అంతర్గాం, మే 16: రాష్ట్రంలో పాలన బ్రహ్మాండంగా సాగుతున్న టైంలో ఆచరణకు సాధ్యంకాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రైతులు సహా సబ్బండవర్గాలను నిండా ముంచిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లలో అనేక ఇబ్బందులు పెడుతున్నదని, రైతును ఏడిపించడం రేవంత్కు సరదాగా కావచ్చుగానీ, రైతు ఏడుపు రాష్ర్టానికి మంచిదికాదని చెప్పారు.
కేంద్రాలలో పేరుకుపోయిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. శనివారం పెద్దంపేట కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, మాట్లాడారు. నాడు కాంగ్రెస్ పుణ్యమాని వ్యవసాయ భూములు అమ్ముకొని పట్టణాలకు వలస వెళ్లిన రైతులు, బీఆర్ఎస్ హయాంలో మళ్లీ పల్లెలకు వచ్చి బతికారని వివరించారు. కేసీఆర్ రైతును రాజుగా చేస్తే, రేవంత్ రాచిరంపాన పెడుతున్నారని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ‘దోచుకో..దాచుకో’ అనే విధంగా సాగుతున్నదని, రైతులను ఆదుకునే ధ్యాసే లేదని ఆక్షేపించారు. మిల్లర్లతో మిలాఖతై ధాన్యం బస్తాల్లో కోత విధించడం దారుణమని, రైతు జీవితాలతో ఆడుకుంటున్న రేవంత్కు రాబోయే రెండేళ్లలో తగిన గుణపాఠం చెప్పేందుకు వారు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇక్కడ నాయకులు గోపు ఐలయ్య, శ్రీనివాస్రెడ్డి, బొడ్డుపల్లి శ్రీనివాస్, కొలిపాక మధుకర్రెడ్డి, కోల సంతోష్, సర్పంచ్ అముల పెద్ద శ్రీనివాస్, బండారి ప్రవీణ్, దొమ్మటి వాసు, మహేశ్ పాల్గొన్నారు.