విద్యానగర్, డిసెంబర్ 27: జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలో ఆక్సిజన్ నిల్వలు సమృద్ధిగా ఉండాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. మంగళవారం ప్రభుత్వ ప్రధాన దవాఖానను శిక్షణ కలెక్టర్ లెనిన్ వాత్సల్ టొప్పోతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీడియాట్రిక్, ఓపీ, జనరల్ వార్డ్, ఆక్సిజన్ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన దవాఖాన సిబ్బందితో మాట్లాడారు. దవాఖానలోని ప్రతి విభాగంలోని రోగులకు ఆక్సిజన్ సమృద్ధిగా అందాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని సూచించారు.
శాశ్వత, తాతాలిక సిబ్బందికి ఐడీ కార్డులు ఇవ్వాలని ఆదేశించారు. రోగుల సహాయార్థం వచ్చే వారికి పాసులను ఇవ్వడంతో పాటు విజిటింగ్ టైం కేటాయించాలని తెలిపారు. దవాఖానలో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ వెంటిలేటర్లు సక్రమంగా పనిచేసేలా చూడాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట దవాఖాన సూపరింటెండెంట్ రత్నమాల, ఆర్ఎంవో, వైద్యాధికారులు ఉన్నారు.