MLA Dr. Kalvakuntla Sanjay | కోరుట్ల, సెప్టెంబర్ 15 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధించిందని, కాంగ్రెస్ మూడేళ్ల పాలనలో ఐదేళ్లు రాష్ట్ర ప్రగతి వెనుకబడిందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 44 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం రిలీఫ్ పండ్ చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులకు పాలన చేతగాక కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి పధంలో నిలిచి దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4 వేల కోట్లని, ఎనిమిదేళ్లలో కేసీఆర్ రూ. 18 వేల కోట్లకు పెంచారని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ పాలనలో పథకాలు సవ్యంగా సాగాయని ప్రతీ నెలా ఠంచన్ గా లబ్ధిదారులకు ఫించన్లు అందించారని చెప్పారు. కాంగ్రెస్ 420 హమీలు 6 గ్యారంటీలతో ప్రజలను నమ్మించి మోసం చేసిందన్నారు. ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్క పథకం సక్రమంగా అమలు చేయకుండా ఉన్న వాటినే తొలగించే కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన పథకాలనే ఇప్పటికి ఆమలు చేస్తున్నారని, మూడేళ్ల రేవంత్ రెడ్డి పాలనలో రైతులు, నిరుద్యోగులు, మహిళలు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుంటుపడిందని, వ్యాపారాలు మందగించాయని, రియల్ ఎస్టేట్ రంగం కూదేలయిందని, ఐటీ కంపనీలు తరలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలను కంటికి రెప్పలా చూసుకున్న కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసిగిపోయారని రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెపుతారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఫహీమ్, సందయ్య, పొట్ట సురేందర్, జాల వినోద్ కుమార్, ఎలుగూరి కిరణ్, నత్తి రాజ్ కుమార్, గెల్లె గంగాధర్, మిట్ట పల్లి రాజశేఖర్, వనతడుపుల అంజయ్య, నీలి శ్రీనివాస్, అమేర్, రాధారపు సతీష్, తదితరులు పాల్గొన్నారు.