తెలంగాణ మలి దశ పోరాటంలో నిండు ప్రాణాలను త్యాగం చేసిన అమరుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అక్కున చేర్చుకున్నది. ఉద్యమానికి ఊపిరులూదిన అమరుల ఆశయాలకు అద్దంపట్టేలా పాలన సాగిస్తున్నది. విభజిత కరీంనగర్ జిల్లాలో గుర్తించిన 164 మందిలో ఒక్కరిని కూడా విస్మరించకుండా 10 లక్షల ఆర్థిక సహాయం అందించింది. అర్హులైన 160 మందికి ప్రభుత్వోద్యోగాలిచ్చి బతుకుదెరువు చూపింది. ఇప్పుడు అమరుల కుటుంబాల్లో ఎవరి కండ్లల్లో చూసినా.. తమ వాళ్లు కన్న కలలను కేసీఆర్ ప్రభుత్వం సాకారం చేస్తున్నదనే సంతృప్తి కనిపిస్తున్నది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు అమరులను స్మరించుకోనుండగా, ‘నమస్తే’ అందిస్తున్న ప్రత్యేక కథనం..
కరీంనగర్, జూన్ 21 (నమస్తే తెలంగాణ) : నాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఎందరో ప్రాణ త్యాగం చేశారు. తమ కుటుంబాల కంటే రాష్ట్ర ఏర్పాటే తమకు ఎక్కువంటూ బలిదానం చేశారు. ఉద్యమ సమయంలో వీరి త్యాగాలను కండ్లారా చూసి చలించిపోయిన కేసీఆర్, అమరుల కుటుంబాలను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ప్రత్యేక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన, వారికి అండగా నిలిచే లక్ష్యంతో ముందుకెళ్లారు. కొడుకులు, బిడ్డలు, పెద్ద దిక్కులను కోల్పోయిన కుటుంబాలకు ఎంత చేసినా తక్కువే అయినా, వారికి కొండంత భరోసాగా నిలిచారు. ఆ మేరకు రాష్ట్ర సర్కారు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన 164 మందిని గుర్తించింది. 2015 జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ఒక్కో కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయం అందించింది. ఏడాది తిరక్కముందే 2016 జూన్ 2న ఒక్కో కుటుంబంలో అర్హులైన వారికి కొలువులు కట్టబెట్టింది. అర్హతలను బట్టి మొత్తం 160 మందికి ప్రభుత్వోద్యోగాలు ఇచ్చి ఆదుకున్నది. అలాగే వీరిలో చాలా మందికి ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్రూం ఇండ్లు కూడా కట్టించడంతో కుటుంబాలకు భరోసా దొరికింది. ఆర్థిక సాయంతోపాటు ప్రభుత్వోద్యోగం దక్కడంతో బతుకుదెరువు లభించినట్లయింది.
తెలంగాణ కోసం ఉద్యమబిడ్డలు కన్న కలలను ఆనాటి ఉద్యమ నేత ప్రస్తుత సీఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేళ్లలోనే రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపారు. రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతున్న నేపథ్యంలో అమరుల కుటుంబాలను కదిలించినప్పుడు అప్పటికీ ఇ ప్పటికీ ఉన్న తెలంగాణలో వచ్చిన మార్పుల గురించి గొప్పగా చెబుతున్నారు. తమ వాళ్లు కన్న కలలు సీఎం కేసీఆర్ సాకారం చేస్తున్నార ని అంటున్నారు. తమ కుటుంబ సభ్యులు ఇప్పుడుంటే ఎంతో సంతోషించే వారని చెబుతున్నారు. తెలంగా వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రవ్యాప్తంగా సాగునీరు అందుతున్నదని, నియామకాల ప్రక్రియతో ఎందరో నిరుద్యోగులకు కొలువులు లభిస్తున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబ సభ్యులు ఇవే కలలు కన్నారని, అవి ఇప్పుడు పూర్తిగా సాకారం అవుతున్నందుకు సంతోషంగా ఉందని అమరులు కుటుంబ సభ్యులు ఆనందంగా చెబుతున్నారు.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం గ్రామ పంచాయతీల్లో ఉదయం 11 గంటలకు సమావేశం అవుతారు. అమరులకు శ్రద్ధాంజలి ఘటించి, మౌనం పాటిస్తారు. అమరుల సంస్మరణ తీర్మానం చేస్తారు. మున్సిపాలిటీలు, మండల పరిషత్తులు, కార్పొరేషన్లు, జిల్లా పరిషత్తులు, విద్యాలయాలు, ప్రార్థనా సమావేశాల్లో శ్రద్ధాంజలి ఘటించి, మౌనం పాటిస్తారు. హైదరాబాద్లో అమరవీరుల స్మారకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు.
ముత్తారం మండల కేంద్రానికి చెందిన రామిండ్ల నీలమ్మ- చంద్రయ్యకు ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. ముగ్గురూ బాల్యం నుంచే కష్టపడి చదివారు. కాగా, ఇందులో పెద్ద కొడుకు రామిండ్ల కుమార్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకునేవాడు. ఉద్యమ నేత కేసీఆర్ చేసిన ఉద్యమానికి కుమార్ ఆకర్షితుడయ్యాడు. సకల జనుల సమ్మెలో భాగంగా 2011 అక్టోబర్ 2న ముత్తారం టూ అడవిశ్రీరాంపూర్ రోడ్డుపై భారీ ర్యాలీ తీయగా, కుమార్ పాల్గొని ఉదయం నుంచి సాయంత్రం దాకా నిరసన తెలిపాడు. ఉద్యమాన్ని నీరు గార్చేందుకు సీమాంధ్రులు చేస్తున్న కుట్రలు తెలుసుకున్న కుమార్ కలత చెందాడు. అదే రోజు రాత్రి 7గంటల ప్రాంతంలో ఇంట్లోని తన గదిలో గడియపెట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కుమార్ కుటుంబాన్ని సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకున్నది. 2016లో ఏప్రిల్లో రూ.10 లక్షల సాయాన్ని కుమార్ తల్లిదండ్రులకు అందించింది. 2016 ఆగస్టు 11న కుమార్ సోదరుడు ఆజయ్ కుమార్కు అటవీశాఖలో ఉద్యోగం కల్పించింది.
మా అన్న తెలంగాణ కోసం జెండా పట్టినప్పుడు నేను ఇంటర్ చదువుతున్న. అన్న ఎప్పుడూ తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు జరుగుతయని, తెలంగాణ బిడ్డలందరికీ మేలు జరుగుతుందని అంటుండేటోడు. అన్న ప్రాణ త్యాగం తర్వాత ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో నిజంగా అన్న చెప్పినవన్నీ నిజమవుతున్నయ్. ఎట్లున్న తెలంగాణ ఎట్లవుతున్నదో.. మనం అందరం చూస్తున్నం. మా కుటుంబాన్ని అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకున్నది. నేను ఇప్పుడు పెద్దపల్లి జిల్లా ఫారెస్టు కార్యాలయంలో పనిచేస్తున్న. నాలాంటి ఎంతో మందికి ఉద్యోగం కల్పించిన సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోలేం.
– రామిండ్ల అజయ్కుమార్, డీఎఫ్వో అసిస్టెంట్, అటవీ శాఖ కార్యాలయం, పెద్దపల్లి
..ఈ ఫొటోలో ఉన్నది తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న బలేరావు ప్రవీణ్కుమార్ తల్లి గంగు, సోదరి రాజమణి. వీరిది మెట్పల్లి మున్సిపల్ పరిధిలోని రేగుంట. గంగు, మల్లేశ్ దంపతులు కాగా, 30 ఏండ్ల కిందట విడిపోయారు. ఆమె బీడీలు చుడుతూ కూతురు, కొడుకును తన వద్దే ఉంచుకుని పోషించింది. మానసిక స్థితి సరిగా లేని కూతురు ఇంటి పట్టునే ఉండగా, కొడుకు ప్రవీణ్ను మెట్పల్లిలో చదివించింది. పదో తరగతి వరకు చదివిన కొడుకు తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితుడై తరచుగా సభలు, సమావేశాలకు వెళ్లేవాడు. తాను చనిపోతెనన్న తెలంగాణ రాష్ట్రం వస్తుందేమోనని, జై తెలంగాణ అంటూ 2010, నవంబర్ 26న సూసై డ్ నోట్ రాసి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మబలిదానం చేసుకున్నాడు. చేతికందిన ఉన్నగానొక్క కొడుకు దూరమవడంతో తల్లి గంగు పుట్టెడు దుఃఖంతో నిద్రలేమి రాత్రులు గడుపుతూ కాలం వెల్లదీసింది. ‘నమస్తే తెలంగాణ’ యాజమాన్యం రూ.60 వేల ఆర్థిక సాయం చేసి ఆదుకున్నది. ప్రత్యేక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం.. ప్రవీణ్ కుటుంబానికి రూ.10 లక్షల సాయం చేయడంతోపాటు, తల్లికి ఉద్యోగ అవకాశం ఇచ్చింది. ఆమె నిరక్షరాస్యురాలవడంతో సాంఘిక సంక్షేమ వసతి గృహంలో వాచ్ఉమన్ ఉద్యోగం కల్పించారు. ప్రస్తుతం మెట్పల్లి పట్టణంలోని ఎస్సీ బాలిక వసతి గృహంలో విధులు నిర్వర్తిస్తున్నది. నెలవారీగా వచ్చే వేతనంతో మానసిక వికలాంగురాలైన కూతురును పోషించుకుంటూ జీవనం గడుపుతున్నది.
నా కొడుకు తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్నడు. ఇప్పటికి 13 ఏండ్లు అయితున్నది. తెలంగాణ వచ్చినంక రూ.10 లక్షలు ఇచ్చిన్రు. నాకు హాస్టళ్ల వాచ్ఉమన్ ఉద్యోగం వచ్చింది. రూ.పది లక్షలతో రెండు రూంల ఇల్లు కట్టుకున్న. ముప్పైళ్ల కిందట భర్తతో విడిపోయినంక మా తల్లిగారి ఊరు రేగుంటలో ఉంటున్న. ఎవుసం లేదు, బీడీలు చుట్టుకుంట వచ్చే పైసలతో పిల్లలు, నేను పొట్టగడుపుకున్నాం. కూతురు ఆరోగ్యం మంచిగుండదు, పుట్టుకతోనే దివ్యాంగురాలు. కొడుకును పదో తరగతి దాకా చదివించిన. పుట్టెడు దుఃఖం మిగిల్చిపోయిండు. నాకు ఆరోగ్యం ఇది వరకు ఉన్నట్లు ఉంట లేదు. వాచ్ఉమెన్ ఉద్యోగంతో వచ్చిన జీతమే మా తల్లీబిడ్డల బతుకుకు ఆధారం.
– బలేరావు గంగు, తెలంగాణ అమరవీరుడు ప్రవీణ్కుమార్ తల్లి, రేగుంట
‘మా ఇంటి పెద్ద దిక్కు తెలంగాణ సాధన కోసం ప్రాణాలొదిండు..నాడు ఆంధ్రోళ్ల కుట్రలకు ఆగమై ఇక రాష్ట్రం రా దని ఇంట్లోని దూలానికి ఉరేసుకొని ఊపిరి తీసుకున్నడు.. కానీ తెలంగాణ వచ్చినంక సీఎం సారు మాకు బతుకు దారి చూపిండు..మా కుటుంబానికి రూ. 10 లక్షలు ఇచ్చిండ్రు. మా బిడ్డకు ఉద్యోగమిచ్చి చీకటి బతుకుల్లో వెలుగులు నింపిన్రు..’ అంటూ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం నాగులమల్యాలకు చెందిన తెలంగాణ అమరుడు ప్రభాకర్ కుటుంబీకులు భావోద్వేగానికి గురయ్యారు. ఉబికి వస్తున్న కన్నీళ్లను దిగమింగుకుంటూ ఊపిరి ఉన్నంత వరకు సీఎం కేసీఆర్ సారును మరువబోమని చెప్పారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పలుకరించిన ‘నమస్తే తెలంగాణ’తో వారు తమ మనోగతాన్ని పంచుకున్నారు.
మానాన్న కన్న కలలు నెరవేరుతున్నయ్. నాన్న దగ్గరలోని గ్రానైట్ పరిశ్రమలో డ్రిల్లర్గా పనిచేసేవాడు. అమ్మ కూలీనాలీ చేసుకునేది. రెక్కల కష్టం మీద నన్ను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివించిన్రు. ఎంత కష్టం చేసినా ఫలితంలేదని, రాష్ట్రమొస్తెనే మన బతుకులు మారతాయని కేసీఆర్ సార్ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ ఉద్యమంల పాల్గొన్నడు. అప్పటి కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో మనస్తాపానికి గురై 2010 అక్టోబర్ 20న ఇంట్లోనే ఉరేసుకున్నడు. నాన్న అంతిమ యాత్రలో వందలాది మంది పాల్గొన్నరు. తెలంగాణ వచ్చినకం మా కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అక్కున చేర్చుకున్నది. 2015లో జూన్ 2న రూ.10 లక్షల ఆర్థిక సహాయం చేసింది. నాకు 2016 జూన్లో జిల్లా ట్రెజరీ ఆఫీసుల సబార్డినేట్గా ఉద్యోగం ఇచ్చిన్రు. ఇప్పుడు జగిత్యాల ట్రెజరీ కార్యాలయంల పనిచేస్తున్న. 2019లో మా మేనమామ యాదగిరిని పెండ్లి చేసుకున్న. కేసీఆర్ సార్ మా నాన్నలాంటి ఎందరో ఆశయాలను నెరవేరుస్తున్నరు. అమరుల కుటుంబాలకు ఆదనుకున్నరు. పాలనాదక్షతతో రాష్ట్ర స్వరూపాన్ని మార్చేశారు. ఒకప్పుడు నీళ్ల కోసం ప్రతి పల్లె తండ్లాడేది. ఇపుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత ప్రతి ఊరికి నీళ్లస్తున్నయ్. మా నాగులమల్యాలల ఒకప్పుడు నీళ్లు ఉండేటివి కాదు. ఇప్పుడు చెర్లు నింపుతున్నరు. ఊళ్లెకు పోవల్నంటే రోడ్లు అధ్వాన్నంగా ఉండేటియి. ఇప్పుడు ఎంత మంచి రోడ్లేసిండ్రు. గ్రామాలు పరిశుభ్రంగా కనిపిస్తున్నయ్.
– అమరుడు ప్రభాకర్ కూతురు సంధ్య
నా భర్త చనిపోయినంక మా పని అయిపోయిందనుకున్న. దిక్కు మొక్కు ఎవలూ లేరు. ఐదేండ్లు అష్టకష్టాలు పడ్డ. ఉపాధి పనికిపోయి నా బిడ్డను చదివించుకున్న. నా భర్త చనిపోయిన ఇంట్లకు పోవాల్నంటే భయమై ఇడ్సిపెట్టినం. కిరాయి ఇంట్ల బతికినం. మాకు మంచి రోజులు వస్తయనుకోలే. తెలంగాణ వచ్చినంక కేసీఆర్ సార్ పది లక్షలు ఇచ్చిండు. నా బిడ్డ సంధ్యకు నౌకరి ఇచ్చిండు. సార్ ఇచ్చిన డబ్బుతో ఊళ్లె ఇల్లు కట్టుకున్నం. బిడ్డ పెండ్లి చేసిన. ఆమెకు ఇద్దరు పిల్లలు. అందరం కలిసి ఒక్కకాన్నే ఉంటున్నం. ఒకప్పుడు మా అసోంటి కుటుంబాలకు అప్పుడు తిందామంటే తిండి లేకుండే. చేద్దామంటే పని లేకుండే. పనుల కోసం ఊళ్లపొంటి, దేశాల పొంటి పోతుండిరి. ఇపుడు ఇక్కన్నే కావల్సినంత పని దొరుకుతున్నది. ఇంత మంచిగ ఎన్కట ఎవలన్న చేసిన్రా..
– అమరుడు ప్రభాకర్ భార్య ప్రమీల