ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ నెల 7న జగిత్యాలకు వస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. జగిత్యాల సమీకృత కలెక్టరేట్ను ప్రారంభిస్తారని, మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని, టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారని, అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారని వివరించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో గురువారం జగిత్యాలకు వచ్చిన ఆయన, మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులతో కలిసి సమీకృత కలెక్టరేట్ భవనం, మోతె శివారులో బహిరంగ సభా స్థలిని పరిశీలించారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై ప్రజాప్రతినిధులతోపాటు జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. బహిరంగ సభను విజయవంతం చేయాలని, పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చేలా చూడాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
జగిత్యాల, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 7న జగిత్యాలలో పర్యటిస్తారని, జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేస్తారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు వెల్లడించారు. కొద్ది నెలల క్రితమే ధరూర్ క్యాంపులో సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణం పూర్తయినా కొన్ని కారణాల వల్ల ప్రారంభోత్సవం ఆలస్యమైందని, ఈ పర్యటనలో ముఖ్యమంత్రి కలెక్టరేట్ను ప్రారంభిస్తారని చెప్పారు. అనంతరం కొత్త కలెక్టరేట్లో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో జిల్లా అభివృద్ధిపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహిస్తారన్నారు. అలాగే కలెక్టరేట్కు సమీపంలో 100 కోట్లతో నిర్మించనున్న జగిత్యాల మెడికల్ కాలేజీ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని, అనంతరం టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయ భవనాన్ని సైతం ప్రారంభిస్తారని తెలిపారు. జగిత్యాల అర్బన్ మండలంలోని మోతె గ్రామ శివారులో టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగిస్తారని చెప్పారు. గురువారం మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కలిసి మంత్రి హరీశ్రావు జగిత్యాలలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం, ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలను చేపట్టడం వల్లే జగిత్యాల ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం జగిత్యాల జిల్లా కల సాకారమైందని స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లాగా మారడంతో ఆరేండ్ల వ్యవధిలో రూపురేఖలు మారిపోయాయన్నారు. కొత్తగా మెడికల్ కాలేజీ మంజూరైందని, దీంతోపాటు సూపర్ స్పెషాలిటీ దవాఖాన సైతం అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. సకల హంగులతో జిల్లా కేంద్రం నడిబొడ్డున 25 ఎకరాల విస్తీర్ణంలో 100 కోట్లతో సమీకృత కలెక్టరేట్ భవనం పూర్తి కావడం, కొత్తగా 100 కోట్లతో మెడికల్ కాలేజీ భవనానికి శంకుస్థాపన జరుగుతున్నదంటే అది సీఎం కేసీఆర్ చలువే అని చెప్పారు.
మంత్రి హరీశ్రావు ముందుగా ఎమ్మెల్యే కాంపు కార్యాలయంలో సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి కొప్పుల, ఎమ్మెల్సీలు కవిత, టీ భా నుప్రసాద్రావు, పాడి కౌశిక్రెడ్డి, ఎల్ రమణ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, జగిత్యాల, వేములవాడ, చొప్పదండి, పెద్దపల్లి, ఆర్మూర్ ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్, చెన్నమనేని రమేశ్బాబు, సుంకె రవిశంకర్, దాసరి మనోహర్రెడ్డి, జీవన్రెడ్డితోపాటు అధికారులతో చర్చించారు. అనంతరం టీఆర్ఎస్ జిల్లా కార్యాల యం, సమీకృత కలెక్టరేట్ను పరిశీలించారు. అక్కడి నుంచి మోతె గ్రామ శివారులో బహిరంగ సభా స్థలికి చేరుకున్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుండగా, ప్రజాప్రతినిధులతోపాటు కలెక్టర్ రవి, ఎస్పీ సింధూశర్మ, ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు.
బహిరంగ సభకు మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇన్చార్జిగా వ్యవహరిస్తుండగా, సభ విజయవంతం కోసం ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేయడంతోపాటు ఒక్కో నియోజకవర్గానికి ఒక్క ఇన్చార్జిని నియమించారు. జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాలతోపాటు చొప్పదండి, వేములవాడ, పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ మండలాల నుంచి సైతం ప్రజలు హాజరయ్యేలా చూడాలని మంత్రి హరీశ్రావు సూచించారు. కోరుట్ల నియోజకవర్గానికి ఇన్చార్జిగా ఎమ్మెల్సీ ఎల్ రమణ, జగిత్యాలకు ఎమ్మెల్సీ తానిపర్తి భా ను ప్రసాద్రావు, వేములవాడకు మాజీ ఎమ్మె ల్సీ నారదాసు లక్ష్మణ్రావు, చొప్పదండికి సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, పెద్దపల్లికి ఎంపీ వెంకటేశ్ నేతకాని ఇన్చార్జిలుగా నియమించారు. ఆర్మూర్కు ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, బా ల్కొండకు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఇన్చార్జిగా వ్యవహరించనున్నారు. ఇక సభను విజయవంతం చేసేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పా టు చేశారు. బహిరంగ సభ స్థలి కమిటీ సభ్యులుగా నాచుపల్లి సింగిల్ విండో చైర్మన్ మెన్నేని రాజనర్సింగరావు, పోతారం సింగిల్ విండో చైర్మన్ ఐల్నేని సాగర్రావును నియమించారు. పార్కింగ్ కమిటీ సభ్యులుగా మల్యాల జడ్పీటీసీ సభ్యుడు కొండ పల్కల రామ్మోహన్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ను నియమించారు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్, జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణికి జగిత్యాల జిల్లా కేంద్రం అలంకరణ బాధ్యతలు అప్పగించారు. సాంస్కృతిక కమిటీ బాధ్యతలను ఎమ్మెల్యే రసమయి, సాయిచంద్కు అప్పగించారు. ప్రెస్ కమి టీ ఇన్చార్జిగా డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డిని నియమించారు. నిర్దేశిత నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలను బహిరంగ సభలో పాల్గొనేలా చూడాల్సిన బాధ్యతలను ఎమ్మెల్యేలకు అప్పగించారు.
రెండు లక్షల పదివేల మందికి పైగా ప్రజలు బహిరంగ సభకు హాజరయ్యే అవకాశాలున్నాయని, సభలో పాల్గొనేందుకు ఉత్సాహంగా ప్రతి ఒక్కరిని తీసుకువచ్చేలా చూడాలని పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలకు మంత్రి హరీశ్రావు సూచించారు. సభకు సంబంధించి వివిధ రూట్ల ను ఏర్పాటు చేయాలని, వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చేవారికి వివిధ చోట్ల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశా రు. బహిరంగ సభ సందర్భంగా ఎలాంటి ఇ బ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కార్యక్రమాల్లో జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్గౌడ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణరావు, జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ శ్రావణి ఉన్నారు.