‘శ్రీ ఆంజనేయం.. ప్రసన్నాంజనేయం.. రామభక్త హనుమాన్కీ.. జై బోలో హనుమాన్కీ’ నామ స్మరణతో అంజన్న క్షేత్రం మార్మోగుతున్నది. ఆలయానికి తరలివస్తున్న దీక్షాపరులతో కొండంతా కాషాయమయమవుతున్నది. కొండగట్టులో మూడు రోజుల పాటు జరిగే హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభం కాగా, యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. కాగా, స్వామివారికి భద్రాద్రి ఆలయం నుంచి తెచ్చిన పట్టు వస్ర్తాలతోపాటు పోచంపల్లి పట్టువస్ర్తాలను ఎమ్మెల్యే సుంకె సమర్పించగా, తొలిరోజు రుత్వికుల వేద మంత్రోచ్ఛారణల మధ్య త్రికుండాత్మక యజ్ఞం వైభవం జరిగింది. అటు రాష్ట్ర నలుమూలల నుంచి దీక్షాపరులు తరలివస్తుండగా, మాల విరమణ మొదలైంది.
మల్యాల, మే 12: కొండగట్టు అంజన్న సన్నిధిలో హ నుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలను ఆలయ అర్చకులు, వేద పండితులు శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. మూడురోజులపాటు నిర్వహించే వేడుకల్లో భాగంగా, గురువారమే అర్చకులు శాస్ర్తోక్తంగా ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. జయంతి వేడుకల సందర్భంగా అంజన్నకు భద్రాద్రి సీతారామచంద్ర స్వామి ఆలయం తరపున పట్టువస్ర్తాలు సమర్పించారు.
భద్రాద్రి ఆలయ ఈవో రమాదేవి, ప్రధాన అర్చకులు విజయ రాఘవన్, అర్చకులు అమరవాది వెంకట రాఘవన్తో పాటూ ఆలయ సిబ్బంది పట్టువస్ర్తాలను కొండగట్టుకు తీసుకురాగా, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఆలయ అనువంశిక అర్చకులు, పాలకమండలి సభ్యులతో కలిసి స్వామివారి చెంతకు తీసుకువచ్చారు. ఎమ్మెల్యేతోపాటు భద్రాచలం ఆలయ ఈవో, ప్రధాన అర్చకులు విజయ్ వాఘవన్కు ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ సాంస్కృతిక ఇన్చార్జి కలకోట శ్రీనివాసచారి ఆధ్వర్యంలో కళాకారుల బృందం చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కొండగట్టు వై జంక్షన్ నుంచి ఆలయం దాకా డప్పు చప్పు ళ్లు, కోళాటాలు, ఒగ్గు డోలు విన్యాసాలు, శివసత్తుల పూనకాల మధ్య ఆటపాటలతో పట్టువస్ర్తాలను ఎదుర్కొన్నారు.
తరలివస్తున్న దీక్షాపరులు
పెద్ద జయంతి సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి దీక్షాపరులు తరలివస్తున్నారు. తొలి రోజు దీక్షాపరుల రాక సన్నగిల్లినప్పటికీ సూర్యాస్తమయం తర్వాత పెరిగింది. కాలినడకన వచ్చేవారు కొండగట్టు గుట్ట కింది నుంచి ఘాట్ రోడ్డు, పురాతన మెట్ల దారి ద్వారా ఆలయానికి చేరుకుంటున్నారు. ఉత్సవాల తొలి రోజునే మాల విరమణ మండపాన్ని తెరిచారు. విరమణ మండపంలో అంజనేయ స్వామి చిత్రపటాన్ని ప్రతిష్టించి శుక్రవారం ఉదయం నుంచే మాల విరమణ చేస్తున్నారు.