విద్యానగర్, జనవరి 20: జిల్లాలో గర్భిణుల వివరాల నమోదు వందశాతం చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం ఆమె వైద్యశాఖ అధికారులతో గర్భిణుల వివరాల నమోదు, ఆరోగ్య మహిళా కార్యక్రమం ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గర్భిణుల వివరాలు గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లో నమోదు చేయాలని, ప్రతి గర్భిణి ప్రభుత్వ దవాఖానలో సాధారణ ప్రసవం జరిగేలా ప్రోత్సహించాలన్నారు.
ఐరన్ ఫొలిక్ మాత్రలు వేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. ఆరోగ్య మహిళ కార్యక్రమంలో భాగంగా ప్రతి మంగళవారం క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష చేయాలని ఆదేశించారు. అదనపు పరీక్షలకు జిల్లా ప్రధాన దవాఖానకు పంపించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా వైద్యాధికారి లలితాదేవి, డిప్యూటీ వైద్యాధికారి జువేరియా, డీటీసీవో రవీందర్ రెడ్డి, డీఐవో సుజాత, డాక్టర్లు, ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు.
కలెక్టరేట్, జనవరి 20: నగరంలోని అల్ఫోర్స్, శ్రీచైతన్య విద్యా సంస్థలతో పాటు పలు చోట్ల ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. ఓటరు నమోదులో బూత్ స్థాయి అధికారులు పాటిస్తున్న నిబంధనలను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట ఆర్డీవో మహేశ్వర్, ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ స్వరూపారాణి, అర్బన్ తహసీల్దార్ రమేశ్, బీఎల్వోలు, తదితరులున్నారు.
ఈనెల 25న జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో అధికారులను ఆదేశించారు. ‘నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్’ నినాదంతో ప్రతి ఒక్కరితో ఓటరు ప్రతిజ్ఞ చేయించాలని సూచించారు. పోస్టర్లు, బ్యానర్ల రూపంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. యువత, సీనియర్ సిటిజన్లకు ఓటరు దినోత్సవ ఆవశ్యకతను తెలియజేయాలని, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, థర్డ్జెండర్లు, అట్టడుగు వర్గాల వారిని ప్రోత్సహించాలని స్పష్టం చేశారు.