కొత్తపల్లి, జూన్ 4: సైక్లింగ్తో ఆరోగ్యంగా జీవించవచ్చని, పర్యావరణాన్ని సైతం కాపాడుకోవచ్చని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ఆదివారం కరీంనగర్ సైకిల్ క్లబ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సైకిల్ తొకడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని, శరీరానికి మంచి వ్యాయామం చేసినట్లు అవుతుందన్నారు. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు సైక్లింగ్ ఒక మంచి మార్గమన్నారు. ప్రతి ఒకరూ రోజు కనీసం గంట పాటు సైకిల్ తొక్కాలని సూచించారు. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరుగడంతోపాటు గుండె జబ్బులు, పక్షవాతం, అధిక రక్తపోటును నివారించవచ్చన్నారు. ఈ సందర్భంగా దారిద్య్ర రేఖకు దిగువనున్న పేద విద్యార్థులకు కలెక్టర్ సైకిళ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కరీంనగర్ సైకిల్ క్లబ్ సభ్యులు ఘన్ శ్యాం ఓజా, మేకల జయరాం తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్, జూన్ 4: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 8న నిర్వహించనున్న చెరువుల పండుగ విజయవంతం చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పిలుపునిచ్చారు. ఆదివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయితీరాజ్, డీఆర్డీఏ అధికారులతో చెరువుల పండుగ నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, చెరువు కట్టలను అందంగా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో పాల్గొనేవారందరికీ తాగునీరు, భోజన వసతి ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమం విజయవంతం చేయడంలో సర్పంచులు, గ్రామ కార్యదర్శుల భాగస్వామ్యం ఎక్కువగా ఉండేలా చూడాలన్నారు. కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు, అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, శ్యాంప్రసాద్లాల్, ఆర్డీవోలు హరిసింగ్, ఆనంద్కుమార్, కమిషనర్ సేవా ఇస్లావత్, చీఫ్ ఇంజినీర్ అమరేందర్, ఎస్ఈ శివప్రసాద్, డీఆర్డీవో శ్రీలత, డీపీవో వీరబుచ్చయ్య, ఎంపీడీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.