కరీంనగర్, జూలై 21 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) : ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయిలో తమ అధికారయంత్రాగం సిద్ధంగా ఉందని, ఎటువంటి నష్టం కలుగకుండా అని రకాల చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే సంబంధిత అధికారులకు తగు సూచనలు జారీ చేశామని, కార్పొరేషన్తోపాటు మున్సిపాలిటీల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. వర్షాలతో వ్యాధులు ప్రబలే ముప్పు ఉన్నదని, ఈ విషయంలో ప్రజలు ఏమాత్రం నిర్లక్ష్యం చేయద్దని విజ్ఞప్తి చేశారు. పీహెచ్సీల్లో వైద్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారని, సీజనల్ వ్యాధులకు కావాల్సిన మందులున్నాయని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. శుక్రవారం ఆయన ‘నమస్తేతెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్య్యూ ఇచ్చారు.
నమస్తే తెలంగాణ : వర్షాలపై అప్రమత్తత ఎలా ఉన్నది?
రెండు మూడురోజులుగా వర్షం కురుస్తున్నది. కొన్ని చోట్ల ఎక్కువ, మరికొన్ని చోట్ల తక్కువగా పడుతున్నది. ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం. ఇప్పటివరకు ఎటువంటి నష్టం వాటిల్లలేదు. అయినా ముందుగా నాతోపాటు యంత్రాంగం అప్రమత్తమైంది. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందు కు సిద్ధంగా ఉన్నాం. నిజానికి మానేరు పారితే మనకు ఎక్కువగా ఎఫెక్ట్ ఉండేది. కానీ, ప్రస్తు తం ఆ పరిస్థితులు లేవు. అయి నా సరే తిమ్మాపూర్ నుంచి జమ్మికుంట వరకు మానేరు పరీవాహక ప్రాంతంలో ఉన్న ప్రజలను అప్రమత్తం చేశాం. ఎటునుంచి వరద వచ్చి నా మానేరు పొంగే ప్రమాదం ఉన్నది. అందుకే ప్రజలు అటువైపు వెళ్లద్దని చెబుతున్నాం. అన్ని మండలాల్లో, తహసీల్దార్లు, ఎంపీడీవోలను అలర్ట్ చేశాం. ఆయా మండలాల్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పాం. ఆ పనిలో అధికారయంత్రాంగం నిమగ్నమై ఉన్నది.
నమస్తే తెలంగాణ : చెరువులు, కుంటల పరిస్థితి ఎలా ఉన్నది?
ఈ విషయంలో నీటిపారుదల శాఖాధికారులు అప్రమత్తంగా ఉన్నారు. వర్షపాతాన్ని గమనించడంతోపాటు ఆయా చెరువులు, కుంటలకు వచ్చే ఇన్ఫ్లో వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. కొన్నిచోట్ల చెరువులు నిండాయి. ఆయాచోట్ల కట్టల పరిస్థితిపై ఆరాతీస్తున్నారు. ఎక్కడైనా అనుకోని సమస్య తలెత్తినా పరిష్కరించుకునేందుకు తక్షణం నిర్ణయం తీసుకునే వెసులుబాటును కూడా అధికారులకు ఇచ్చాం. నాది ఒక్కటే విజ్ఞప్తి. చెరువులు, కుంటలు నిండుతున్నాయి. ఆ వైపు పెద్దలే కాదు, చిన్న పిల్లలు వెళ్లకుండా చూడాలి.
నమస్తే తెలంగాణ : కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో పరిస్థితి ఏమిటీ?
కమిషనర్లు అప్రమత్తంగా ఉన్నారు. ప్రతి మున్సిపాలిటీలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. వీటికి ప్రత్యేకాధికారులను సైతం నియమించాం. ఈ బృందా లు 24గంటల పాటు అందుబాటులో ఉంటాయి. ఏరాత్రైనా సరే సమస్య దృ ష్టికి వస్తే వెంటనే స్పందిస్తాయి. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాగే పురాతన భవనాలను గుర్తించాలని మున్సిపల్ అధికారులను ఆదేశిం చాం. సంబంధిత ఓనర్లకు సమాచారం ఇచ్చి, వారి స్పందనకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని చెప్పాం.
నమస్తే తెలంగాణ : సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదమున్నది. ఎలా కట్టడి చేస్తారు?
వర్షాల వల్ల కొత్తకొత్త వ్యాధులు వచ్చే ముప్పు ఉంటుంది. ఈ విషయంలో ముందస్తు జాగ్రత్త చాలా అవసరం. ముఖ్యంగా తాగునీటి వల్ల ఎక్కువ వ్యాధులు ప్రబలే ప్రమాదముంటుంది. వానకాలం నీటిని వేడి చేసుకొని తాగడం మంచిది. దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. సీజనల్ వ్యాధులపై వైద్యశాఖ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. ఇప్పటికే అన్ని దవాఖానలు, పీహెచ్సీలకు తగిన సూచనలు ఇచ్చాం. వైద్యులు షిప్టుల వారీగా 24 గంటలపాటు అందుబాటులో ఉంటారు. ఎక్కడా వైద్యసిబ్బంది కొరత లేదు. అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాం. ఏదైనా వ్యాధి సోకితే వైద్యులను సంప్రదించాలి. తమకు తోచిన మందులు వాడద్దు. ఇది అనర్థదాయకం. అంతేకాదు, చిన్న చిన్న సీజనల్ వ్యాధులకు పెద్దగా హైరానా పడద్దు. అందుబాటులో ఉన్న ఆరోగ్యకేంద్రాలకు వెళ్లి చికి త్స తీసుకుంటే సరిపోతుంది. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండడంతోపాటు వైద్యుల సూచనలు తప్పనిసరిగా పాటించాలి.