జగిత్యాల టౌన్, జనవరి 10 : రైతులు సమగ్ర వ్యసాయం చేయాలని, నాణ్యమైన నువ్వుల పంటలను పండించాలని జగిత్యాల కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా రైతులకు సూచించారు. విదేశాలకు ఎగుమతి చేసేలా నాణ్యమైన ఉత్పత్తులను సాధించాలని చెప్పారు. ఎథికల్ అగ్రికల్చర్ను నేర్చుకోవాలని, పురుగు మందులను తగ్గించి రానున్న తరం కోసం భూమిని కాపాడుకోవాలని నిర్దేశం చేశారు. బుధవారం పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, భారత వ్యవసాయ పరిశోధనా మండలి, యూనియన్ బ్యాంక్, భారత నూనెగింజల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కిసాన్ మేళా (నువ్వలు)-2024 నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల సుమారు 2వేల మంది రైతులు తరలిరాగా, నువ్వుల పంట సాగుపై శాస్త్రవేత్తలు చర్చాగోష్ఠి చేశారు.
ఈ మేళాకు కలెక్టర్ హాజరై, మాట్లాడారు. రైతులు వ్యాపారులుగా మారినప్పుడే ఆదాయాన్ని పెంచుకోగలుగుతారని, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని సూచించారు. పాత రోజుల్లో ప్రతి కుటుంబానికి సరిపడా నూనె గింజలు, పప్పు దినుసులు, అనేక ఆహార ధ్యానపు పంటలను పండించుకొనే వారని గుర్తు చేశారు. మళ్లీ పాత కాలం రోజులు రావాలని, రైతులు సమగ్ర వ్యవసాయంపై దృష్టి సారించాలని సూచించారు. రూ.కోట్లు పెట్టి నూనెలను విదేశాల నుంచి దిగుమతి చేసుకునే స్థితిలో ఉన్నామన్నారు. ఎప్పుడు ఒకే పంట వేయకుండా నువ్వుల లాంటి పంటలను వేసుకోవాలని సూచించారు. అయితే నువ్వులను ఎగుమతి చేయడానికి కొన్ని దేశాల్లో కొన్ని రకాల స్టాండట్స్ ఉన్నాయని, అందుకనుగుణంగా ఉత్పత్తి చేసినప్పుడే కొనుగోలు చేస్తారని చెప్పారు.
ప్రతి రైతు ఇంటికి పెరటి కూరగాయలను సాగు చేయాలన్నారు. తాను వనపర్తిలో ఉన్నప్పుడు ‘మా ఇంటి పంట’ అని ఆర్గనైజ్ చేశామని, రైతులకు ఫ్రీగా కూరగాయల విత్తనాలు అందించామన్నారు. ఆయిల్పామ్పై రైతులు అనుమానాలు పెట్టుకోవద్దని, లోహియా అనే కంపెనీ మనకు మొక్కలను అందిస్తుందని, దిగుబడిని కూడా అదే కంపనీ కొనుగోలు చేస్తుందన్నారు. ఈ సందర్భంగా కన్వీనర్ కిషోర్ థాన, ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఆనంద్కుమార్ విశ్వకర్మ, నూనెగింజలు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ వాణిశ్రీ, ఫుడ్సైన్స్ కళాశాల డీన్ డాక్టర్ కల్పన, డిప్యూటీ సీఈవో రమేశ్కొల్లా, లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకట్రెడ్డి ఈ సందర్భంగా నూనె పంటల సాగు, యంత్రాలపై సబ్సిడీ రుణాలు వంటి అంశాలను వివరించారు.