కలెక్టరేట్, ఫిబ్రవరి 8: జిల్లాలో కొనసాగుతున్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. జిల్లాలోని తహసీల్దార్లు, రహదారులు, భవనాల శాఖ, టీఎస్ఈడబ్ల్యూడీసీ అధికారులతో బుధవారం ఆయన డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రగతిపై సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వివిధ దశల్లో ఉన్న 1139 ఇండ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించుకొని, ఆ దిశగా పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. నిర్మాణ పనులు పూర్తి చేయడంతో పాటు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఓటరు కార్డు ఆధార్తో అనుసంధానం తప్పనిసరి
ఓటరు గుర్తింపు కార్డు ఆధార్తో తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధాన ప్రక్రియ చివరి దశలో ఉండగా, సంబంధిత అధికారులతో బుధవారం ఆయన సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆధార్ అనుసంధానంలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం వెనుకంజలో ఉన్నందున ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలిపారు. ఆధార్ అనుసంధానం కోసం ఫాం 6బీ ఇవ్వని వారి ఇండ్లకు వెళ్లి స్వయంగా పూర్తి చేయించాలని సూచించారు. మండల, బూత్ స్థాయి అధికారులు, సూపర్వైజర్లతో కలిసి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఓటర్ల ఇండ్లకు వెళ్లేందుకు ఆయా ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలన్నారు. నిర్ణీత గడువులోగా పూర్తి చేసి, అనుసంధాన కార్యక్రమ పురోగతికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.