కరీంనగర్ రూరల్, అక్టోబర్ 12: చెక్పోస్టుల్లో పటిష్టంగా తనిఖీలు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. గోపి సూచించారు. గురువారం మొగ్దుంపూర్ చెక్ పోస్టును సీపీ సుబ్బారాయుడుతో కలిసి పరిశీలించి మాట్లాడారు. ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయడంలో భాగంగా జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్ పోస్లుల్లో అప్రమత్తంగా వ్యవహరిస్తూ, వాహనాల తనిఖీ నిర్వహించాలని సూచించారు. అనుమతులు లేకుండా నగదు, వస్తువులు ప్రవేశించకుండా చూడాలన్నారు. తనిఖీ చేసిన వాహనాల వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. అనంతరం చెక్ పోస్టులో నిర్వహిస్తున్న రిజిస్టర్లను పరిశీలించి, వాహనాలను తనిఖీ చేశారు.
కలెక్టరేట్, అక్టోబర్ 12 : ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు రాజకీయ పార్టీలు ప్రసార మాధ్యమాల్లో చేసే ప్రకటనలు నిశితంగా పరిశీలించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ బి.గోపి సూచించారు. సాధారణ ఎన్నికల్లో పాల్గొనే రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ప్రచార సరళిని పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన జిల్లా మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ కేంద్రం, మీడియా సెంటర్ను గురువారం అదనపు కలెక్టర్తో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు.
జిల్లాలోని 4 అసెంబ్లీ సెగ్మెంట్లలో జరుగబోయే ఎన్నికల ప్రచారాన్ని పరిశీలించేందుకు వివిధ విభాగాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా కమిటీ సభ్యులు నిరంతరం వివిధ వార్తా పత్రికలు, టెలివిజన్, ఇతర ప్రసార మాధ్యమాల్లో వచ్చే చెల్లింపు వార్తలు, రాజకీయ ప్రకటనలు తనిఖీ చేయడంతో పాటు ప్రసారాలు, ప్రకటనలకు సంబంధించిన నివేదికలు రూపొందించి ఎన్నికల అధికారులకు పంపాలని ఆదేశించారు. ప్రసార మాధ్యమాల్లో ప్రకటనలకు సంబంధించి ఎంసీఎంసీ అనుమతి పొందాలన్నారు.
ఎన్నికల వ్యయం, ప్రచార అనుమతులు, ఇతరత్రా అవసరాల కోసం కలెక్టరేట్లోని మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గోపి గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల పర్యవేక్షణ బృందాలు అప్రమత్తంగా ఉండి, నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సి-విజిల్ పోర్టల్, రిజిస్టర్లు పరిశీలించారు.
ఆయా కార్యక్రమాల్లో సీపీ సుబ్బారాయుడు, అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, డీఆర్వో పవన్కుమార్, సీపీవో కొమురయ్య, కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్, సమాచారశాఖ ఇంజినీర్ సీహెచ్ కొండయ్య, ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీనివాస్రెడ్డి, డీవైవో వెంకటరాంబాబు, సివిల్ సైప్లె డీఎం రజినీకాంత్, జిల్లా సమాచార శాఖ సహాయ సంచాలకుడు కలీం, జిల్లా వ్యవసాయాధికారి వాసిరెడ్డి శ్రీధర్, డీఐవో శివరాములు, ఆర్డీవో మహేశ్వర్, ఏసీపీ విజయ్కుమార్, రూరల్ సీఐ ప్రదీప్కుమార్, ఎస్ఐ, పోలీసులు పాల్గొన్నారు.