కలెక్టరేట్, జనవరి 18: వేములవాడలో ఫిబ్రవరి 17 నుంచి 19వరకు నిర్వహించనున్న మహా శివరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన సమీకృత కలెక్టరేట్లోని మినీ మీటింగ్ హాల్లో రాజన్న ఆల య, వేములవాడ మున్సిపల్, ఇంజినీరింగ్ అధికారులతో జాతర ఏర్పాట్లు, పట్టణంలో అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ, ఆలయ పరిసరాలు, పట్టణాన్ని జోన్లుగా విభజించుకొని, ఒక్కో జోన్కు సూపర్వైజర్ను నియమించాలన్నారు.
ప్రతి శాఖ క్షేత్ర స్థాయిలో సమగ్ర కార్యాచరణను సిద్ధం చేసుకుని వచ్చే సమావేశంలో వివరించాలని తెలిపారు. పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యమివ్వాలన్నారు. సరిపడా టాయిలెట్లు, ఏర్పాటు చేసి సిబ్బందిని నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఆర్టీసీ అధికారులు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని బస్సులు నడపాలని సూచించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో అదనపు ట్రిప్పులు వేయాలన్నారు. శివరాత్రి జాతర సమ స్త సమాచారం లభించేలా భక్తుల సౌకర్యార్థం ప్ర త్యేక యాప్ సాధ్యమైనంత త్వరగా రూపొందించాలని అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్కు సూచించారు.
ప్రగతి పనులు పూర్తి చేయాలి
వేములవాడ పట్టణంలో ప్రగతిలో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మూలవాగు బండ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని సూచించారు. అనంతరం పట్టణంలో మన ఊరు-మన బడి పనుల పురోగతిపై సమీక్షించారు. పట్టణంలో రూ.3.15కోట్లతో 15 పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టగా, ఇప్పటి వరకు 50 శాతానికి పైగా పూర్తయ్యాయని, మిగతావి త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యానాయక్, ఆలయ ఈవో కృష్ణప్రసాద్, వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేశ్, ఇరిగేషన్ ఈఈ అమరేందర్రెడ్డి, పీఆర్ ఈఈ డీ సూర్యప్రకాశ్, ప్రజారోగ్య ఈఈ సంపత్, ఆలయ ఈఈ రాజేశ్, టీపీఎస్ అన్సారీ, తదితరులు పాల్గొన్నారు.