దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యా దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా సంబురంగా జరుపుకొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు కలిసి ఊరూరా.. వాడ వాడలా ర్యాలీలు తీశారు. ‘మన ఊరు మనబడి’ ద్వారా అభివృద్ధి పనులు పూర్తి చేసుకున్న పాఠశాలు, కొత్తగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాలను ప్రముఖులు హాజరై ప్రారంభించారు. గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట మండలాల్లో మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, మేడిపల్లి మండలం కల్వకోటలో చెన్నమనేని రమేశ్బాబు, ఇల్లంతకుంటలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బోయినపల్లి మండలం తడగొండలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వేడుకల్లో పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల, జూన్20(నమస్తే తెలంగాణ): దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా విద్యా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయా పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులకు ఉపన్యాస, వ్యాస రచన, క్విజ్, వేషధారణ, పాటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. అనేక పాఠశాల్లో విద్యార్థులకు రాగి జావ అందించారు. అన్ని ప్రభుత్వ, పలు ప్రైవేట్ పాఠశాలల్లో ఈ వేడుకలు జరిగాయి. ప్రతి పాఠశాలలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు కలిసి ఊరూరా.. వాడ వాడలా ర్యాలీలు తీశారు. తొమ్మిదేండ్లలో విద్యారంగంలో సాధించిన ప్రగతిని వివరిస్తూ గ్రామ ప్రజలకు, తల్లిదండ్రులకు కరపత్రాలు పంపిణీ చేశారు.
గ్రామ కూడలిలో విద్యా రంగంలో సాధించిన అభివృద్ధిపై ప్రదర్శనలిచ్చారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కాగా, గంభీరావుపేట మండలం గోరంటాల, ఎల్లారెడ్డిపేట మండలకేంద్రంలో జరిగిన విద్యా దినోత్సవంలో మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు పాల్గొన్నారు. ఇల్లంతకుంట మండలకేంద్రంలో నూతన వంటగది, విద్యార్థులకు యూనిఫాం, గ్రంథాలయం ప్రారంభం, నూతన డెస్కులు, ఉదయం విద్యార్థులకు జావ పంపిణీ కార్యక్రమాలలో ఎమ్మెల్యే రసమయి పాల్గొన్నారు. గంభీరావుపేట మండలంలోని లింగన్నపేట, రాజేశ్వర్రావునగర్ పాఠశాలల్లో అదనపు తరగతి గదులను నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు ప్రారంభించారు. బోయినపల్లి మండలంలోని నర్సింగాపూర్, విలాసాగర్, గుండన్నపల్లి, బోయినపల్లి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాసులను, డిజిటల్ స్క్రీన్లను, ప్రభుత్వం సరఫరా చేసిన పుస్తకాలను, యూనిఫామ్లను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పంపిణీ చేశారు.