Singareni | రామగిరి, జూన్ 22 : సింగరేణి లో (ఎస్సీసీఎల్)లో బొగ్గు రవాణా వ్యవస్థ అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా కొనసాగుతోందని ఆర్జీ-3 జీఎం మధుసూదన్, ఏపీ ఏజీఏం బండి సత్యనారాయణ తెలిపారు. జీఎం కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు బొగ్గు ఉత్పత్తి అయిన క్షణం నుంచి వినియోగదారునికి చేరే వరకు ప్రతీ దశను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల బొగ్గు మాయమైందని, భారీ స్థాయిలో చోరీలు జరుగుతున్నాయంటూ వస్తున్న ఆరోపణలు వాస్తవాలకు దూరమని సంస్థ స్పష్టం చేశారు.
బొగ్గు రవాణాలో జీపీఎస్, ఆర్ఎఫ్ఐడీ, సీసీటీవీ, జియో ఫెన్సింగ్, డిజిటల్ వెయిబ్రిడ్జ్లు వంటి ఆధునిక వ్యవస్థలు అమల్లో ఉండటంతో అక్రమాలకు అవకాశం లేదని వెల్లడించారు. సింగరేణిలో ఉత్పత్తి అయ్యే బొగ్గులో సుమారు 85 శాతం రైల్వే మార్గం ద్వారా, మిగిలిన 15 శాతం రోడ్డు మార్గం ద్వారా వినియోగదారులకు సరఫరా అవుతోందన్నారు. హైదరాబాద్లోని మార్కెటింగ్ విభాగం ద్వారా SAP ఆధారిత వ్యవస్థలో బొగ్గు కేటాయింపులు జరుగుతాయని, ఏ వినియోగదారుడు ఎంత బొగ్గు ఎక్కడి నుంచి స్వీకరించాలో ముందుగానే డిజిటల్గా నమోదవుతుందని అధికారులు తెలిపారు.
రోడ్డు మార్గంలో రవాణా చేసే ప్రతీ వాహనం గని లేదా కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (సీహెచ్పీ) వద్ద ఎలక్ట్రానిక్ వెయిబ్రిడ్జ్పై తూకం వేస్తున్నామని, అనంతరం కంప్యూటర్ జనరేట్ చేసిన వే-బిల్ జారీ చేసిన తర్వాతే వాహనాలను విడుదల చేస్తారని పేర్కొన్నారు. జీపీఎస్, జియోఫెన్సింగ్ సాంకేతికతలతో వాహనాల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.బఅదేవిధంగా అన్ని వెయిబ్రిడ్జిలు కోల్నెట్ డిజిటల్ వ్యవస్థకు అనుసంధానమై ఉన్నాయని, లోడింగ్ సమయంలో నమోదయిన బరువును గమ్యస్థానంలో నమోదైన బరువుతో సరిపోల్చి పరిశీలిస్తారని వివరించారు. ఏదైనా వ్యత్యాసం గుర్తిస్తే వెంటనే విచారణ చేపడతారని తెలిపారు.
గనులు, వెయిబ్రిడ్జిలు, సీహెచ్పీలు, స్టాక్యార్డులు, ఎంట్రీ-ఎగ్జిట్ గేట్లు, రైల్వే సైడింగ్ల వద్ద సీసీటీవీ కెమెరాలు, ఆర్ఎఫ్ఐడీ ఆధారిత బూమ్ బ్యారియర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ వ్యవస్థల ద్వారా బొగ్గు రవాణా ప్రక్రియ మొత్తం 24 గంటల పాటు పర్యవేక్షణలో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ విలేకర్ల సమావేశంలో ఎస్వో జీఎం క్వాలిటీ రాం మోహన్, పర్సనల్ డీజీఏం సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.