అనారోగ్య సమస్యలు ఎదురొకుండా అనీమియా ముక్త్ కరీంనగర్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో అనీమియా ముక్త్, ఏ-షీల్డ్ యాప్ అమలు తీరుపై డాక్టర్ సుబోధ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా వైద్యులు, ఏఎస్సీఐ బృందం బుధవారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ అనీమియా ముక్త్ కరీంనగర్ కార్యక్రమం అమలు తీరును వైద్య బృందానికి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అనీమియా ముక్త్ కరీంనగర్ లక్ష్యం సాధించాలనే సంకల్పంతో ఏ-షీల్డ్ యాప్ను రూపొందించినట్లు తెలిపారు. రక్తంలో హిమోగ్లోబిన్ తకువగా ఉండడంతో సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలు, కిశోర బాలికలకు, గర్భిణులకు అందిస్తున్న వైద్య సేవలపై బృందానికి వివరించారు. అనీమియాపై అవగాహన కల్పించేందుకు ఏ-షీల్డ్ యాప్ను రూపొందించినట్లు తెలిపారు. ప్రతి శుక్రవారం ఆరోగ్య కేంద్రాల్లో గర్భిణులకు పౌష్టికాహారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
జిల్లాలో 90 నుంచి 95 శాతం వరకు ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు చేస్తున్నారని, అలాగే, గర్భిణులకు కూడా సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 70 నుంచి 75 శాతం మొదటి కాన్పులో సాధారణ ప్రసవాలను విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. అనంతరం ఏ-షీల్డ్ యాప్పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సమావేశంలో ఏఎస్సీఐ ప్రొఫెసర్ డైరెక్టర్ సుబోద్ కందముతన్ బృందం, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, జిల్లా వైద్యాధికారి జువేరియా, డాక్టర్ సాజిద, శిల్పారెడ్డి, ఎస్బీయం కిషన్స్వామి, ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.