హుజూరాబాద్ రూరల్, మే 24: ప్రైవేట్ హాస్పిటల్స్కు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో వైద్యాధికారులు, సిబ్బంది సేవలందించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. శుక్రవారం హుజూరాబాద్ ప్రభుత్వ ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రతి వార్డుతో పాటు డయాలసిస్ కేంద్రం, ఆపరేషన్ థియేటర్, మందులు నిల్వ ఉంచే గది, మెటర్నిటీ వార్డు, లేబర్ రూమ్తో పాటు పలు వార్డుల్లో కలియతిరుగుతూ పరిశీలించారు. దాదాపు రెండు గంటల పాటు వైద్య సేవలను పర్యవేక్షించారు. దవాఖానకు వచ్చిన రోగులతో పాటు బాలింతలు, గర్భిణులతో మాట్లాడారు.
డాక్టర్లు, సిబ్బంది అందిస్తున్న సేవలపై వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలకు సంబంధించి వైద్యాధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రాంతీయ ఆరోగ్య కేంద్రంలో రోగులకు మెరుగైన సేవలందించాలని సూచించారు. ప్రైవేట్ హాస్పిటళ్ల కంటే ప్రభుత్వ దవాఖానల్లో ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నదని పేరొన్నారు. అత్యుత్తమ సేవలతోనే ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని చెప్పారు.
సాధారణ ప్రసవాలు పెరిగేలా కృషి చేయాలని సూచించారు. రోగులకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవలందించాలని పేరొన్నారు. మందులకు కొరత లేకుండా చూసుకోవాలని, ఎమర్జెన్సీ మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఇంకా అదనంగా వైద్య సిబ్బందిని నియమించేందుకు కృషి చేస్తామన్నారు. నిరంతరం విద్యుత్ ఉండేలా చూసుకోవాలని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పర్యవేక్షించాలని సూచించారు.
చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని పేరొన్నారు. దవాఖానకు సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి నేరుగా తీసుకురావాలని వైద్యాధికారులకు సూచించారు. వాటి పరిషారానికి వెంటనే చర్యలు తీసుకుంటామని పేరొన్నారు. అనంతరం హుజూరాబాద్ మండలం రాజపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించారు. వాటికి సంబంధించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి పలు సూచనలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో హుజూరాబాద్ తహసీల్దార్ విజయకుమార్, ఎంపీడీవో సునీత, డిప్యూటీ డీఎంహెచ్వో బీ చందు, ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ రాజేందర్ రెడ్డి, వైద్యులు శ్రీకాంత్ రెడ్డి, వాణీలత, సోమశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
మానకొండూర్, మే 24: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే యూనిఫామ్స్ సంవత్సరం పాటు ధరించేలా మన్నికగా ఉండాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మానకొండూర్ మండల కేంద్రంలో రుద్రమ మండల సమాఖ్య ఆధ్వర్యంలో నడుస్తున్న మహిళా శక్తి కుట్టుశిక్షణ కేంద్రాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా స్వశక్తి మహిళలు కుడుతున్న యూనిఫామ్స్ను పరిశీలించి వారితో మాట్లాడారు. సంవత్సర కాలం విద్యార్థులు ధరించేలా డబుల్ స్టిచ్చింగ్తో యూనిఫామ్స్ మన్నికగా ఉండాలని సూచించారు. క్లాత్ తీసుకువచ్చేందుకు అయ్యే రవాణా ఖర్చులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అనంతరం పీహెచ్సీని తనిఖీ చేశారు. పీహెచ్సీకి వచ్చే రోగులకు సరైన వైద్యసేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీవో శ్రీధర్, ఏపీఎంలు నిరంజన్, సంతోష్, పీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు.