పెద్దపల్లి : ఇందిరమ్మ ఇళ్ల ( Indiramma Houses ) ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, ఆన్లైన్ విధానంలోనే జరుగుతోందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష( Collector Koya Sriharsha ) తెలిపారు. బుధవారం ఎన్టీపీసీ కాకతీయ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన రామగుండం ( Ramagundam ) నియోజకవర్గ స్థాయి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణ శ్రీ తో కలిసి పాల్గొన్నారు.
ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి అందిన దరఖాస్తులను ప్రభుత్వం కంప్యూటర్ ఆధారిత విధానంలో ఎల్-1, ఎల్-2, ఎల్-3 కేటగిరీలుగా విభజించిందన్నారు. ఇంటి స్థలం ఉండి ఇందిరమ్మ గృహానికి అర్హులైన వారు ఎల్-1 జాబితాలో ఉంటారని తెలిపారు. ఇందిరమ్మ కమిటీ సిఫారసు చేసిన ఎల్-1 దరఖాస్తులను మున్సిపల్ కమిషనర్ లాగిన్ ద్వారా గెజిటెడ్ అధికారులు పరిశీలిస్తారని, అర్హత నిర్ధారణ అనంతరం మున్సిపల్ కమిషనర్ ద్వారా జిల్లా కలెక్టర్కు చేరుతాయని తెలిపారు.
అనంతరం ఇన్చార్జి మంత్రి ఆమోదం పొందిన తర్వాత మాత్రమే మంజూరు ఉత్తర్వులు జారీ అవుతాయని, మొత్తం ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఆన్లైన్లోనే జరుగుతుందని స్పష్టం చేశారు.అర్హత ఉన్నప్పటికీ గతంలో దరఖాస్తు చేసుకోని కుటుంబాలు మున్సిపాలిటీలోని ప్రజాపాలన కేంద్రాల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆ దరఖాస్తులను హైదరాబాద్లో 360 డిగ్రీల పరిశీలన అనంతరం అర్హత నిర్ధారించి జిల్లాకు పంపిస్తారని, తర్వాత సాధారణ విధానంలో మంజూరు ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు.
ప్రజాపాలనలో గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాలకు తొలి ప్రాధాన్యతనిస్తూ గుడిసెలు లేని సమాజం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ ఎల్లయ్య, హౌసింగ్ పీడీ రాజేశ్వర్, తహసిల్దార్ రవీందర్ రావు, కార్పొరేటర్లు,స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.