కరీంనగర్, నవంబర్ 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్మపురి ప్రజా ఆశీర్వాద సభకు జనం బ్రహ్మరథం పట్టారు. నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చి జైకొట్టారు. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు సీఎం వస్తారని చెప్పినప్పటికీ.. మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట వరకే ధర్మపురిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి వేలాది మంది ప్రజలు చేరుకున్నారు. అప్పటికే సభాప్రాంగణం నిండిపోవడంతో బయట రోడ్లపైన బారులు తీరి నిలబడ్డారు. ముఖ్యంగా రాయపట్నం- జగిత్యాల రోడ్డు జనసంద్రంలా మారగా, చాలా మంది బస్సులు, ఆటోల్లో ఉండిపోయారు. అధినేత కేసీఆర్ సాయంత్రం 4.40 గంటలకు అభివాదం చేస్తూ సభా వేదికపైకి చేరుకోగా, కరతాళ ధ్వనులతో స్వాగతించారు.
‘జై కేసీఆర్’ ‘హ్యాట్రిక్ సీఎం’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడిన అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ధర్మపురి నర్సన్నకు, ఇక్కడి ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించి, పదిహేడు నిమిషాలపాటు తన స్పీచ్తో ఆకట్టుకున్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో జరిగిన ధర్మపురి అభివృద్ధితోపాటు నాడు సమైక్య రాష్ట్రంలో అనుభవించిన కష్టాలు, స్వరాష్ట్రంలో సాధించిన విజయాలను అర్థమయ్యేలా వివరించారు. ధర్మపురి పక్కనే గోదావరి పారుతున్నా.. నాడు పుష్కరాలు చేయలేదని, తన డిమాండ్ మేరకు పుష్కరాలు ప్రారంభమయ్యాయని, తెలంగాణ వచ్చిన తర్వాత ఘనంగా జరుపుకున్నామంటూ ధర్మపురి వైభవాన్ని, గోదావరి పుష్కరాల ఖ్యాతిని చాటి చెప్పారు.
ప్రజాస్వామంలో ఓటు ఒక వజ్రాయుధమని, ఓటు వేసే ముందు ఏ పార్టీకి వేస్తున్నామో ఆలోచించుకోవాలని, ఆ పార్టీ ప్రజలకు ఉపయోగపడుతుందా.. లేదా..? అభ్యర్థి ప్రజల మధ్యలో ఉంటాడా..? లేడా? చూడాలని, మంత్రి కొప్పుల ఈశ్వర్లాంటి సౌమ్యుడిని చూసి ఓటు వేయాలని చెప్పగానే.. సభికులంతా చప్పట్లతో మద్దతు ప్రకటించారు. దీనిని గమనించి కొప్పుల గాలి బాగున్నట్లు ఉన్నదని నవ్వుతూ అనడంతో మరోసారి.. ‘జై కేసీఆర్’ ‘జై కొప్పుల’ నినాదాలతో మారుమోగించారు. నాడు కరెంటు కోతలతో అల్లాడామని, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే బోరు, బాయికి రెండు వేలు వసూలు చేసే పరిస్థితి ఉండేదని, ఇవాళ ఆ పరిస్థితి ఉన్నదా..? అని సీఎం ప్రశ్నించారు.
ఇయాళ ట్రాన్స్ఫార్మర్లు కాలుడే లేదని, దబ్బున కాలినా ఈశ్వర్ లాంటి ఎమ్మెల్యేలు ఉన్నచోట 24 గంటల్లోనే కొత్తది పెడుతున్నారని, ఈ విషయాలన్నీ ఆలోచించాలని, ఆగమాగం కావద్దని సూచించారు. రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్న దేశంలో ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ప్రధాని సొంత రాష్ట్రంలోనూ ఈ సౌకర్యం లేదని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇంకా పరిపక్వత రావాలంటే.. మంచి నాయకులు ఉండాలన్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో రైతుల బాగుగోల గురించి ఆలోచన చేసిన పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని, అందులో నుంచి పుట్టిందే రైతుబంధు, రైతు బీమా పథకాలని ఉద్ఘాటించారు.
రైతుబంధు, రైతుబీమా, దళితబంధు లాంటి పథకాలను తనను ఎవరూ అడుగకపోయినా.. మీ అందరి కోసం పెట్టాను అని చెప్పడంతో సభికులు చప్పట్లతో హోరెత్తించారు. గతంలో అనేక సార్లు అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేయనోళ్లను, ధరణిని రద్దు చేస్తామన్న కాంగ్రెసోళ్లకు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునివ్వడంతో చేతులు పైకెత్తి మద్దతు తెలిపారు. కేసీఆర్ ప్రసంగిస్తున్నంత సేపూ ఆద్యంతం సభికులు జేజేలు పలికారు. మంత్రి కొప్పుల ఈశ్వర్పై ప్రశంసల వర్షం కురిపించగా, కరతాళ ధ్వనులతో జైకొట్టారు. మొత్తంగా సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తున్నది. ఈ ఊపుతో ముఖ్యమంత్రి చెప్పిన మెజార్టీకి అనుగుణంగా విజయం సాధించడం పక్కా అని సభికులు అక్కడే మాట్లాడుకోవడం కనిపించింది.
కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యే అయిన తర్వాత ధర్మపురి ఎట్ల ఉన్నది? అంతకు ముందు ఎట్లా ఉన్నది? ఆ తేడాను మీరు గమనించాలి. ఈశ్వర్ నా వెంట పడి పనులు చేయించుకున్నడు. ఇవ్వాళ దాదాపు 1.25 లక్షల ఎకరాల నుంచి 1.30 లక్షల ఎకరాలు ధర్మపురి నియోజకవర్గంలో బ్రహ్మాండంగా సాగవుతున్నది. పంటలకు పుష్కలంగా నీళ్లు వస్తున్నయి. మీరిది గుర్తించాలి. గతంలో ఇక్కడ చాలా మంది మహామహులు ఎమ్మెల్యేలుగా పనిచేసిన్రు. కానీ, వాళ్లు ఏం చేయలే. మీ అందరినీ కోరేది ఒక్కటే. ఈశ్వర్ సౌమ్యుడు. సింగరేణి కార్మికుడిగా పనిచేసి పైకి వచ్చిన వ్యక్తి. చాలా మృధు స్వభావి. ఆయన లాంటి మంచి వ్యక్తి గెలిస్తే ధర్మపురి అద్భుతంగా ముందుకుపోతది. ఇంత పెద్ద సభతోటి ఈశ్వర్ రిజల్ట్ డిక్లర్ అయిపోయింది. గెలిచిపోయిండని తెలిసిపోయింది. మీ అందరినీ ప్రార్థించేది ఒక్కటే. దయచేసి కారు గుర్తుకు ఓటేసి 75 నుంచి 80వేల ఓట్ల మెజార్టీతో ఈశ్వర్ను గెలిపించాలి.
– అధినేత కేసీఆర్
నా నియోజకవర్గ ప్రజలు నన్ను అనేక మార్లు ఆశీర్వదించారు. మరోసారి మీ బిడ్డగా మీ ముందుకొచ్చాను. ఈసారి కూడా ఆశీర్వదించండి.. నా జీవితం మొత్తం ఈ నియోజకవర్గ ప్రజలకే అంకితం చేస్తా. పేద కుటుంబంలో పుట్టిన నాకు రాజకీయ అవకాశం కేసీఆర్ ఇస్తే.. ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను అంచలంచెలుగా ఎత్తుకు ఎదిగేలా చేశారు. పేదింటి బిడ్డగా నాకు అందరి కష్టాలు తెలుసు. అన్ని వర్గాలను సమదృష్టితో చూస్తూ.. సీఎం సహకారంతో వందలాది కోట్లు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నా. ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు తల్లిదండ్రులతో సమానం. నియోజకవర్గం నుంచి ఏది అడిగినా కాదని చెప్పలేదు. వందల కోట్లు కేటాయించి.. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్లడానికి సహకరించారు. గతంలో మనం గోదావరి ఒడ్డునే ఉన్నా.. తాగేందుకు నీళ్లు లేని పరిస్థితి ఉండేది.
ఇప్పుడు పుష్కలమైన నీళ్లు వస్తున్నాయి. సాగునీటి కోసం నాడు అష్టకష్టాలు పడ్డ మనం ఈరోజు లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే స్థాయికి చేరుకున్నాం. ఇదంతా ప్రజలపై ప్రేమతో సీఎం ఆశీర్వాదంతో చేస్తున్నా. ఈసారి ఆశీర్వదిస్తే.. మీ బిడ్డగా, మీలో ఒకడిగా.. వందలాది కోట్లు తెచ్చి నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకెళ్తా. నియోజకవర్గ ప్రజలకు సేవచేసుకునే అవకాశాన్ని మరోసారి కల్పించాలి. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ధర్మపురి పట్టణంతోపాటు క్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం.
-ధర్మపురి ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి కొప్పుల ఈశ్వర్
మిమల్ని నేను కోరేదొక్కటే. నేను చెప్పే నాలుగు మాటలు మీ ఊర్లకు పోయిన తర్వాత చర్చించాలె. ఎందుకంటే ఎలక్షన్లు వస్తయి.. పోతయి. ఎవరో ఒకరు గెలుస్తరు. దాని తర్వాత ఏమైతది? ఇక్కడ గెలిచేటువంటి వ్యక్తిని అనుసరించి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతది. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. మిగతా రెండు పార్టీల నుంచి ఎవరో ఎల్లయ్యో.. పుల్లయ్యో నిలబడతడు. వీళ్ల వెనుక పార్టీలు ఉన్నయి. ఇక్కడే మీరు ఆలోచన చేయాలె. నిలబడ్డ వ్యక్తుల చరిత్ర చూడాలె. గుణ, గణం చూడాలె. ఆ తర్వాత వారు నిలబడ్డ చరిత్ర ఏంటి? ప్రజలకు ఏం చేసింది? దాని థృక్పథం ఏంటి? రైతాంగం విషయంలో కావచ్చు. పేదల విషయంలో కావచ్చు. ఆ విషయాలపై చర్చ జరగాలి. అలా జరినప్పుడే ప్రజలు గెలువడం స్టార్ట్ అయితది. ఎప్పటిదాకా ఈ భారతదేశంలో ప్రజలు గెలువరో.. అప్పటిదాకా ఈ దేశం గిట్లనే ఉంటది.
ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉండే వజ్రాయుధం ఓటు. ఆ ఓటు నీ తలరాతను మారుస్తది. నీ భవిష్యత్ను నిర్ణయం చేస్తది. అందుకే ఓటు ఆషామాషీగా, అడ్డగోలుగా వేయద్దు. గతంలో కాంగ్రెస్ యాభై ఏండ్లు పాలించింది. అప్పుడు ఏం చేయలేదు. ఇయాళ వచ్చి మళ్లో అవకాశం ఇవ్వాలని అంటున్నది. దేనికి? ఎందుకు పంటికి అంటకుండా మింగుదామనా..? ఇన్నేండ్లు చేయనోళ్లు ఇప్పుడేం చేస్తరు? ఇంకా రైతులకే భూహక్కులు కల్పించేందుకు ప్రవేశపెట్టిన ధరణిని రద్దు చేస్తా మంటున్నది. ధరణిని రద్దు చేస్తామనే వారికి మీ ఓటు హక్కుతో బుద్ధి చెప్పాలి.
ఈ రోజు కాంగ్రెస్తో పెద్ద ప్రమాదం ఉంది. రాహుల్గాంధీ బాగా మాట్లాడుతండు. ఆయనకు ఎద్దు ఎర్కనా..? ఎవుసం ఎర్కనా..? ఎక్కడన్నా దున్నిండా..? చూసిండా..? కానీ, ఆయన కూడా ధరణిని తీసేస్తం అంటండు. ధరణి పోర్టల్ తెచ్చిందెందుకు? తాకులాటలు లేకుండా ఉండేందుకే కదా! ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత రైతుల భూములు సేఫ్గా ఉన్నయి. సులభంగ ఎవరి మండలంలో వాళ్లకే రిజిస్ట్రేషన్ అయితున్నది. రైతుబంధు వస్తంది. రైతు చనిపోతే రైతు బీమా కింద ఆ ఇంటికి రూ.5 లక్షలు చేరుతున్నయి. మీ ధాన్యం కొన్న డబ్బుల కోసం ఎక్కడా తిరగకుండా ప్రభుత్వమే మీ బ్యాంకు ఖాతల వేస్తది. మరి కాంగ్రెస్ ధరణిని తీసేస్తే రైతుబంధు ఎట్ల రావాలె? రైతు బీమా ఎట్ల రావాలె? ధాన్యం కొన్న డబ్బులు ఎట్ల రావాలె? మళ్లీ పాత దుకాణం మొదలైతది. ఆగమాగమైతే కైలాసం ఆటల పెద్ద పాము మింగినట్లయితది. మళ్లీ కిందికే వస్తది.