కార్పొరేషన్, జనవరి 10: రైతులు వ్యవసాయంతో పాటు పాడిపరిశ్రమపై దృష్టిసారించి ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. సంక్రాంతిని పురస్కరించుకొని నగరంలోని కరీంనగర్ డెయిరీలో బుధవారం రైతు కుటుంబాల మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఉదయం ఈ కార్యక్రమాన్ని నాబార్డు అధికారులు ప్రారంభించగా, విజేతలకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో లక్ష మందికి పైగా పాడి రైతులకు జీవనోపాధి కల్పించడం అభినందనీయమని కొనియాడారు.
పాడి పశువుల ద్వారా ఆదాయం, రైతు కుటుంబాల సంక్షేమం కోసం పథకాలు తీసుకురావడం హర్షణీయన్నారు. కరీంనగర్ డెయిరీ చైర్మన్ సీహెచ్ రాజేశ్వర్రావు మాట్లాడుతూ, 25 ఏళ్లుగా డెయిరీలో ప్రతి సంక్రాంతికి రైతుల కుటుంబసభ్యులకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామంలో రూ. 80 కోట్లతో పూర్తి ఆటోమెటెడ్ మెగా డెయిరీని నిర్మించినట్లు పేర్కొన్నారు. డెయిరీ ద్వారా రోజుకు రెండు లక్షల లీటర్ల పాల సేకరణ చేస్తున్నామన్నారు. అమ్మకాలను కూడా పెంచేందుకు అన్ని విధాలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. డెయిరీ మనది అన్న భావన కలిగేలా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డెయిరీ ఎండీ శంకర్రెడ్డి, సలహాదారు హనుమంతరెడ్డి, డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.