Rajanna temple | వేములవాడ, జూన్ 19 : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అధికారులపై కొండ్లెపు ముత్యం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బిగితే కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. మోచి కులం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న తను వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయం ఎదురుగా కొబ్బరికాయలు, స్వామి వారి ఫొటోలతో కూడిన దుకాణం నడుపుతూ జీవనోపాధి పొందుతున్నానని తెలిపారు. పురపాలక సంఘం రహదారిపై దుకాణం పెట్టావని, దీనిని వెంటనే తీసివేయాలని మానసికంగా వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
20 రోజులుగా తనను వేధిస్తుండగా తన దుకాణంలోకి ఏఈఓలు శ్రవణ్ కుమార్, జయ కుమారి, పర్యవేక్షకులు నూగూరి నరేందర్, గడ్డం రాజేందర్, ఏఈ రామ్ కిషన్ రావు, భగవంత రావు, భరత్, గంగిశెట్టి సాయి, ఎస్పీఎఫ్ భద్రతా సిబ్బంది దుకాణంలోకి చొరబడి కులం పేరుతో దూషించి బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులు పేర్కొన్నారు. కులం పేరుతో దూషించి తనను బెదిరించిన వారిపై ఈవో రమాదేవితో పాటు ఆలయ ఉద్యోగులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు పేర్కొన్నారు.