తిమ్మాపూర్,మార్చి13 : చిన్నప్పటి నుంచే ట్రాఫిక్ నియమాలు(Traffic rules), డ్రైవింగ్ పై అవగాహన అవసరమని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మండల కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయం ఆవరణలో గల పిల్లల ట్రాఫిక్ అవగాహన పార్కును ఆమె గురువారం సందర్శించారు. పార్కులో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ పట్ల పిల్లలకు అవగాహన కలిగించే అన్ని రకాల బోర్డులు, గుర్తులు, సిగ్నల్స్ వంటివి ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నమూనా ఫిల్లింగ్ స్టేషన్ ఏర్పాటు చేసి అక్కడ అప్రమత్తత కోసం తీసుకోవాల్సిన చర్యలు వివరించే బోర్డు ఏర్పాటు చేయాలన్నారు.
అన్ని పాఠశాలల విద్యార్థులు ఈ ట్రాఫిక్ పార్కు సందర్శించేలా చర్యలు తీసుకోవాలన్నారు. చిన్నప్పటి నుండే ట్రాఫిక్ అవగాహన వల్ల ప్రమాదాలకు ఆస్కారం ఉండదని అన్నారు. ట్రాఫిక్ పార్క్ లో ఏర్పాటు చేసిన ప్రతి గుర్తు గురించి పిల్లలకు వివరించాలని ఆదేశించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు. అలాగే ఆర్టీఏ కార్యాలయంలో ఉన్న క్యాంటీన్ స్వశక్తి కేంద్రాల ద్వారా నిర్వహించేందుకు పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, రవాణా శాఖ ఉపకమిషనర్ పురుషోత్తం, డీటీవో శ్రీకాంత్ చక్రవర్తి, ఎంవీఐ రవికుమార్, తహసిల్దార్ విజయ్, ఎంపీడీవో విజయ్ కుమార్ పాల్గొన్నారు.