండు ట్రైన్లు మాత్రమే ఉన్నాయి. అయితే, వివిధ కారణాల నేపథ్యంలో 40 శాతం మేరకు ట్రైన్లు రద్దయినట్టు తెలుస్తున్నది. ఈ సమాచారాన్ని దక్షిణ మధ్య రైల్వే నాలుగు రోజుల క్రితమే ప్రయాణికులకు అందించగా, దీక్షాపరుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
ఖర్చు తక్కువ కావడం, చక్కటి వసతులు ఉండడంతో అయ్య ప్ప స్వాములు శబరిమలకు ట్రైన్లలో వెళ్లేందుకే ఆసక్తి చూపుతారు. అయితే, రైళ్లు రద్దవడంతో స్వాములు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు నెలల ముందే రైల్ టికెట్లను బుక్ చేసుకున్నా ఫలితం లేకపోయిందని వాపోతున్నారు. విమానాల్లో వెళ్లాలంటే ప్రయాణానికే 7 వేల నుంచి 12 వేల వరకు వెచ్చించాల్సి వస్తుందని, ఇంకా మిగతా ఖర్చులు ఉంటాయని చెబుతున్నారు. సొంత వాహనాల్లో లేదంటా ప్రైవేట్ వాహనాల్లో వెళ్లాలంటే ఇంకా భారమని వాపోతున్నారు. ఇప్పటికిప్పుడు ఇతర ట్రైన్లలో బుక్ చేసుకుందామంటే వెయిటింగ్ లిస్టు ఉన్నదని, దీంతో శబరియాత్రను ఎలా పూర్తి చేసేదని ఆందోళన చెందుతున్నారు.
శబరిమల యాత్ర కోసం సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోనే వరంగల్ నుంచి ఎర్నాకుళానికి రానూపోను రైల్ టికెట్ బుక్ చేసుకున్నాం. ఇప్పుడు ట్రైన్ రద్దు అయ్యిందని సమాచారం వచ్చింది. ఇప్పటికిప్పుడు మరో ట్రైన్లో బుక్ చేసుకుందామనుకున్నా సీట్లు ఖాళీగా లేవు. ఇప్పుడు ఎలా వెళ్లాలో తెలియడం లేదు. ఇలా ఉన్నపలంగా ట్రైన్స్ రద్దు చేయడం సరికాదు. వెంటనే ప్రత్యామ్నాయంగా ట్రైన్స్ వేయాలి.
– గడెం లక్ష్మణ్ స్వామి, కరీంనగర్